తెలంగాణ

telangana

ETV Bharat / city

తెలియకుంటే శిక్షణ తీసుకోవాలి : జీహెచ్​ఎంసీకి హైకోర్టు చురకలు - శాస్త్రీపురంలో పరిశ్రమలకు జీహెచ్​ఎంసీ నోటీసులు వెనక్కి

హైదరాబాద్​ శాస్త్రిపురంలోని పరిశ్రమల మూసివేతకు సంబంధించి.. హైకోర్టులో విచారణ ముగిసింది. కాలుష్యం వెదజల్లుతున్నాయని దాఖలైన పిల్​తో... న్యాయస్థానం ఆదేశాల మేరకు పరిశ్రమలకు జారీ చేసిన నోటీసులు జీహెచ్​ఎంసీ వెనక్కి తీసుకుంది.

ghmc The notices were withdrawn which is gave to industries in shastripuram
నోటీసులు ఎలా ఇవ్వాలో శిక్షణ తీసుకోండి: హైకోర్టు

By

Published : Jul 6, 2020, 6:48 PM IST

హైదరాబాద్ శాస్త్రిపురంలోని పరిశ్రమలు మూసివేయాలంటూ జారీ చేసిన నోటీసులను జీహెచ్ఎంసీ వెనక్కి తీసుకుంది. దీంతో హైకోర్టులో దాఖలైన సుమారు ఏడు వందలకుపైగా పిటిషన్లపై విచారణ ముగిసింది. కాటేదాన్, శాస్త్రిపురం, టాటానగర్ పరిసరాల్లో అనేక పరిశ్రమలు కాలుష్యం వెదజల్లుతున్నాయని... నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న వాటిపై అధికారులు చర్యలు తీసుకోవడం లేదని గతంలో హైకోర్టులో పిల్ దాఖలైంది. వ్యాజ్యంపై విచారణ జరిపిన హైకోర్టు... కాలుష్య పరిశ్రమలపై వెంటనే చర్యలు తీసుకోవాలని జీహెచ్​ఎంసీని ఆదేశించింది.

హైకోర్టు ఆదేశాల మేరకు కాలుష్యం వెదజల్లుతున్న పరిశ్రమలు మూసివేయాలని వందల పరిశ్రమలకు జీహెచ్​ఎంసీ నోటీసులు జారీ చేసింది. అయితే తమ పరిశ్రమ నుంచి ఎలాంటి కాలుష్యం లేనప్పటికీ... జీహెచ్​ఎంసీ నోటీసులు ఇచ్చిందంటూ సుమారు 700 కంపెనీలు హైకోర్టును ఆశ్రయించాయి. కాలుష్యం లేనప్పటికీ వివిధ ఇతర నిబంధనలు ఉల్లంఘించి పరిశ్రమ నిర్వహిస్తున్నట్టు విచారణ సందర్భంగా హైకోర్టుకు జీహెచ్​ఎంసీ వివరించింది. అయితే సరైన కారణాలు ప్రస్తావించకుండా... నోటీసులు జారీ చేయడాన్ని ఇటీవల హైకోర్టు తప్పుబట్టింది. జీహెచ్ఎంసీ నిర్లక్ష్య వైఖరి వల్ల వందల పిటిషన్లు దాఖలవుతున్నాయని హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది.

నోటీసులు ఎలా ఇవ్వాలో జీహెచ్ఎంసీ సిబ్బంది శిక్షణ తీసుకోవాలని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆస్పష్ట నోటీసులు వెనక్కి తీసుకోవాలని సూచించింది. దీంతో ఆ నోటీసులు ఉపసంహరించుకుంటున్నట్టు జీహెచ్​ఎంసీ ఇవాళ హైకోర్టుకు తెలిపింది. మూసివేసిన పరిశ్రమలను తెరవాలని జీహెచ్ఎంసీని ఆదేశించిన హైకోర్టు... చట్టానికి, నిబంధనలకు విరుద్ధంగా నడపరాదని పరిశ్రమలకు స్పష్టం చేసింది. కరోనా పరిస్థితులు ఉన్నంత వరకు నోటీసులు ఇవ్వొద్దని జీహెచ్​ఎంసీకి ఆదేశాలు జారీ చేసింది. పరిస్థితులు చక్కబడిన తర్వాత క్షేత్రస్థాయిలో పర్యటించి... ఏ పరిశ్రమ, ఏ నిబంధన ఉల్లంఘించిందో పేర్కొంటూ.. నోటీసులు జారీ చేసి చర్యలు తీసుకోవచ్చునని జీహెచ్ఎంసీకి స్వేచ్చనిచ్చింది.

ఇదీ చూడండి:దిల్లీలో కరోనా తగ్గుముఖం- పాజిటివిటీ రేటు 10%!

ABOUT THE AUTHOR

...view details