తెలంగాణ

telangana

ఆగ్రహజ్వాలలు.. ప్రభుత్వ తీరుపై విమర్శలు

By

Published : Dec 30, 2020, 10:46 PM IST

విజయనగరం జిల్లా రామతీర్థం ఘటనతో ఏపీలో ఆగ్రహజ్వాలలు వెల్లువెత్తాయి. అభినవ భద్రాద్రిగా భావించే... రామతీర్థం శ్రీరాముడి విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని రాజకీయ పార్టీలు, హిందూ సంఘాలు తీవ్రంగా ఖండించాయి. పథకం ప్రకారమే హిందూ ఆలయాలపై దాడులు జరుగుతున్నాయని ఆరోపించాయి. ఘటనకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.

rama temple
rama temple

ఏపీ విజయనగరం జిల్లాలోని పవిత్ర పుణ్యక్షేత్రం రామతీర్థం విగ్రహ ధ్వంసం ఘటనపై రాజకీయ పార్టీలు, హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఘటనపై భాజపా- తెదేపా నేతలు ఆందోళనకు దిగగా.. పలు హిందూ సంఘాలు మండిపడ్డాయి. రామతీర్థం కొండపై తెదేపా ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టారు. హిందూ ఆలయాలపై వరుస దాడులు జరుగుతున్నా... వైకాపా ప్రభుత్వం పట్టించుకోవటం లేదంటూ... రామతీర్థంపై భాజపా నేతలు నిరసన దీక్ష చేపట్టారు. రాముడి విగ్రహాన్ని ధ్వంసం చేయడమంటే హిందూవుల మనోభావాలను దెబ్బతీయడమే అని విశాఖలో హిందూ సంఘాలు ఆరోపించాయి. అభినవ భద్రాద్రిగా భావించే.. రామతీర్థం శ్రీరాముడి విగ్రహం ధ్వంసం చేయటం దురదృష్టకరమన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఏం జరిగింది

మంగళవారం సాయంత్రం రామతీర్థం కొండపైనున్న రాముడి విగ్రహాన్ని.. గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. తల లేని రాముడి విగ్రహాన్ని గమనించిన భక్తులు.. ఆలయ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఎస్పీ రాజకుమారితో పాటు స్థానిక పోలీసులు విగ్రహాన్ని పరిశీలించారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం గాలింపు చేపట్టారు. విగ్రహ ధ్వంసం ఘటనపై విచారించేందుకు ఆర్‌జేసీ డి.భ్రమరాంబను విచారణాధికారిగా నియమించారు. రామతీర్థం కొండపై రామకొలనులో రాముడి విగ్రహ శకలం లభ్యమైంది. లోతైన కొలనులో ఉదయం నుంచి గాలింపు చేపట్టగా... శ్రీరాముడి విగ్రహ శకలం దొరికింది. చినజీయర్‌స్వామి ఆశ్రమం ప్రతినిధులతో విగ్రహ పునఃప్రతిష్ఠకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఉదాహరణ: చంద్రబాబు

రామతీర్థం ఘటనపై రాజకీయపక్షాలు తీవ్రంగా స్పందించాయి. రాముడి విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని తెదేపా అధినేత చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. 4 శతాబ్దాల చరిత్ర ఉన్న రామతీర్థంలో విగ్రహాల ధ్వంసం.. వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఉదాహరణన్నారు. దేవాలయాలపై వరుస దాడులు, విధ్వంసాలు అనేకం జరుగుతున్నా.. సీఎం జగన్ చోద్యం చూడటం గర్హనీయమన్నారు.

పథకం ప్రకారమే దాడులు: పవన్

హిందూ దేవాలయాలపై దాడులు పెరిగిపోతుంటే ముఖ్యమంత్రి జగన్​ ఎందుకు స్పందించటం లేదని జనసేన పార్టీ వ్యవస్థాపకుడు పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. జగన్​కు ఏ మత విశ్వాసం ఉన్నా.. పరమతాలను గౌరవించాలన్నారు. హిందూ మతంపై ఒక పథకం ప్రకారమే దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. దేవాలయాలపై వరుస ఘటనలపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని పవన్ కల్యాణ్ డిమాండ్‌ చేశారు.

ప్రధానికి ఎంపీ రఘురామ లేఖ

రామతీర్థం ఘటనపై వైకాపా ఎంపీ రఘురామ కృష్ణరాజు తీవ్రంగా స్పందించారు. హిందూ ఆలయాలపై జరుగుతున్న దాడులపై ప్రధాని మోదీకి లేఖ రాశారు. వైకాపా అధికారంలోకి వచ్చిన 18 నెలల కాలంలో అంతర్వేది రథం దగ్ధం మొదలుకుని.. తాజాగా విజయనగరం జిల్లా రామతీర్థంలో రాముడి విగ్రహం ధ్వంసం వరకూ అనేక దాడులు జరిగాయని లేఖలో వివరించారు. దాడులపై విచారణకు కేంద్ర బృందాన్ని పంపించి నిందితులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి: స్వరూపానందేంద్ర

రామతీర్థం కోదండరాముని విగ్రహం ధ్వంసం ఘటనపై విశాఖ శ్రీశారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రతి ఆలయంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కోరారు.

ఇదీ చదవండి:రామకొలనులో రాముడి విగ్రహ శకలం లభ్యం

ABOUT THE AUTHOR

...view details