తెలంగాణ

telangana

'ఎస్​ఈసీ పదవీ కాలం కుదింపుపై ప్రమాణపత్రం ఇవ్వండి'

By

Published : Apr 13, 2020, 8:17 PM IST

ఏపీ ఎన్నికల కమిషనర్ పదవీ కాలం కుదిస్తూ ఆర్డినెన్స్, జీవోల జారీపై హైకోర్టులో 6 పిటిషన్లు దాఖలయ్యాయి. పిటిషన్లపై ధర్మాసనం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరిపింది. ఈ నెల 16 కల్లా ప్రమాణపత్రం దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది.

ap high court
ap high court

ఏపీ ఎన్నికల కమిషనర్ పదవీకాలాన్ని కుదిస్తూ తీసుకువచ్చిన ఆర్డినెన్స్... తదనంతర జీవోలను సవాల్ చేస్తూ ఆ రాష్ట్ర హైకోర్టులో దాఖలైన వ్యాజ్యాలపై విచారణ జరిగింది. రాష్ట్ర ఎన్నికల మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌తో పాటు తెలుగుదేశం నేత వర్ల రామయ్య, వడ్డే శోభనాధ్రీశ్వరరావు, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్, న్యాయవాది తాండవ యోగేష్... పిటిషన్‌ వేశారు.

మార్పుల కోసమే..

ఎన్నికల కమిషనర్ పదవీకాలాన్ని కుదించటం రాజ్యాంగ విరుద్ధమని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. ప్రభుత్వం ఇచ్చిన జీవో రమేశ్‌కుమార్‌కు వర్తించదని... ఆ తర్వాత వచ్చే వారికి వర్తిస్తుందని పేర్కొన్నారు. ఎన్నికల వ్యవస్థలో సంస్థాగత మార్పులు తేవాలని ప్రభుత్వం భావిస్తోందని.. దీంట్లో భాగంగానే ఆర్డినెన్స్ తెచ్చారని ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదించారు. దీనిపై ప్రమాణపత్రం దాఖలు చేసేందుకు సమయం కావాలని ధర్మసనాన్ని అడ్వకేట్ జనరల్ కోరారు.

గురువారం దాఖలు చేయండి

ఇరువురి వాదనలు పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం... గురువారం పూర్తి వివరాలతో ప్రమాణపత్రం దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం ప్రమాణపత్రం దాఖలు చేసిన తర్వాత అదనపు వివరాలు అవసరమైతే పిటిషనర్ తరఫు న్యాయవాదులు శుక్రవారం ప్రమాణపత్రాలు దాఖలు చేయాలని న్యాయస్థానం తెలిపింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

ఇదీ చూడండి:ఏపీ హైకోర్టులో నిమ్మగడ్డ రమేశ్ కుమార్ రిట్ పిటిషన్

ABOUT THE AUTHOR

...view details