తెలంగాణ

telangana

ETV Bharat / city

'భారీ గణపయ్యల కంటే చిట్టి లంబోదరులే ముద్దు'

హైదరాబాద్ మహానగరంలో మట్టి వినాయక విగ్రహాలకు గిరాకీ పెరిగింది. మార్కెట్‌లో ఎక్కడ చూసిన మట్టి గణపతుల దర్శనమే. 'ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌'తో తయారు చేసిన విగ్రహ దుకాణాలు వెలవెలబోతున్నాయి. కరోనా పరిస్థితుల దృష్ట్యా మట్టి విగ్రహాలు పూజించి ప్రకృతిని ఆరాధిస్తామంటున్న నగరవాసులు... భారీ గణపయ్యల కంటే చిట్టి లంబోదరులే ముద్దంటూ తీసుకెళ్తున్నారు.

By

Published : Aug 21, 2020, 8:38 PM IST

'భారీ గణపయ్యల కంటే చిట్టి లంబోదరులే ముద్దు'
'భారీ గణపయ్యల కంటే చిట్టి లంబోదరులే ముద్దు'

'భారీ గణపయ్యల కంటే చిట్టి లంబోదరులే ముద్దు'

రాష్ట్ర రాజధాని వాసులు చవితి పండగకు సిద్ధమవుతున్నారు. కరోనా వైరస్ దృష్ట్యా ఈసారి గణేశుడి వేడుకలు నిరాడంబరంగా జరుపుకోవాలని భావిస్తున్నారు. నగరంలోని ముఖ్య కూడళ్లలో కొవిడ్ మార్గదర్శకాలు పాటిస్తూ విగ్రహాలు కొనుగోలు చేస్తున్నారు. చాలామంది మట్టి విగ్రహాల వైపే దృష్టి సారిస్తున్నారు. ఒక అడుగు నుంచి మూడు, నాలుగు అడుగులున్న విగ్రహాలు కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారు. కనిష్టంగా రూ.30 నుంచి గరిష్ఠంగా రూ.15 వందల వరకు మట్టి విగ్రహాల ధరలు పలుకుతున్నాయి. రంగుల విగ్రహాలు అమ్మే కేంద్రాలు వెలవెలబోతున్నాయి. ఇళ్లల్లో పెట్టి పూజ చేసుకునే వాళ్లతోపాటు.. అసోసియేషన్లు, కాలనీ సంఘాలు, యువజన సంఘాల వాళ్లు.. మట్టి విగ్రహాలు పెట్టేందుకే మొగ్గుచూపుతున్నారు.

కొనుగోలు కేంద్రాల వద్ద సందడి..

వైరస్‌ వల్ల ఈసారి పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియక తయారీదారులు కొద్ది మొత్తంలోనే మట్టి విగ్రహాలు తయారు చేశారు. జనం ఒక్కసారిగా మట్టి విగ్రహాల వైపు మొగ్గు చూపడంతో కూకట్‌పల్లి, ఎర్రగడ్డ, మోతీనగర్, ఫిల్మ్‌నగర్, దిల్‌సుఖ్‌నగర్, ఎల్బీనగర్, వనస్థలిపురం సహా అనేక ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాల వద్ద సందడి నెలకొంది. వివిధ రూపాల్లో తయారైన మట్టి గణపయ్యలను ఇష్టంగా తీసుకెళ్తూ కరోనా రక్కసి సమసి పోవాలని కోరుకుంటున్నారు. జీహెచ్​ఎంసీ, హెచ్​ఎండీఏ కూడా నగరంలో లక్షకుపైగా మట్టి ప్రతిమలు పంపిణీ చేస్తోంది.

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్యర్యంలో...

ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ నేతృత్వంలో అబిడ్స్ ఫంక్షన్‌హాల్‌లో విత్తన గణేష్ విగ్రహాలు ఉచితంగా పంపిణీ చేశారు. హైదరాబాద్ ఐఎస్‌ సదన్‌లో బస్తీల సంక్షేమ సంఘం ప్రతినిధుల ద్వారా సుమారు వెయ్యి వరకు మట్టి గణపతులు పంపిణీ చేశారు. చిలకలగూడ వద్ద ఇంద్రన్న ప్రజా సేవ ఆధ్వర్యంలో ఉచితంగా మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు.

బాలాపూర్ గణేశుడు సైతం..

బాలాపూర్ గణేశుడు సైతం నవరాత్రులకు ముస్తాబవుతున్నాడు. కొవిడ్ పరిస్థితుల దృష్ట్యా ఆరడుగుల విగ్రహాన్ని మండపంలో కొలువుదీర్చారు. కరోనా పరిస్థితుల్లో ఇంట్లోనే వినాయక పూజలు నిర్వహించుకోవాలని అర్చక సంఘాలు విజ్ఞప్తి చేశాయి. పండగవేళ ప్రతి ఇల్లు ఒక దేవాలయం కావాలని ఆకాంక్షించాయి. భౌతికదూరం పాటించి.. చవితి నిర్వహించుకోవాలని విశ్వహిందూ పరిషత్ విజ్ఞప్తి చేసింది.

ఇవీ చూడండి:డీలాపడ్డ పూల మార్కెట్​.. ఆవేదన చెందుతున్న రైతులు

ABOUT THE AUTHOR

...view details