తెలంగాణ

telangana

ETV Bharat / city

గోదావరి అందాలు... కృష్ణమ్మ పరవళ్లు - krishnamma-parvalas

రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. ఎగువ ప్రాంతాల్లో పడుతున్న వానలతో వరద ప్రవాహం కొనసాగుతోంది. మరోవైపు రైతులు సాగు పనుల్లో మునిగిపోయారు. రాబోయే మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది.

గోదావరి అందాలు...కృష్ణమ్మ పరవళ్లు

By

Published : Aug 5, 2019, 5:03 AM IST

Updated : Aug 5, 2019, 8:52 AM IST

గోదావరి అందాలు...కృష్ణమ్మ పరవళ్లు

ఉప్పొంగిన జలాశయాలు
తెలంగాణలో పడుతున్న వర్షాలకు తోడు.. ఎగువ నుంచి వరద కొనసాగుతుండటం వల్ల ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. స్వర్ణ, కడెం, కుమురంభీం ప్రాజెక్టులు నిండుగా కనిపిస్తున్నాయి. కడెం జలాశయం నుంచి నీటిని వదలడం వల్ల జగిత్యాల జిల్లాలోని ధర్మపురి, కోటిలింగాల పుష్కర ఘాట్ల వద్దకు వరద చేరింది.

కాళేశ్వరంలో గంగమ్మ ఉరకలు
కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని బ్యారేజీలన్నీ జల పరవళ్లతో కళకళలాడుతున్నాయి. మేడిగడ్డ బ్యారేజి 81 గేట్లు ఎత్తి నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. అన్నారం బ్యారేజీ 4 గేట్లు ఎత్తి 18 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మేడిగడ్డ వద్ద 5.98 టీఎంసీలు, అన్నారం బ్యారేజీ వద్ద 7.7 టీఎంసీలు, కన్నెపల్లి వద్ద 8 టీఎంసీల నీటి నిల్వ ఉంది. శ్రీపాద ఎల్లంపల్లి జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకుంది.

కృష్ణమ్మ పరవళ్లు
కృష్ణానది పరవళ్లు తొక్కుతోంది. ఆలమట్టి నుంచి దిగువకు 2.85 లక్షల క్యూసెక్కుల భారీ ప్రవాహం వస్తోంది. దాదాపు అంతే మొత్తంలో నారాయణపూర్‌ నుంచి జూరాలకు నీరు విడుదలవుతోంది. ఆదివారం రాత్రికల్లా శ్రీశైలం జలాశయంలో నీటి నిల్వ 100 టీఎంసీలకు చేరింది.

గలగలా గోదారి కదలి పోతోంది...
భద్రాచలం వద్ద గోదావరి వరద తగ్గు ముఖం పట్టింది. ప్రతీ గంటకు కొన్ని అంగుళాల చొప్పున నీటిమట్టం తగ్గి సాధారణ స్థితికి చేరింది. నిండు గోదావరి అందాలు చూసేందుకు పర్యాటకుల తాకిడి పెరిగింది.

అలుగు పోస్తున్న బయ్యారం చెరువు
మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలోని తులారాం ప్రాజెక్టు పొంగి ప్రవహిస్తోంది. వారం రోజుల క్రితం మైదానాన్ని తలపించిన బయ్యారం పెద్ద చెరువు నిండి అలుగు పోస్తుంది. బయ్యారం ఏజెన్సీలో ఎత్తైన కొండపై నుంచి నీరు జాలువారుతున్న దృశ్యం చూపరులను ఆకట్టుకుంటుంది. తులారాం ప్రాజెక్టు, బయ్యారం చెరువుల్లో నీరు పుష్కలంగా ఉండటం వల్ల... రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.. వరినాట్లు జోరందుకున్నాయి.

హుస్సేన్‌సాగర్​లో పెరిగిన నీటమట్టం
ఇటు హైదరాబాద్​లోను మూడు రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వానలతో... హుస్సేన్‌సాగర్‌ నీటమట్టం క్రమంగా పెరిగింది. పూర్తి స్థాయి నీటిమట్టం 513.41 మీటర్లు కాగా... ప్రస్తుతం 513.37 మీటర్లకు చేరుకుంది.

ఇవీ చూడండి: కొత్తపల్లి ఘటనపై కేసీఆర్ తీవ్ర​ దిగ్భ్రాంతి

Last Updated : Aug 5, 2019, 8:52 AM IST

ABOUT THE AUTHOR

...view details