తెలంగాణ

telangana

ETV Bharat / city

భాగ్యనగర దారుల్లో చిమ్మ చీకట్లు.. వెలగని దీపాలు - ghmc neglects to arrange street lights in Hyderabad

భాగ్యనగర దారుల్లో చిమ్మ చీకట్లు కమ్ముకుంటున్నాయి. చాలా ప్రాంతాల్లో.. వెలగని విద్యుద్దీపాలే దర్శనమిస్తున్నాయి. శివారు ప్రాంతాలు, కీలకమైన కూడళ్లలో వెలుగులు నింపాల్సిన బల్దియా బాధ్యత మరిచింది. నిర్వహణను పూర్తిగా గాలికొదిలేసింది. నగరంలో దాదాపు 30శాతం వీధి దీపాలు వెలగడం లేదని ఆయా కాలనీలవాసులు ఆరోపిస్తున్నారు.

street lights issue in Hyderabad
street lights in Hyderabad

By

Published : Mar 29, 2021, 10:05 AM IST

గ్రేటర్‌ పరిధిలో 9,103 కి.మీల మేర రోడ్లు ఉండగా.. వాటిపై మొత్తం 4.5లక్షల విద్యుద్దీపాలు ఏర్పాటు చేశారు. ఇందులో 4లక్షలు ప్రధాన రోడ్లు, వీధుల్లో ఉండగా.. 54వేలకు పైగా ఇతర ప్రాంతాల్లో ఉన్నాయి. హైమాస్ట్‌ దీపాలు 6,531 ఉన్నాయి. వీటి నిర్వహణకు బల్దియా భారీగా ఖర్చు చేస్తోంది. 2018లో రూ.7 కోట్లు వ్యయం చేయగా.. ప్రస్తుతం రూ.21.50కోట్లకు చేరింది. నగరవాసుల నుంచి ఫిర్యాదులు రావడంతో గతేడాది గ్రేటర్‌లోని కొన్ని ప్రాంతాల్లో సుమారు 10వేల వీధి దీపాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అది కార్యరూపం దాల్చక చాలా చోట్ల ఇంకా చీకట్లే అలముకున్నాయి. ప్రధానంగా రాజేంద్రనగర్‌, చాంద్రాయణగుట్ట, కిషన్‌బాగ్‌, ఖాజాగూడ సర్కిల్‌, కావూరిహిల్స్‌, ఎల్బీనగర్‌, అల్వాల్‌, మల్కాజిగిరి, నాగోల్‌, నానల్‌నగర్‌, రెతిబౌలి, మియాపూర్‌, సుచిత్ర, సికింద్రాబాద్‌లోని అంతర్గత బస్తీలు, ప్రధాన జంక్షన్ల వద్ద లైట్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది.

20శాతం ఫిర్యాదులు ఇవే..

బల్దియాకు వచ్చే ఫిర్యాదుల్లో 20శాతానికి పైగా విద్యుద్దీపాలపైనే ఉంటున్నాయి. శివారు, జనసంచారం తక్కువగా ఉండే ప్రాంతాల్లో మహిళలు, పిల్లలు రాత్రివేళ బయటకు వెళ్లేందుకు జంకుతున్నారంటూ పలు కాలనీల నుంచి ఫిర్యాదులు వచ్చాయి. టోలిచౌకి నుంచి జూబ్లీహిల్స్‌ వైపు రోడ్లపై గుంతలు ఉండటం, ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక ప్రమాదాలు జరుగుతున్నట్లు అధికారులకు విన్నవిస్తున్నా చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. నానక్‌రామ్‌గూడ ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌ ప్రాంతంలో రాత్రి 10 అయ్యిందంటే చీకట్లు కమ్ముకుంటున్నాయని, బయటకి వెళ్లాలంటేనే భయంగా ఉంటుందని ఐటీ ఉద్యోగి శ్రీకాంత్‌ తెలిపారు. ఎక్కువ సంఖ్యలో విద్యుద్దీపాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు.

ముఖ్యంగా ఈ ప్రాంతాల్లో..

హఫీజ్‌బాబానగర్‌ నుంచి ఒవైసీ సర్కిల్‌ మార్గంలో పైవంతెన పనులు జరుగుతుండటంతో వీధి దీపాలు తొలగించారు. దీంతో అటుగా వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చాంద్రాయణగుట్ట చౌరస్తా, కాటేదాన్‌ రోడ్డులో సెంట్రల్‌ లైటింగ్‌ వెలగడం లేదు. శ్రీశైలం రోడ్డులో కేబుళ్లలో లోపాలు ఉండటంతో ఆ ప్రాంతం అంధకారమైంది. మార్గం ఇరుకుగా ఉండటంతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు.
ఓయూకాలనీ బుల్కాపూర్‌ నాలా చౌరస్తా వద్ద వీధీ దీపాలు ఏర్పాటు చేయాలని కొన్నేళ్లుగా విజ్ఞప్తి చేస్తున్నారు. ఇటుగా నిత్యం ఐటీ ఉద్యోగులు, మహిళలు ప్రయాణాలు సాగిస్తుంటారు. హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు చేస్తామని అధికారులు చెప్పినా ఇప్పటికీ పనులు ప్రారంభం కాలేదు. వినాయక్‌నగర్‌ నాలా, అంబేడ్కర్‌నగర్‌, షేక్‌పేట్‌ బస్తీ, ఆదిత్యనగర్‌లోనూ ఇదే దుస్ధితి.

అత్తాపూర్‌, కాటేదాన్‌, చింతల్‌మెట్‌, హైదర్‌గూడ, మైలార్‌దేవ్‌పల్లిలోని ప్రధాన జంక్షన్లు, ఇతర అంతర్గత బస్తీల్లోని రోడ్లపై చీకట్లే రాజ్యమేలుతున్నాయి. గతేడాది కాటేదాన్‌ పారిశ్రామికవాడలోని ప్రధాన జంక్షన్ల వద్ద వీధీ దీపాలు ఏర్పాటు చేసినా ప్రస్తుతం అవి వెలగడం లేదని స్థానికులు చెబుతున్నారు. బొగ్గులకుంట చౌరస్తా, రంగ్‌మహల్‌, బ్యాంక్‌ స్ట్రీట్‌ ఫిరోజ్‌గాంధీ పార్కు లేన్‌ మార్గంలో, హనుమాన్‌ టేక్డీ ప్రాంతాల్లో, కాచిగూడ క్రాస్‌రోడ్‌ ప్రాంతంలో సైతం వీధి దీపాల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉందని ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.

ABOUT THE AUTHOR

...view details