ఏపీలో 2021 ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు కరోనా అడ్డంకి కాజాలదని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి నిమ్మగడ్డ రమేశ్కుమార్ పేర్కొన్నారు. బిహార్, రాజస్థాన్, తెలంగాణ రాష్ట్రాలు ఈ మధ్య విజయవంతంగా ఎన్నికలు నిర్వహించడమే ఇందుకు నిదర్శనమని అభిప్రాయపడ్డారు. కరోనా వ్యాక్సినేషన్కు ఎన్నికలు అడ్డంకిగా మారతాయని రాష్ట్ర ప్రభుత్వం (పిటిషనర్) పేర్కొంటోందని, నిజానికి వ్యాక్సిన్ల వినియోగానికి కేంద్రం అనుమతివ్వలేదని, ఇందుకు జాతీయ విధానం ఖరారు కాలేదని తెలిపారు. ఎన్నికల కోసం రాష్ట్ర వైద్యారోగ్య సిబ్బందిని వినియోగించుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్టికల్14 కింద పిటిషన్ దాఖలు చేసే హక్కే లేదని, ఆ ఆర్టికల్ వ్యక్తులకు వర్తిస్తుంది తప్ప ప్రభుత్వాలకు కాదని పేర్కొన్నారు. పిటిషన్కు ఏ రకంగానూ విచారణార్హత లేదన్నారు. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి 2021 ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఇచ్చిన ప్రొసీడింగ్స్పై రాష్ట్ర ప్రభుత్వం తరఫున పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ప్రభుత్వ వాదనపై హైకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల ప్రధానాధికారి గురువారం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశారు. అందులోని వివరాలివీ...
కరోనా తగ్గడంతోనే..
రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పట్టడంతోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని భావించాం. రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు ఏర్పడాలని పాఠశాలలు, సినిమాహాళ్లు, మాల్స్ తెరిచేందుకు ప్రభుత్వం అనుమతించింది. అత్యంత ఎక్కువ జనసాంద్రత ఉన్న హైదరాబాద్లో జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించిన తెలంగాణ ప్రభుత్వం నుంచి నివేదిక తీసుకున్నాం. మరోవైపు రాజస్థాన్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సుప్రీంకోర్టు అంగీకరించింది. బిహార్లో కొవిడ్ కారణంగా శాసనసభ ఎన్నికల వాయిదాకు సుప్రీంకోర్టు అంగీకరించని విషయాన్ని పరిగణనలోకి తీసుకున్నాం. రక్షణ చర్యల మధ్య ఆ రాష్ట్ర ఎన్నికలు విజయవంతంగా జరిగాయి. అన్లాక్ 5.0 మార్గదర్శకాలు, తాజా పరిస్థితుల దృష్ట్యా ఏపీలో పరిస్థితులు త్వరలో మరింత కుదుటపడతాయని ఎన్నికల సంఘం భావిస్తోంది. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకునే ఎన్నికలు నిర్వహించాలనుకున్నాం. అక్టోబరు 21న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో చర్చించగా... ఎన్నికల నిర్వహణకు ఉన్న అభ్యంతరాలను పేర్కొంటూ, గణాంకాలను జత చేస్తూ వారు లేఖ ఇచ్చారు. కరోనా రెండో వేవ్ వచ్చే అవకాశముందనే అభ్యంతరాన్ని నోటిమాటగానే పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్య భద్రతను ప్రథమ ప్రాధాన్యంగా భావిస్తూ ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్లుగా ఎన్నికల షెడ్యూలు, నిర్వహణ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటాం. నిజానికి ఈ కేసులో పిటిషనర్గా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు సహకరించాల్సి ఉంది. ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర యంత్రాంగంతో వీడియో సమావేశ ఏర్పాటుకు ప్రధాన కార్యదర్శి సహకరించలేదు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శితో వివిధ అంశాలపై మాట్లాడాకే ఎన్నికలు నిర్వహించాలనే నిర్ణయానికి వచ్చాం. రాష్ట్రంలోని 19 రాజకీయ పార్టీలను సమావేశానికి రావాలని పిలిచాం. 11 పార్టీలు హాజరయ్యాయి. ఎన్నికలపై వారి అభిప్రాయాలు తీసుకున్నాం. ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలప్పుడు తీసుకున్న చర్యల్ని వివరించాం. జాగ్రత్తలు చేపడుతూ ఎన్నికలు నిర్వహించాలని ఆ పార్టీలు కోరాయి. ఈ సమావేశాన్ని అధికార వైకాపా బహిష్కరించింది. చర్చల ప్రక్రియను విమర్శిస్తూ రాజ్యాంగపరంగా ఎన్నికల సంఘానికి ఉన్న గౌరవాన్ని, గుర్తింపునకు భంగం కలిగేలా వ్యవహరించింది.
పూర్తి విరుద్ధం
ఇప్పటికే ఆచరణలో ఉన్న న్యాయసూత్రాలకు పిటిషనర్ వాదన పూర్తి విరుద్ధం. పైగా ఒకసారి ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యాక అందులో జోక్యం చేసుకునే హక్కులేదని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ మధ్యే కేరళ రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చింది. ఆ ఉత్తర్వులను కేరళ హైకోర్టులో కొందరు సవాల్ చేశారు. ఆ రిట్ పిటిషన్ను 2020 నవంబరు 5న కేరళ హైకోర్టు కొట్టివేసింది. పిటిషనర్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా ఎన్నికలు నిలిపివేస్తూ స్టే ఇచ్చేందుకు నిరాకరించింది.