కరోనా కల్లోలంతో అతలాకుతలమవుతున్న సామాన్య ప్రజల ఇంట కేంద్ర ప్రభుత్వం చాపకింద నీరులా వంట గ్యాస్ మంట పెడుతోంది. చమురు ధరలనూ భగ్గుమనిపిస్తోంది. తొమ్మిది నెలల కాలంలో సిలిండర్పై సుమారు రూ.265.50 పెంచింది. గడిచిన ఏడాది అక్టోబరు, నవంబరులో బిహార్ సహా పలు రాష్ట్రాల్లో ఎన్నికలుండటంతో సెప్టెంబరు నుంచి నవంబరు వరకు ధరలు పెంచలేదు. ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు వరకు నాలుగు నెలల్లో అయిదు సార్లు పెంచింది. అంతర్జాతీయ మార్కెట్ ధరల ఆధారంగా దేశీయంగా చమురు సంస్థలు ధరల్లో మార్పులు, చేర్పులు చేస్తుంటాయి. పెట్రోలు, డీజిల్ ధరలను రోజు వారీగా పెంచుతున్న సంస్థలు వంట గ్యాస్ రేట్లలో ప్రతి నెలా ఒకటీ,రెండు తేదీల్లో మార్పులు చేస్తుంది. 15 రోజులకోసారి ధరల్లో సవరణలు చేసేందుకు కసరత్తు చేసింది. ఒక్క ఫిబ్రవరి నెల మాత్రమే రెండు దఫాలుగా పెంచింది. ఈ నెలలో ఒకటో తేదీ బదులు 17వ తేదీ పెంచింది.
ఏడాదిగా సబ్సిడీ రూ. 40.71 మాత్రమే
తెలంగాణలో 1.10 కోట్ల వంట గ్యాస్ కనెక్షన్లున్నాయి. నెలకు సగటున 65 నుంచి 70 లక్షల సిలిండర్లను మూడు చమురు సంస్థలు వినియోగదారులకు పంపిణీ చేస్తుంటాయి. పెరిగిన ధరలతో రాష్ట్రంలోని వినియోగదారులు సుమారు రూ.150 కోట్లకుపైగా అదనపు భారాన్ని మోయాల్సి వస్తోంది. అయితే ఏప్రిల్లో మాత్రం సిలిండరుపై రూ. పది తగ్గించింది. కరోనా సమయంలో వాణిజ్య వినియోగం తగ్గినప్పటికీ గృహావసరాల సిలిండర్ల వినియోగం పెరిగినట్లు అధికారుల అంచనా. తొమ్మిది నెలల కాలంలో వంట గ్యాస్ ధర రూ. 265లకు పైగా పెంచిన కేంద్రం సబ్సిడీలోనూ కోత విధించింది. సంవత్సర కాలంగా సబ్సిడీ రూ. 40.71 మాత్రమే చెల్లిస్తూ వచ్చింది. తొమ్మిది నెలల కాలంలో చూడటానికి అయిదు సార్లు మాత్రమే ధర పెంచినట్లు కనిపిస్తున్నప్పటికీ అది భారీ బాదుడు కావటంతో సామాన్యుల ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. వాణిజ్యావసరాలకు వినియోగించే 19 కిలోల సిలిండరు ధరను ఏడాది వ్యవధిలో రూ. 507.50 వరకు పెంచింది. ఈ భారం కూడా వినియోగదారులపై పడింది. హోటళ్లు, స్వీట్లు ఇతర తినుబండారాల విక్రయాలపై ప్రభావం పడుతుందనటంలో సందేహం లేదు.