తెలంగాణ

telangana

By

Published : Feb 4, 2021, 5:25 PM IST

Updated : Feb 4, 2021, 7:14 PM IST

ETV Bharat / city

పేద, బలహీన వర్గాల కోసం ప్రభుత్వం ఏమి చేయదా?

ప్రీ ప్రైమరీ, ఒకటో తరగతిలో పేదలకు 25 శాతం ఉచిత సీట్లపై హై కోర్టులో విచారణ జరిగింది. నాటి ఉమ్మడి హైకోర్టు విధించిన స్టే ఇంకా వర్తిస్తుందా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. జూన్ 13న విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే లోగా జీవో 44 అమలు చేస్తారో లేదో తెలపాలని ప్రభుత్వానికి చివరి అవకాశం ఇచ్చింది.

high court serious on govt over 25 presents seats to below poverty  students for pre primary and first class
పేద, బలహీన వర్గాల కోసం ప్రభుత్వం ఏమి చేయదా?

రాష్ట్రంలో ఉచిత, నిర్బంధ విద్యా హక్కు చట్టం కింద ప్రైవేట్ పాఠశాలల్లో పేద పిల్లలకు సీట్లు కేటాయిస్తారా? లేదా? తెలపాలని ప్రభుత్వాన్ని హైకోర్టు సూటిగా ప్రశ్నించింది. ప్రైవేట్ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ, ఒకటో తరగతుల్లో 25 శాతం సీట్లు పేద, బలహీన వర్గాలకు కేటాయిస్తూ.. 2010లో జారీ చేసిన జీవో 44 అమలుపై రానున్న విద్యా సంవత్సరం ప్రారంభంలోగా స్పష్టత ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాష్ట్రంలో విద్యాహక్కు చట్టం అమలు కావడం లేదని గతంలో దాఖలైన పలు ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ విజయసేన్ రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది.

ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం 2010లో జీవో 44 అమలు చేసిందని, అయితే ఉమ్మడి హైకోర్టు ఆ జీవో అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిందని.. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సంజీవ్ కుమార్ వివరించారు. నలంద విద్యా సంస్థలు దాఖలు చేసిన ఆ పిటిషన్ ప్రస్తుతం ఏపీ హైకోర్టుకు బదిలీ అయిందని తెలిపారు. స్టే ఎత్తివేయాలని కోరుతూ ఏపీ హైకోర్టులో పిటిషన్ ఎందుకు దాఖలు చేయలేదని ప్రశ్నించింది.

ప్రశ్నించలేని పేద, బలహీన వర్గాల కోసం ప్రభుత్వం ఏం చేయదా? అని ఉన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. తెలంగాణ ఫుల్ బెంచి నిర్ణయం ప్రకారం.. ఆ స్టే తెలంగాణకు ఇప్పటికీ వర్తిస్తుందా? లేదా? పరిశీలించాలని స్పష్టం చేసింది. ప్రభుత్వానికి చివరి అవకాశం ఇస్తున్నామని, జీవో 44 అమలు చేస్తారో, లేదో.. విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే లోపు తెలపాలని ధర్మాసనం స్పష్టం చేసింది.

ఇవీ చూడండి: ఫార్మా కంపెనీల మూసివేత పిల్​పై సర్కారుకు హైకోర్టు నోటీసులు

Last Updated : Feb 4, 2021, 7:14 PM IST

ABOUT THE AUTHOR

...view details