తెలంగాణ

telangana

ETV Bharat / city

'అయితే విద్యార్థులు స్కూల్లో ఉండాలి.. లేదంటే అధికారులు జైల్లో ఉండాలి' - hyderabad latest news

HC warning to higher officials and CS పేద పిల్లలకు ప్రైవేటు పాఠశాలల్లో 25శాతం సీట్ల కేటాయింపు నిర్ణయం అమలు చేయకపోవడంపై ఏపీ హైకోర్టు మండిపడింది. వారి జీవితాలతో ఎందుకు ఆడుకుంటున్నారని నిలదీసింది. పేద పిల్లలకు 25 శాతం సీట్లు కేటాయించి, భర్తీ చేసినట్లు రుజువులు చూపకపోతే జైళ్లలో మీకు సీట్లు కేటాయిస్తామని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితోపాటు పాఠశాల విద్య ముఖ్యకార్యదర్శి, కమిషనర్‌ను హెచ్చరించింది. విద్యార్థులు స్కూల్లో అయినా ఉండాలి లేదంటే అధికారులు జైల్లో అయినా ఉండాలని ఘాటుగా వ్యాఖ్యానించింది.

high court
హైకోర్టు

By

Published : Sep 2, 2022, 10:17 AM IST

HC warning to higher officials and CS: ఆర్థికంగా వెనకబడిన వర్గాల పిల్లలకు విద్యాహక్కు చట్టం (ఆర్టీఈ) నిబంధనల ప్రకారం ప్రైవేటు పాఠశాలల్లో మొదటి తరగతిలో 25% సీట్లను ఉచితంగా కేటాయించి, భర్తీ చేయడంలో ప్రభుత్వ తీరు సరిగాలేదని ఆంధ్రప్రదేశ్​ హైకోర్టు ఎండగట్టింది. ప్రస్తుత విద్యాసంవత్సరానికి (2022-23) ఈ సీట్లను ఇవ్వాలంటూ తామిచ్చిన ఆదేశాలను సరైనరీతిలో అమలు చేయకుండా ప్రైవేటు పాఠశాలలకు పరోక్షంగా సాయపడేలా ప్రభుత్వ చర్యలున్నాయని మండిపడింది. పేద విద్యార్థుల జీవితాలతో ఎందుకు ఆడుకుంటున్నారని నిలదీసింది. మాటలు కాదు, చేతల్లో చూపాలని ఘాటుగా వ్యాఖ్యానించింది.

పేద పిల్లలతో 25% సీట్లు భర్తీ చేసినట్లు రుజువు చూపకపోతే జైళ్లలో మీకు సీట్లు కేటాయిస్తామని కోర్టు ధిక్కరణ వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌), పాఠశాల విద్య ముఖ్య కార్యదర్శి, కమిషనర్‌లను హెచ్చరించింది. విద్యార్థులు స్కూల్లో అయినా ఉండాలి. లేదా మీరు (అధికారులు) జైల్లో అయినా ఉండాలని హెచ్చరించింది. ఎంతమంది పిల్లలకు పాఠశాలల్లో ప్రవేశాలు కల్పించారన్న వివరాలను కోర్టు ముందుంచాలని తేల్చిచెప్పింది. ఆ వివరాలపై సంతృప్తి చెందకపోతే వ్యక్తిగత హాజరుకు ఆదేశిస్తామని స్పష్టంచేసింది. వివరాలను కోర్టు ముందుంచాలంటూ విచారణను ఈనెల 7కు వాయిదా వేసింది.

ఏపీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర, జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులుతో కూడిన ధర్మాసనం గురువారం ఈ మేరకు ఆదేశించింది. ప్రస్తుత విద్యాసంవత్సరం నుంచి ఆర్థికంగా వెనకబడిన వర్గాల పిల్లలకు ఆర్టీఈ చట్ట నిబంధనల ప్రకారం ప్రైవేటు పాఠశాలల్లో మొదటి తరగతిలో 25% సీట్లను ఉచితంగా కేటాయించాలంటూ న్యాయస్థానం ఇచ్చిన తీర్పును అమలుచేయడం లేదంటూ న్యాయవాది తాండవ యోగేష్‌ హైకోర్టులో కోర్టు ధిక్కరణ వ్యాజ్యం వేశారు. దీనిపై ఇటీవల విచారించిన ధర్మాసనం ప్రతివాదులకు నోటీసులిచ్చింది. గురువారం వ్యాజ్యం హైకోర్టులో మరోసారి విచారణకు వచ్చింది.

ఈ సీట్ల భర్తీ వ్యవహారంలో విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తూ విస్తృత ప్రచారం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని న్యాయవాది యోగేష్‌ వాదనలు వినిపించారు. ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రంలోని 16వేల ప్రైవేటు పాఠశాలల్లో ఒక్కోచోట కనీసం ఐదు సీట్లు కేటాయించినా మొత్తం 80 వేల మంది చిన్నారులకు ఉచిత ప్రవేశాలు లభిస్తాయన్నారు. వివరాలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం ప్రభుత్వ తీరుపై మండిపడింది. తాము ఆదేశాలిచ్చినప్పటికీ అమల్లో నిర్లక్ష్యం చేస్తే సహించబోమంది. సీట్ల భర్తీ ప్రక్రియను సిద్ధం చేశామని, కోర్టు ఆదేశాల మేరకు వ్యవహరిస్తున్నామని ప్రభుత్వ న్యాయవాది నాగరాజు తెలిపారు. వివరాలను కోర్టు ముందుంచేందుకు గడువు కోరారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details