ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నిపుణుల కమిటీపై తెదేపా అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను కమిటీ కన్వీనర్ జీఎన్ రావు ఖండించారు. జీఎన్ రావు వ్యాఖ్యలతో ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ప్రభుత్వ సూచనల మేరకే నివేదిక రూపొందించామనడం అవాస్తవమని జీఎన్ రావు తెలిపారు. నివేదిక రూపకల్పనలో తాము సీఎం జగన్ సహా ఏ ప్రభుత్వ అధికారినీ సంప్రదించలేదని తెలిపారు.
'నివేదిక రూపకల్పనకు... ఎవరి సూచనలు తీసుకోలేదు'
అజేయ కల్లం చెప్పిన విధంగానే జీఎన్ రావు కమిటీ నివేదిక ఇచ్చిందని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై జీఎన్ రావు స్పందించారు. ఇందులో ఏ మాత్రం నిజం లేదని ప్రకటన విడుదల చేశారు.
నివేదిక రూపకల్పన సందర్భంగా ప్రభుత్వ సలహాదారులను కూడా కలవలేదని అందులో పేర్కొన్నారు. అటువంటప్పుడు ప్రభుత్వ సూచనలతో నివేదిక తయారయ్యే ప్రశ్నే తలెత్తదని జీఎన్ రావు వివరించారు. కమిటీ సభ్యులంతా పట్టణాభివృద్ధి ప్రణాళిక, అంతర్జాతీయ నగరాల రూపకల్పనలో నిపుణులని వెల్లడించారు. ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లం సూచనలతో నివేదిక తయారు చేశామనడం నిరాధారమని.... చంద్రబాబు వ్యాఖ్యలు ఊహాజనితం, సత్యదూరమని జీఎన్ రావు ప్రకటనలో తెలిపారు.
సంబంధిక కథనం:'ఎవర్ని మోసం చేయడానికి ఈ కమిటీలు'