ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిధిలో.. ఆరేళ్ల కిందట జరిగిన భూముల కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయంటూ.. తుళ్లూరు మండలం వెలగపూడికి చెందిన సలివేంద్ర సురేష్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అమరావతి భూముల్లో అక్రమాలు జరిగాయంటూ ఏపీ అసెంబ్లీలో జరిగిన చర్చ, పత్రికల్లో వచ్చిన వార్తల ఆధారంగా తాను సమాచారం సేకరించానని.... కొంతమంది వ్యక్తులు, కొన్ని సంస్థల ప్రతినిధులపై ఫిర్యాదు చేశారు. సురేష్ ఫిర్యాదు ఆధారంగా ఏపీ సీఐడీ విభాగం... ప్రాథమిక విచారణ జరిపి.. లలిత సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, నార్త్ వెస్ట్ హోల్డింగ్ సంస్థ భాగస్వామ్యులు, వెర్టెక్స్ హోమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ భాగస్వాములు, గాయత్రీ రియల్టీస్, గుడ్లైఫ్ ఎస్టేట్స్, కిలారు శ్రీహాస అనే వారిపై సెప్టెంబర్ 2020లో ఉమ్మడి ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసి.. ఐపీసీ సెక్షన్ 420, 409, 406, 120-బీ కింద కేసులు నమోదు చేశారు. ప్రభుత్వంలోని కొందరు పెద్దలతో ఉన్న పరిచయాల వల్ల.. రాజధాని ఏ ప్రాంతంలో వస్తుందో ముందుగా తెలుసుకుని.. ఆ ప్రాంతాల్లో రాజధాని అధికారిక ప్రకటన కంటే ముందుగానే 2014 జూన్ నుంచి డిసెంబర్ మధ్య భూములు కొన్నారని వీరిపై అభియోగాలు నమోదు చేశారు.
పిటిషన్ల దాఖలు.....
తమపై కుట్ర పూరితంగా కేసులు నమోదు చేశారని... తాము ఎలాంటి అవకతవకలకు పాల్పడలేదని... తమపై ఉమ్మడిగా నమోదైన ఎఫ్.ఐఆర్ ను రద్దు చేయాలంటూ.. కేసులు నమోదైన వ్యక్తులంతా వేర్వేరుగా క్వాష్ పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై జస్టిస్ మానవేంద్రరాయ్ నేతృత్వంలోని సింగిల్ జడ్జ్ బెంచ్ మంగళవారం విచారణ నిర్వహించి తీర్పు వెలువరించింది.
ఇన్సైడర్ ట్రేడింగ్ కాదు....
పిటిషనర్ల తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు సిద్దార్థ లూథ్రా, పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించగా.. ప్రభుత్వం తరపున అడ్వొకేట్ జనరల్ వాదనలు వినిపించారు. ఆరేళ్ల క్రితం చట్టప్రకారంగా జరిగిన భూముల కొనుగోళ్లపై.. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం కుట్రపూరితంగా కేసులు నమోదు చేసిందని సిద్ధార్థ లూథ్రా వాదించారు. రాజధాని వస్తుందన్న ముందస్తు సమాచారంతోనే భూములు కొనుగోళ్లు చేశారన్న సీఐడీ వాదనలో ఏమాత్రం వాస్తవం లేదన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన వెంటనే విజయవాడ-గుంటూరు మధ్య కృష్ణానది చెంతన రాజధాని వస్తుందని ప్రకటించారని.. రాజధాని ఎక్కడ వస్తుందన్న విషయంపై అనేక పత్రికల్లో కథనాలు వచ్చాయని.. కాబట్టి ఇది రహస్యమైన విషయమేమీ కాదని లూథ్రా కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఫిర్యాదుదారుడికి భూముల కొనుగోళ్లతో ఎలాంటి సంబంధం లేదని.. బయట వ్యక్తుల ప్రోద్భలంతోనే ఫిర్యాదు చేసినట్లుగా అర్థమవుతోందన్నారు. ప్రైవేటు భూములు కొనుగోళ్లకు క్రిమినల్ చర్యలు ఆపాదించడం చట్టప్రకారం సమంజసంగా లేదన్నారు. భూముల లావాదేవీల్లో అమ్మకందార్లకు ఎలాంటి నష్టం జరగలేదని... వారిని బలవంతం చేయలేదని.. ఇష్టపూర్వకంగానే క్రయ విక్రయాలు జరిగాయని స్పష్టం చేశారు. ఎలాంటి మోసం లేనందున సీఐడీ నమోదు చేసిన ఐపీసీ 420, అనుబంధ సెక్షన్లకు అర్థమే లేదన్నారు. ఈ వ్యవహారంలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందంటూ సీఐడీ మోపిన అభియోగాలు అర్థరహితం అన్నారు. ఇన్సైడర్ ట్రేడింగ్ అన్నది స్టాక్ మార్కెట్లలో మాత్రమే జరుగుతుందని.. భూముల విక్రయాలకు అది వర్తించదన్నారు. ఇన్సైడర్ ట్రేడింగ్ ఐపీసీ పరిధిలోకి రాదని చెప్పారు.