తెలంగాణ

telangana

ETV Bharat / city

మా ఊరికి రావొద్దంటూ.. డప్పుకొట్టి చెబుతున్నఅక్కడి గ్రామస్థులు

వ్యక్తుల మధ్యే దూరం పెంచిన.. కరోనా వైరస్ ఇప్పుడు ప్రాంతాల మధ్య దూరం పెంచుతోంది. కరోనా వైరస్​ కన్నపేగును కాటేసినా.. రక్తం పంచుకున్న వాళ్లు వైరస్​తో కన్నుమూసినా... దగ్గరికి వెళ్లలేని పరిస్థితి. భౌతికదూరం పాటించి మహమ్మారిని తరిమికొట్టాలనుకోవడం మంచిదే కానీ... ప్రాంతాల మధ్య అంతరాలు పెంచడమే బాధాకరం. మా ఊరికి రావొద్దంటూ... దండోరా వేయించడమే దారుణం.

By

Published : May 15, 2020, 6:03 PM IST

hindhupuram-people-no-entry-in-karnataka
మా ఊరికి రావొద్దంటూ.. డప్పుకొట్టి చెబుతున్నఅక్కడి గ్రామస్థులు

ఏ ఊరికి వెళ్లినా కరోనా వైరస్ పట్ల జాగ్రత్తగా ఉండాలని, శానిటైజర్లతో చేతులు తరుచూ శుభ్రం చేసుకుంటూ, మాస్కులు ధరించాలనే ప్రచారం వినిపిస్తోంది. కానీ కర్ణాటక రాష్ట్రంలో ఇందుకు భిన్నంగా హిందూపురం ప్రజలను రానివ్వొద్దంటూ.. ప్రచారం జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్​లోని అనంతపురం జిల్లాలో వైరస్ బాధితులు ఎక్కువగా హిందూపురానికి చెందిన వారు కావడమే ఇందుకు కారణం. దీనిపై జిల్లా యంత్రాంగం తగిన చర్యలు తీసుకుంటున్నా... ప్రచారమే కర్ణాటకతో మానవీయ సంబంధాలను దూరం చేస్తోంది. తమ గ్రామాలకు హిందూపురం ప్రజలు ఎవరూ రావద్దంటూ కర్ణాటక రాష్ట్ర అధికారులు సరిహద్దు గ్రామాల్లో చాటింపు వేయిస్తున్నారు.

ఏ వస్తువు కొనాలన్నా..

అనంతపురం జిల్లా హిందూపురం సరిహద్దులో కర్ణాటక రాష్ట్రం ఉంది. ఆ జిల్లాలో ప్రజలకు బంధుత్వాలన్నీ ఎక్కువగా కర్ణాటక వారితోనే ఉంటాయి. వివాహ బంధుత్వాలు మొదలు, ఏ వస్తువు కొనాలన్నా కర్ణాటకలోని బెంగళూరుకో, తుంకూరు జిల్లా కేంద్రానికో వెళ్తారు. హిందూపురం పట్టణం దాటి వెళితే ఆంధ్ర ప్రజలంతా కన్నడ భాష మాట్లాడేవారే. ఇంతగా కర్ణాటక రాష్ట్రంతో సంబంధాలున్నా.. ఆయా గ్రామాల్లో ప్రవేశం లేదు.

అధికారుల ఆంక్షలు..

మడకశిర నియోజకవర్గంలోని పలు గ్రామాల ప్రజలను కూడా కర్ణాటకలోకి రాకూడదని అక్కడి అధికారులు ఆంక్షలు పెడుతున్నారు. కర్ణాటకలోని మధుగిరి తాలుకాలోని పలు గ్రామాల్లో ఆంధ్రప్రజలను రానీయవద్దంటూ చాటింపు వేయిస్తున్నట్లు తెలిసింది. హిందూపురం నుంచి కేవలం 22 కిలోమీటర్ల దూరంలో కొడిగోనహళ్లి పట్టణం ఉంది. హిందూపురం నుంచి ఎవరైనా వస్తే వెంటనే తమకు తెలియచేయాలని ప్రజలకు చెబుతున్నారు అధికారులు. నిత్యావసరాల కొనుగోలుకు కర్ణాటకలోనికి వెళ్లలేకపోతున్నట్టు హిందూపురం, మడకశిర శివారు గ్రామాల సరిహద్దు ప్రజలు వాపోతున్నారు. కరోనా... ఇంకా ఎన్ని అనర్థాలు సృష్టిస్తుందో వేచి చూడటం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి..!

ఇదీ చదవండి:ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నం

ABOUT THE AUTHOR

...view details