ACCIDENT: ఏపీ సత్యసాయి జిల్లాలో జరిగిన ప్రమాదంపై పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు.
VICE PRESIDENT: శ్రీసత్యసాయి జిల్లాలో జరిగిన ప్రమాదంపై ఉపరాష్ట్రపతి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కూలీలు మృత్యువాత పడిన ఘటన అత్యంత విచారకరమని..గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని తెలిపారు.
GOVERNOR: శ్రీసత్యసాయి జిల్లాలో జరిగిన ప్రమాదం పట్ల గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఐదుగురు మహిళా కూలీలు మృతిచెందడం బాధాకరమన్నారు. ప్రమాద వివరాలు తెలుసుకోవాలని రాజ్భవన్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియాకు గవర్నర్ ఆదేశాలు జారీ చేశారు.
CM JAGAN: శ్రీసత్యసాయి జిల్లాలో ప్రమాదంపై ఆ రాష్ట్ర సీఎం జగన్ దిగ్భ్రాంతి చెందారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు చొప్పున పరిహారం చెల్లించాలని అధికారులను ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. పారిస్లో ఉన్న సీఎంకు ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు ప్రమాద వివరాలు తెలిపారు.
CHANDRABAU: శ్రీసత్యసాయి జిల్లాలో ప్రమాదంపై చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఐదుగురు కూలీలు ప్రాణాలు కోల్పోవడం కలచివేసిందని ఆవేదన చెందారు. నిర్లక్ష్యానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలి ప్రభుత్వానికి సూచించారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.
PAWAN KALYAN: శ్రీసత్యసాయి జిల్లా తాడిమర్రి దగ్గర విద్యుత్ హై టెన్షన్ వైర్లు తెగిపడి ఐదుగురు మహిళా కూలీలు సజీవ దహనం అయిన ఘటన తీవ్ర ఆవేదన కలిగించిందని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. రెక్కల కష్టం మీద బతికే ఆ కూలీల కుటుంబాలలో చోటు చేసుకున్న హృదయ విదారకమైన ఈ విషాదం మనసుని కలచి వేసిందని తెలిపారు. ఆ కుటుంబాలకు నా తరఫున, జనసేన పక్షాన ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నట్లు వెల్లడించారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని కోరారు. వాతావరణం ప్రతికూలంగా ఉన్న సమయంలో అప్పుడప్పుడు విద్యుత్ వైర్లు తెగిపడడం చూస్తూనే ఉంటాం.. మరి వాతావరణం సాధారణంగా ఉన్న రోజున హై టెన్షన్ తీగ తెగిపడడం మానవ తప్పిదమా? నిర్వహణ లోపమా ? అనే విషయాన్ని ప్రభుత్వం ప్రజలకు చెప్పవలసి ఉందని అన్నారు. విద్యుత్ ఛార్జీలు పెంచడం మీద చూపించే శ్రద్ధను.. విద్యుత్ లైన్ల నిర్వహణపై కూడా చూపాలని ప్రభుత్వానికి సూచించారు.