ఆధునికులం అనిపించుకున్నా కొంతమందికి మరోసారి పుడమి తల్లి బాట పట్టాలని ఉంటుంది. హలం పట్టి, పొలం దున్నాలనే కోరిక కలుగుతుంది. పట్టెడన్నం పెట్టే రైతు అనిపించుకోవాలనే గర్వం కలుగుతుంది. రేణుదీ అదే మనస్తత్వం. భర్త ఉద్యోగరీత్యా కొన్నాళ్లు దిల్లీలో ఉందామె. అక్కడ టెర్రస్ మీద ఏవో కూరగాయలు, ఆకుకూరలు పెంచేది. కొన్నాళ్ల తర్వాత హైదరాబాద్ వచ్చింది. ఇక్కడ అపార్ట్మెంట్లో మొక్కలు పెంచడానికి స్థలం ఉండేది కాదు. ఆ కొరత మొక్కలే కాదు.. వ్యవసాయమూ చేయాలనే తపన పెరిగేలా చేసింది.
రెండు సార్లు విఫలమైనా..
తనలాంటి ఆలోచన, ఆసక్తి ఉన్న అభినవ్ కలిశాడు. ఇద్దరూ కలిసి వికారాబాద్లో నాలుగున్నర ఎకరాల స్థలం తీసుకున్నారు. సేంద్రియ పద్ధతిలో సేద్యం మొదలుపెట్టారు. ఏడేళ్లలో విదేశాల నుంచి ఎన్నో రకాల విత్తనాలు తీసుకొచ్చి ప్రయోగాల సాగు చేస్తున్నారు. రెండేళ్లుగా గ్లాస్ జెమ్ అనే దక్షిణామెరికా పంట పండించడానికి ప్రయత్నించారు. రెండు సార్లు విఫలం అయినా ఈసారి విజయం సాధించారు. రంగురంగుల మొక్కజొన్న పొత్తులు అచ్చం ముత్యాల్లాగే ఉండటం విశేషం.