మాదాపూర్లోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసే ప్రశాంత్ 2017 ఏప్రిల్ 11న అదృశ్యమయ్యాడు. మాదాపూర్ పోలీసులు 29న కేసు నమోదు చేసుకుని దర్యాప్తుచేశారు. ఆచూకీ లభించకపోవడంతో కేసును మూసేశారు.
ఇద్దరు వ్యక్తులు ఇంటికొచ్చి...
ఏడెనిమిది నెలల కిందట ఇద్దరు వ్యక్తులు తమ ఇంటికొచ్చినట్లుగా ప్రశాంత్ అన్నయ్య శ్రీకాంత్ ‘ఈనాడు’కు చెప్పారు. వారే తర్వాత విశాఖలో ఉన్న తండ్రి బాబురావును కలిశారన్నారు. వారిలో ఒకరు ‘మీ కుమారుడు ఇప్పుడెక్కడున్నాడు?ఎప్పటి నుంచి కనిపించడంలేదు? ఏం చేసేవాడు? అని హిందీలో అడిగారని బాబురావు తెలిపారు. నెల తర్వాత ఇంకొకరు వచ్చి అవే ప్రశ్నలు అడిగారని, మీరెవరని అడిగితే బదులు ఇవ్వకుండానే వెళ్లిపోయాడని చెప్పారు. మాదాపూర్ పోలీసుల దృష్టికి తీసుకెళ్తే దౌత్యకార్యాలయం నుంచి ఫోన్ వస్తుందంటూ చెప్పారన్నారు.
2014లో విశాఖపట్నం నుంచి!
ప్రశాంత్ తండ్రి బాబురావు ప్రైవేటు ఉద్యోగి. విశాఖపట్నంలో ప్రశాంత్ బీటెక్(కంప్యూటర్ సైన్స్) చేశాడు. 2014లో వీరి కుటుంబం హైదరాబాద్కు మారింది. ఇంజినీరింగ్ తర్వాత ప్రశాంత్ బెంగళూరులోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఏడాదిన్నరపాటు పనిచేశాడు.
ఇదీ చదవండీ... "ప్రశాంత్ ప్రేమ విఫలమై డిప్రెషన్లో ఉన్నాడు"
ఆమెతో ప్రేమ...
అక్కడే మధ్యప్రదేశ్ కట్నీ ప్రాంతానికి చెందిన స్వప్నికాపాండే అనే యువతితో ప్రేమలో పడ్డాడని కుటుంబసభ్యులు చెప్పారు. తర్వాత మాదాపూర్లోని షోర్ ఇన్ఫోటెక్లో చేరినట్లుగా తెలిపారు. ప్రేమ విఫలం కావడంతో తీవ్ర మనస్తాపానికి గురై మానసికంగా స్థిమితంగా లేడని చెబుతున్నారు. ఆమె కోసమే దారి తప్పి పాక్లోకి ప్రవేశించి ఉంటాడని అనుమానిస్తున్నారు. ఈ రెండేళ్లు ఎక్కడున్నాడనేది మిస్టరీగా మారింది.