తెలంగాణ

telangana

By

Published : Feb 17, 2022, 12:46 PM IST

Updated : Feb 17, 2022, 5:04 PM IST

ETV Bharat / city

Hero Nagarjuna: కేసీఆర్ పుట్టిన రోజున అడవిని దత్తత తీసుకున్న నాగార్జున

Hero Nagarjuna: ఇటీవల ప్రకటించినట్లుగానే ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున తన మాట నిలబెట్టుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్​ పుట్టిన రోజు సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్ఫూర్తితో 1080 ఎకరాల అటవీ భూమిని దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. మేడ్చల్ జిల్లా చెంగిచెర్లలో 'అక్కినేని నాగేశ్వరావు అర్బన్ ఫారెస్ట్ పార్క్' ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు.

cm kcr birthday
hero nagarjuna adopted forest

Hero Nagarjuna: కేసీఆర్ పుట్టిన రోజున అడవిని దత్తత తీసుకున్న నాగార్జున

Hero Nagarjuna: హైదరాబాద్ శివారులోని బోడుప్పల్​ నగరపాలక సంస్థ పరిధిలోని చెంగిచర్ల అటవీ బ్లాక్ పరిధిలో తన తండ్రి, దివంగత ప్రఖ్యాత నటుడు అక్కినేని నాగేశ్వరరావు పేరు మీద అర్బన్ ఫారెస్ట్ పార్క్​ ఏర్పాటుకు ముందుకొచ్చారు. రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్​కుమార్​తో కలిసి చెంగిచర్లలో శంకుస్థాపన కార్యక్రమంలో నాగార్జున కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. అక్కినేని నాగార్జున, అమల, కుమారులు నాగ చైతన్య, అఖిల్​తో పాటు ఇతర కుటుంబ సభ్యులు హాజరయ్యారు. అటవీ పార్కు అభివృద్ధికి ముఖ్యమంత్రి సంకల్పించిన హరిత నిధి (గ్రీన్ ఫండ్) ద్వారా రూ.2 కోట్ల చెక్కును అటవీ శాఖ ఉన్నతాధికారులకు అందించారు.

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటుతున్న నాగార్జున

బిగ్​బాస్​ సీజన్​-5 పైనల్​ సందర్భంగా..

రాష్ట్రం, దేశం ఆకుపచ్చగా, పర్యావరణ హితంగా మారాలన్న సంకల్పంతో 'తెలంగాణకు హరితహారం' స్ఫూర్తితో ఎంపీ సంతోష్​కుమార్​ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్ని ప్రారంభించారని నాగార్జున చెప్పారు. ఈ కార్యక్రమంలో తాను స్వయంగా పాల్గొని పలుసార్లు మొక్కలు నాటినట్లు నాగార్జున తెలిపారు. నాడు బిగ్​బాస్ సీజన్​ -5 ఫైనల్ సందర్భంగా అడవి దత్తత తీసుకొనే విషయమై ఎంపీ సంతోష్​తో చర్చించినట్లు పేర్కొన్నారు. అటవీ పునరుద్ధరణ, అర్బన్ ఫారెస్ట్ పార్క్​ ఏర్పాటుకు శంకుస్థాపన చేయడం ఎంతో ఆనందంగా ఉందని నాగార్జున అన్నారు.

హీరో నాగార్జున, ఎంపీ సంతోష్​

అక్కినేని నాగేశ్వరరావు అర్బన్​ పార్క్​..

'గ్రీన్ ఇండియా ఛాలెంజ్' కార్యక్రమంతో అటవీ ప్రాంతాన్ని దత్తత తీసుకొనేందుకు ముందకురావడాన్ని ఎంపీ సంతోష్​కుమార్​ ప్రశంసించారు. చెంగిచర్ల ఫారెస్ట్​ బ్లాక్​లో దివంగత అక్కినేని నాగేశ్వరరావు పేరుమీద అర్బన్ పార్క్​ అభివృద్ధితోపాటు, ఖాళీ ప్రదేశాల్లో దశల వారీగా లక్ష మొక్కలను నాటే కార్యక్రమాన్ని ఇవాళ్టి నుంచే ప్రారంభించినట్లు ఎంపీ వెల్లడించారు. దేశంలో ఏ నగరానికి లేని ప్రకృతి సౌలభ్యత ఒక్క హైదరాబాద్​కే ఉందన్నారు. రాజధాని చుట్టూ ఉన్న లక్షా యాభై వేల ఎకరాలకు పైగా అటవీ భూమిని పరిరక్షించటం, పునరుద్ధరణ చేయటం, అర్బన్ పార్కుల ఏర్పాటుకు 'గ్రీన్ ఇండియా ఛాలెంజ్' తమ వంతు ప్రయత్నం చేస్తుందని సంతోష్​కుమార్​ తెలిపారు. దీనికోసం సామాజిక బాధ్యతగా ముందుకొచ్చే ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, సంస్థలను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో అటవీ శాఖ స్పెషల్ సెక్రటరీ ఏ.శాంతి కుమారి, పీసీసీఎఫ్ ఆర్​.శోభ, పీసీసీఎఫ్ (ఎస్ఎఫ్) ఆర్​ఏం డోబ్రియల్, రాచకొండ సీపీ మహేశ్​ భగవత్, హైదరాబాద్ చీఫ్ కన్జర్వేటర్ ఎంజె అక్బర్, మేడ్చల్ జిల్లా అటవీ అధికారి వెంకటేశ్వర్లు, అక్కినేని నాగార్జున కుటుంబం సహా సుప్రియ యార్లగడ్డ, సురేంద్ర యార్లగడ్డ, సుమంత్ కుమార్, సుశాంత్, నాగ సుశీల, లక్ష్మీ సాహిత్య, సరోజ, వెంకట నారాయణ రావు, జ్యోత్స్న, అనుపమ, అదిత్య, సంగీత, సాగరిక పాల్గొన్నారు.

ఆహ్లాదం.. ఆనందం..

హైదరాబాద్ - వరంగల్ జాతీయ రహదారి ప్రాంతంలో చెంగిచెర్ల ఫారెస్ట్ బ్లాక్ ఉంది. చుట్టూ జరిగిన పట్టణీకరణ మధ్య 1682 ఎకరాల అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. ఇందులో నాగార్జున 1000 ఎకరాలను దత్తత తీసుకున్నారు. నగర వాసులకు ఆహ్లాదం, ఆరోగ్యాన్ని పంచేలా కొద్ది ప్రాంతంలో అర్బన్ పార్కును అభివృద్ధి చేసి, మిగతా ప్రాంతంలో అటవీ పునరుద్ధరణ పనులు చేపట్టనున్నారు. మేడిపల్లి నుంచి చెంగిచర్ల, చర్లపల్లి, ఈసీఐఎల్ సమీప కాలనీ వాసులకు ఈ పార్క్​ ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు.

హీరో ప్రభాస్​ సైతం..

ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్ఫూర్తితో ఇప్పటికే మూడు ప్రాంతాల్లో అటవీ బ్లాక్​ల దత్తత జరిగింది. ప్రసుత్తం నాగార్జున తీసుకున్నది నాల్గో బ్లాక్. మూడు ప్రాంతాల్లో ఇప్పటికే పార్కుల అభివృద్ధితో పాటు, అటవీ ప్రాంతం స్థిరీకరణ, పునరుద్ధరణ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. సంతోష్​కుమార్​ స్వయంగా కీసర అటవీ ప్రాంతంలో 2,042 ఎకరాలను దత్తత తీసుకొని ఎకో పార్క్​ను అభివృద్ధి చేస్తున్నారు. హీరో ప్రభాస్.. ఖాజీపల్లి అటవీ ప్రాంతంలో 1650 ఎకరాలు, ఫార్మా దిగ్గజం హెటిరో డ్రగ్స్.. నర్సాపూర్​ రోడ్​లో మంబాపూర్ అటవీ ప్రాంతంలో 2,543 ఎకరాలను దత్తత తీసుకుని పర్యావరణహితంగా అభివృద్ధి చేస్తున్నారు.

అడవులు కనుమరుగయ్యాయని..

గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా అడవులు కనుమరుగయ్యాయని... మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ పుట్టిన రోజు సందర్భంగా.. మేడ్చల్‌ జిల్లా మేడిపల్లిలోని రాచకొండ కమిషనరేట్‌ భవన కార్యాలయ భూముల్లో...లక్ష మొక్కలు నాటే కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. ఎంపీ సంతోష్‌ కుమార్‌, రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను.. భాజపా, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో అమలు చేయాలని మంత్రి మల్లారెడ్డి డిమాండ్‌ చేశారు.

ఇదీచూడండి:Birth Day Wishes to CM KCR : కేసీఆర్​కు మోదీ బర్త్‌డే విషెస్.. కేటీఆర్ ఎమోషనల్‌ ట్వీట్

Last Updated : Feb 17, 2022, 5:04 PM IST

ABOUT THE AUTHOR

...view details