సరదాగా తిరుగుతూ మంచి సంపాదననూ పొందవచ్చు. కరోనా కారణంగా దాదాపు 2020 సంవత్సరమంతా అన్ని దేశాలూ లాక్డౌన్ విధించాయి. దీంతో అందరూ ఇళ్లకే పరితమయ్యారు. సందర్శనలు, పర్యటనలు వాయిదా పడ్డాయి. ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబడుతుండటంతో ప్రజలు కొత్త ప్రదేశాలు చుట్టి రావడానికి ఆసక్తి చూపుతున్నారు. దీంతో మళ్లీ పర్యటకానికి డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం ఇందిరా గాంధీ నేషనల్ ట్రైబల్ యూనివర్సిటీ(ఐజీఎన్టీయూ), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్(ఐఐటీటీఎం) సంయుక్తంగా 2021-2024 విద్యాసంవత్సరానికి దేశ వ్యాప్తంగా బీబీఏ, ఎంబీఏ(టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్) కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తున్నాయి.
అర్హత
బీబీఏలో చేరడానికి కనీసం 50 శాతం మార్కుల(ఎస్సీ/ ఎస్టీలు 45 శాతం)తో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వయసు జులై 1, 2021 నాటికి 22 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు వయసు సడలింపు ఉంది. ఎంబీఏలో చేరాలనుకునే అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కులతో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు మేనేజ్మెంట్ ప్రవేశపరీక్ష (మ్యాట్/ క్యాట్/ సీమ్యాట్/ గ్జాట్/ జీమ్యాట్/ ఏటీఎంఏ)లో అర్హత మార్కులు సాధించి ఉండాలి. వయసు జులై 1, 2021 నాటికి 27 ఏళ్లు మించకూడదు.
దరఖాస్తు ఎలా?
ఆసక్తి కలిగిన బీబీఏ, ఎంబీఏ అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులకు చివరి తేది మే 21, 2021. ఐజీఎన్టీయూ, ఐఐఎన్టీయూ సంయుక్తంగా నిర్వహించే ఐఐఏటీ ప్రవేశ పరీక్ష జూన్ 6, 2021న ఉంటుంది. గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ జూన్ 14 నుంచి 18 తేదీల్లో ఉంటాయి. తుది జాబితా జూన్ 25న వెల్లడిస్తారు. తరగతులు జులై 19 నుంచి ప్రారంభమవుతాయి.
ఎంపిక విధానం
విద్యార్థులను ఐజీఎన్టీయూ, ఐఐటీటీఎం అడ్మిషన్ టెస్ట్ (ఐఐఏటీ), గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంబీఏలో చేరే విద్యార్థులు మ్యాట్/ క్యాట్/ సీమ్యాట్/ గ్జాట్/ జీమ్యాట్/ ఏటీఎంఏ ప్రవేశ పరీక్షల్లో అర్హత మార్కులు సాధించినా సరిపోతుంది. ప్రవేశ పరీక్షలో 70 శాతం, గ్రూప్ డిస్కషన్లో 15 శాతం, పర్సనల్ ఇంటర్వ్యూలో 15 శాతం వెయిటేజీ లెక్కిస్తారు. బీబీఏ సీట్లు గ్వాలియర్, భువనేశ్వర్, నోయిడా, నెల్లూరు ప్రాంగణాల్లో అందుబాటులో ఉన్నాయి. ఎంబీఏకు ఈ నాలుగు ప్రాంగణాలతోపాటు గోవాలోని ఇన్స్టిట్యూట్లోనూ ప్రవేశం పొందవచ్చు. ఐఐఏటీ పరీక్ష 100 మార్కులకు అబ్జెక్టివ్ తరహాలో ఉంటుంది. 100 ప్రశ్నలు ఇస్తారు. జనరల్ అవెర్నెస్ నుంచి 50, వర్బల్ ఎబిలిటీ నుంచి 25, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుంచి 25 ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు. రుణాత్మక మార్కులు లేవు. రిజర్వేషన్ల ప్రకారం సీట్ల కేటాయింపు ఉంటుంది. ఈ ఎంపికలను మధ్యప్రదేశ్లోని ఐజీఎన్టీయూ (అమర్కంఠక్), ఐఐటీటీఎం (గ్వాలియర్) చేపడుతున్నాయి.
ఫీజుల వివరాలు
బీబీఏ కోర్సు కాలవ్యవధి మూడేళ్లు. మొత్తం రూ.2,79,350 ఖర్చవుతుంది. రెండేళ్ల ఎంబీఏ కోర్సుకు రూ.3,39,850 చెల్లించాల్సి ఉంటుంది. ఒక్కో ఏడాది రెండు సెమిస్టర్లు ఉంటాయి. వసతితో పాటు ఇతర ఖర్చులు అదనం.
ఇతర కోర్సులు.. కావాల్సినఅర్హతలు
పర్యటక రంగంలో స్థిరపడటానికి ఉపకరించే గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్తోపాటు దేశంలోని కొన్ని విశ్వవిద్యాలయాలు మాస్టర్ ఆఫ్ టూరిజం అడ్మినిస్ట్రేషన్కోర్సును అందిస్తున్నాయి. మేనేజీరియల్, అడ్మినిస్ట్రేషన్ స్థాయి ఉద్యోగాలు పొందడానికి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ తోడ్పడుతుంది.
ప్రపంచస్థాయి సంస్థ అయిన ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ (ఐఏటీఏ) ప్రయాణ, పర్యటక, కార్గో పరిశ్రమలకు సంబంధించి సర్టిఫికెట్ కోర్సులు అందిస్తోంది. ఏదైనా విదేశీ భాష వచ్చి ఉంటే అదనపు అర్హతగా పరిగణిస్తారు. పబ్లిక్ రిలేషన్స్లో లేదా అడ్వటైజింగ్డిప్లొమా కలిగి ఉంటే కెరియర్ ఎదుగుదలకు ఉపయోగపడుతుంది.
ప్రభుత్వ రంగ సంస్థల్లో కార్యాచరణ ఉద్యోగాలకు ట్రావెల్, టూరిజం డిగ్రీ ఉత్తీర్ణులైన వారికి డిమాండ్ ఉంటుంది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహించే పోటీ పరీక్షల్లో అర్హత సాధించిన వారిని టూరిజం డిపార్ట్మెంట్లో ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ పోస్టులకు ఎంపిక చేస్తారు. భారతదేశ చరిత్ర, కళలు, నిర్మాణంపై అవగాహన, ఆంగ్ల భాషా నైపుణ్యం ఉంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహించే పోటీ పరీక్షలకు హాజరుకావచ్చు.
గ్రాడ్యుయేషన్: ఇంటర్ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణులైనవారు టూరిజంలో అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో చేరడానికి అర్హులు.
- బ్యాచిలర్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (టూరిజం అండ్ ట్రావెల్)
- బ్యాచిలర్ ఆఫ్ టూరిజం మేనేజ్మెంట్
- బీఎస్సీ ట్రావెల్ అండ్ టూరిజం మేనేజ్మెంట్
సర్టిఫికెట్: 10+2 ఉత్తీర్ణులైన వారు టూరిజం సర్టిఫికెట్ కోర్సులకు అర్హులు.
డిప్లొమా: అడ్వాన్స్ డిప్లొమా ఇన్ ట్రావెల్ అండ్ టూరిజం మేనేజ్మెంట్
- డిప్లొమా ఇన్ ట్రావెల్ అండ్ టూరిజం మేనేజ్మెంట్
పోస్ట్ గ్రాడ్యుయేషన్: మాస్టర్ ఆఫ్ టూరిజం అడ్మినిస్ట్రేషన్ - ఈ రెగ్యులర్కోర్సు వ్యవధి రెండేళ్లు. దీనికి కేంద్ర పర్యటకశాఖ అనుమతి ఉంది. ఏదైనా గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులైనవారు ఆయా సంస్థలు నిర్వహించే ప్రవేశపరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూలో అర్హత సాధించడం ద్వారా ఈ కోర్సులో ప్రవేశం పొందవచ్చు.
- ఎంబీఏ టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్ - ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. మేనేజ్మెంట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (మ్యాట్)/కామన్ అడ్మిషన్ టెస్ట్ (క్యాట్)/కామన్ మేనేజ్మెంట్ అడ్మిషన్ టెస్ట్ (సీమ్యాట్)/ గ్జేవియర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (గ్జాట్)/ గ్రాడ్యుయేట్ మేనేజ్మెంట్ అడ్మిషన్ టెస్ట్ (జీమ్యాట్)/ఆత్మా(ఎయిమ్స్ టెస్ట్ ఫర్ మేనేజ్మెంట్ అడ్మిషన్స్)లలో అర్హత సాధించి ఉండాలి.
- పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ టూరిజం
- ఎంబీఏ (టూరిజం అండ్ ట్రావెల్)
- ఎంబీఏ ఇన్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్
- ఎంబీఏ టూరిజం అండ్ హాస్పిటాలిటీ
- పీహెచ్డీ ఇన్ టూరిజం
- పీహెచ్డీ ఇన్ ట్రావెల్ అండ్ టూరిజం
అందిస్తున్న సంస్థలు..
- నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్, హైదరాబాద్.
- మహాత్మా గాంధీ యూనివర్సీటీ, నల్గొండ.
- ఆచార్య నాగార్చున యూనివర్సీటీ, గుంటూరు.
- ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్, నెల్లూరు.
- అమిటీ యూనివర్సిటీ
- చండీగఢ్ యూనివర్సిటీ