Black jaggery: నల్లబెల్లం కలిగి ఉండటం నేరం కాదని, దానితో నాటుసారా తయారు చేస్తే చర్యలు తీసుకోవచ్చని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టం చేసింది. ఈ విషయమై సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సమర్థించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులులతో కూడిన ధర్మాసనం గురువారం ఈ మేరకు ఆదేశాలిచ్చింది.
తన దుకాణం నుంచి 25,250 కేజీల నల్లబెల్లాన్ని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) అధికారులు సీజ్ చేయడాన్ని సవాలు చేస్తూ వాసిరెడ్డి గంగరాజు అనే వ్యాపారి ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన సింగిల్ జడ్జి.. నల్లబెల్లం కలిగి ఉండటం, రవాణా చేయడం నేరం కాదని తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. పిటిషనరు నుంచి జప్తు చేసిన నల్లబెల్లాన్ని విడుదల చేయాలని ఎస్ఈబీ అధికారులను ఆదేశించారు.