ఏపీలో ప్రజాప్రతినిధులపై నమోదైన కేసులను ఉపసంహరించుకుంటూ ఇచ్చిన జీవోలన్నింటినీ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ప్రజాప్రతినిధులపై నమోదైన కేసులను ప్రభుత్వం ఉపసంహరించుకుంటూ ఇచ్చిన జీవోపై.. జర్నలిస్ట్ ఫోరమ్ అధ్య క్షులు చెవుల కృష్ణాంజనేయులు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వం కేసులను ఉపహసంహరిస్తోందని పిటిషనర్ తరఫు న్యాయవ్యాది శ్రావణ్ కుమార్ వాదనలు వినిపించారు.
ప్రజాప్రతినిధులపై కేసులు ఉపసంహరించాలంటే స్థానిక హైకోర్టు అనుమతి తీసుకోవాలని పిటిషనర్ తరఫు న్యాయవాది గతంలో ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. హైకోర్టు అనుమతి లేకుండా కేసులు ఎలా ఉపసంహరిస్తారని గతంలో ప్రభుత్వాన్ని ధర్మాసనం ప్రశ్నించిన విషయం తెలిసిందే. దీనిపై ప్రభుత్వం తరుఫున ప్రమాణ పత్రం దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రజాప్రతినిధులపై కేసులు ఉపసంహరణ చేస్తూ ఇచ్చిన మొత్తం జీవోలను ప్రభుత్వం ఉపసంహరించుకున్నట్లు న్యాయస్థానానికి తెలిపింది. ప్రభుత్వం కేసులు కొనసాగించడంతో... హైకోర్టు ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని మూసివేసింది.