భాగ్యనగరంలో లక్షలమంది వంటగ్యాస్ వినియోగదారులు దోపిడీకి గురవుతున్నారు. ఇటీవల రెండు విడతలుగా సిలిండర్ ధరలను కేంద్రం రూ.100 వరకు పెంచింది. ఆ మొత్తాన్ని వినియోగదారుల ఖాతాల్లో వేస్తామని చెప్పినా ఇంతవరకు జమ కాలేదు. మరో వైపు ధర పెరగకముందే వేలాది మంది సిలిండర్ కోసం బుక్ చేసుకున్నప్పటికీ పలువురు డీలర్లు మాత్రం తాపీగా ఇప్పుడు ఇళ్లకు పంపిస్తున్నారు. దీంతో పెరిగిన భారం వినియోగదారులు మోయాల్సి వస్తోంది. డెలివరీ సిబ్బంది సైతం ఇష్టారీతిన వసూలు చేస్తున్నారు.
రాష్ట్రంలో 80-90 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉంటే ఒక్క రాజధాని పరిధిలోనే 24 లక్షలు ఉన్నాయి. కొంతకాలంగా సబ్సిడీ సిలిండర్ ధర నిలకడగానే ఉంది. ఈనెల 1వ తేదీ వరకు 14.2 కేజీల సిలిండర్ ధర రూ.646.50 ఉంటే రెండో తేదీన కేంద్రం రూ.50 పెంచడంతో రూ.696.50 అయింది. 15న మరోసారి రూ.50 పెంచడంతో ధర రూ.746.50 కు చేరింది. ఇక్కడే రెండు రకాలుగా వినియోగదారులకు నష్టం జరిగింది. ధర పెరిగిన తరువాత తీసుకున్న వారికి ఆ మేరకు వసూలు చేస్తే తప్పులేదు.
కానీ.. నగరంలో కొంతమంది డీలర్లు అడ్డగోలుగా వ్యవహరించారు. ఉదాహరణకు అత్తాపూర్ సోమిరెడ్డినగర్కు చెందిన వినియోగదారుడు ఈనెల 3న సిలిండర్ బుక్ చేసుకున్నారు. ముందురోజే రూ.50 ధర పెరిగింది కాబట్టి రూ.696 బిల్లు కట్టాలి. ఏజెన్సీ ప్రతినిధులు మాత్రం 14 రోజులకు గానీ ఇంటికి ఇవ్వలేదు. అప్పటికి ధర మరో యాభై పెరగడంతో రూ.746.50 బిల్లు అయింది. సిబ్బంది వచ్చి ఆ బిల్లు ఇవ్వకుండానే మామూళ్లు(రూ.23)తో కలిపి రూ.770 వసూలు చేశారు. గత వారం రోజులుగా వేలాది మంది వినియోగదారులు ఇలానే నష్టపోయారు.