తెలంగాణ

telangana

ETV Bharat / city

ధరణి  పోర్టల్ ప్రారంభానికి రంగం సిద్ధం - ఆస్తుల నమోదు

ధరణి పోర్టల్ ప్రారంభం కోసం రంగం సిద్ధమవుతోంది. ఆస్తుల రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు ఏకకాలంలో చేసేందుకు తహశీల్దార్లు, సబ్ రిజిస్ట్రార్లు సిద్ధమవుతున్నారు. ఇందుకోసం శిక్షణ ప్రక్రియ పూర్తి కాగా... ప్రస్తుతం ప్రయోగాత్మకంగా రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. ఈ క్రమంలో ఎదురవుతున్న సాంకేతిక సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొస్తున్నారు. దసరా రోజు ధరణి పోర్టల్​ను ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే నిర్ణయించారు.

government takes action for launching dharani portal
ధరణి  పోర్టల్ ప్రారంభానికి రంగం సిద్ధం

By

Published : Oct 21, 2020, 6:45 AM IST

ఏకకాలంలో ఆస్తుల రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు పూర్తి చేసేందుకు తహశీల్దార్లు, సబ్​ రిజిస్ట్రార్లు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ఇందుకోసం శిక్షణ ప్రక్రియ పూర్తి కాగా.. ప్రయోగాత్మకంగా పలు రిజిస్ట్రేషన్లు పూర్తి చేస్తున్నారు. దసరా నాటికి ధరణి పోర్టల్​ ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్​ నిర్ణయించగా.. పలు కారణాల రీత్యా మరో రెండు రోజులు ఆలస్యం కావచ్చని అధికారులు అంటున్నారు.

కొత్తచట్టంతో అమలు..

పూర్తి పారదర్శకమైన విధానంలో ఎలాంటి అవినీతి, అక్రమాలకు తావు లేకుండా కొత్త రెవెన్యూ విధానాన్ని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. వీఆర్వో వ్యవస్థను రద్దు చేయడమే గాక ధరణి పోర్టల్ ద్వారా పూర్తి స్థాయిలో ఎలక్ట్రానిక్ విధానంలో కోర్ బ్యాంకింగ్ తరహాలో భూలావాదేవీలు జరిగేలా కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు. వ్యవసాయ ఆస్తుల రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ అధికారాలను తహశీల్దార్, వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ అధికారాలను సబ్ రిజిస్ట్రార్లకు అప్పగించారు. భూముల విలువ నిర్ధారణకు సంబంధించి సబ్ రిజిస్ట్రార్లకు విచక్షణాధికారాలు లేకుండా స్టాంపుల చట్టాన్ని కూడా సవరించారు. రాష్ట్రానికి సంబంధించిన చట్టం కావడం వల్ల కేంద్ర ప్రభుత్వానికి సవరణను నిషేధించారు. వ్యవసాయ భూములకు పట్టాదారు పాసుపుస్తకాలు ఇస్తున్న తరహాలోనే వ్యవసాయేతర ఆస్తులకు మెరూన్ రంగులో పాసుపుస్తకాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు అనుగుణంగా గ్రామాలు, పట్టణాల్లోని వ్యవసాయేతర ఆస్తుల వివరాల ఆన్​లైన్ నమోదు ప్రక్రియను సర్కారు చేపట్టింది. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 80 లక్షలకు పైగా వివరాలను ఆన్​లైన్​లో నమోదు చేశారు. గ్రామపంచాయతీల్లో 58లక్షలకు పైగా, పట్టణాల్లో 16లక్షలకు పైగా, జీహెచ్ఎంసీలో ఐదు లక్షలకు పైగా ఆస్తులను ఆన్​లైన్​లో నమోదు చేశారు. భారీవర్షాల వల్ల గత కొన్ని రోజులుగా జీహెచ్ఎంసీతో పాటు శివారు ప్రాంతాల్లో నమోదు నిలిచిపోయింది. కొందరు వ్యక్తిగతంగా సొంతంగా ఆస్తుల వివరాలను నమోదు చేసుకుంటున్నారు.

రంగం సిద్ధం చేస్తున్న ప్రభుత్వం..

ధరణి ప్రారంభం కోసం యంత్రాంగాన్ని ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. వ్యవసాయ ఆస్తుల రిజిస్ట్రేషన్లు చేసేందుకు వీలుగా తహసీల్దార్లు, నయాబ్ తహసీల్దార్లకు శిక్షణ ఇచ్చారు. ప్రయోగాత్మకంగా కొన్ని లావాదేవీల రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ల ప్రక్రియను కూడా చేశారు. అందుకు సంబంధించిన కసరత్తు, ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులు జిల్లా కలెక్టర్లు, తహసీల్దార్లకు అవసరమైన ఆదేశాలు జారీ చేస్తున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు కొందరు సీనియర్ ఐఏఎస్ అధికారులు ప్రక్రియను నిత్యం పర్యవేక్షిస్తున్నారు. జిల్లాల నుంచి ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకొని సందేహాలను నివృత్తి చేస్తున్నారు. అక్కడక్కడా సాంకేతిక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని క్షేత్రస్థాయి నుంచి ఫిర్యాదులున్నాయి. ప్రభుత్వ నిర్ణయం మేరకు ప్రజలకు మెరుగైన, సత్వర సేవలు అందేలా ధరణిని అమలు చేస్తామని రెవెన్యూ ఉద్యోగులు చెప్తున్నారు. దసరా రోజు ధరణి పోర్టల్ ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు కూడా ప్రారంభమవుతాయని ప్రకటించారు. అయితే భారీ వర్షాలు, సాంకేతిక ఇబ్బందులు, ఇతర కారణాల దృష్ట్యా ప్రారంభ తేదీ మారవచ్చని అంటున్నారు. ఇందుకు సంబంధించిన అధికారిక నిర్ణయం ఇంకా వెలువడలేదు.


ఇదీ చూడండి.. ఆస్తుల వివరాలను ధరణిలో నమోదు చేయించిన ఎమ్మెల్యే కోనప్ప

ABOUT THE AUTHOR

...view details