హైదరాబాద్లో చిన్నా పెద్దా ఆస్పత్రులు 4000 వరకు ఉన్నాయి. కరోనాకు వైద్యం అందించాలంటే వైద్య ఆరోగ్య శాఖ అనుమతి తప్పనిసరి. 20 పడకలు ఆపైన ఉండి, దరఖాస్తు చేస్తే ఆ శాఖ అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం మూడు వేల వైద్యశాలల్లో ఈ వైద్యం లభిస్తోంది. మరో 500 వరకు చిన్న వైద్యశాలలు అనధికారికంగా పడకలను ఏర్పాటు చేశాయి. వీటిలో పూర్తిస్థాయిలో వైద్యులు లేరు.. ఆక్సిజన్ సౌకర్యం లేదు. చనిపోతున్న వారి సంఖ్య ఇలాంటి చోట్ల అధికంగా ఉంటోంది. ఈ చిన్న ఆస్పత్రులను ఆదర్శంగా తీసుకున్నారో ఏమోగానీ పలు డయాగ్నస్టిక్ కేంద్రాలు నిబంధనలకు విరుద్ధంగా కరోనా వైద్య కేంద్రాలుగా మారిపోయాయి.
ఎక్కడెక్కడ అంటే..
దిల్సుఖ్నగర్, కొత్తపేట, ఎల్బీనగర్, కూకట్పల్లి, సికింద్రాబాద్, మాదాపూర్ ప్రాంతాల్లోని కొన్ని డయాగ్నస్టిక్ కేంద్రాల్లో..
నగరంలో ప్రైవేటు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో అన్ని రకాల పడకలకు భారీ అవసరం ఉంది. వెంటిలేటర్, ఆక్సిజన్ పడకలకు డిమాండ్ మరింత ఎక్కువైంది. వెంటిలేటర్ పడకకు రోజుకు రూ.1.50 లక్షలు వసూలు చేస్తున్న ఆస్పత్రులున్నాయి. దీంతో బాధితుల దృష్టి చిన్న ఆస్పత్రులపై మళ్లింది. ఇంటి కంటే వైద్యులు పర్యవేక్షణలో ఉండడం మేలన్నది చాలామంది ఉద్దేశం. ప్రభుత్వ పరీక్ష కేంద్రాల్లో పరీక్షలను రెండింతల మేర తగ్గించడంతో అనేకమంది డయాగ్నస్టిక్ కేంద్రాలకు బారులు తీరుతున్నారు. ఈ పరిణామమే డయాగ్నస్టిక్ కేంద్రాల నిర్వాహకుల్లో కొత్త ఆలోచనను రేకెత్తించింది. తామే కొన్ని పడకలను ఏర్పాటు చేసి కొవిడ్కు వైద్యం మొదలుపెడదామని భావించాయి.