తెలంగాణ

telangana

ETV Bharat / city

బండ పేరుతో అడ్డగోలుగా బాదుడు..

గ్యాస్‌ సిలిండర్‌ బుక్‌ చేసుకున్న నాలుగు రోజుల్లోనే ఇంటికి సరఫరా చేయాలి. భాగ్యనగరంలో చాలా ఏజెన్సీలు వారం తర్వాతే సరఫరా మొదలుపెడుతున్నాయి. ఇంటికి తీసుకువస్తున్న సిబ్బంది వసూళ్లకు ఓ అడ్డూ అదుపు లేదు. మూడో అంతస్తులోకి తీసుకురావాలంటే రూ.50, లిప్ట్‌ లేకపోతే మామూళ్ల కింద సిలిండర్‌కు రూ.70 వసూలు చేస్తున్నారు.

By

Published : Dec 17, 2020, 9:33 AM IST

gas cylinder customers got robbed
గ్యాస్ సిలిండర్​ పేరుతో దోపిడీ

భాగ్యనగరంలో లక్షలమంది వంటగ్యాస్‌ వినియోగదారులు దోపిడీకి గురవుతున్నారు. ఇటీవల రెండు విడతలుగా సిలిండర్‌ ధరలను కేంద్రం రూ.100 వరకు పెంచింది. ఆ మొత్తాన్ని వినియోగదారుల ఖాతాల్లో వేస్తామని చెప్పినా ఇంతవరకు జమ కాలేదు. మరో వైపు ధర పెరగకముందే వేలాది మంది సిలిండర్‌ కోసం బుక్‌ చేసుకున్నప్పటికీ పలువురు డీలర్లు మాత్రం తాపీగా ఇప్పుడు ఇళ్లకు పంపిస్తున్నారు. దీంతో పెరిగిన భారం వినియోగదారులు మోయాల్సి వస్తోంది. డెలివరీ సిబ్బంది సైతం ఇష్టారీతిన వసూలు చేస్తున్నారు.

రాష్ట్రంలో 80-90 లక్షల గ్యాస్‌ కనెక్షన్లు ఉంటే ఒక్క రాజధాని పరిధిలోనే 24 లక్షలు ఉన్నాయి. కొంతకాలంగా సబ్సిడీ సిలిండర్‌ ధర నిలకడగానే ఉంది. ఈనెల 1వ తేదీ వరకు 14.2 కేజీల సిలిండర్‌ ధర రూ.646.50 ఉంటే రెండో తేదీన కేంద్రం రూ.50 పెంచడంతో రూ.696.50 అయింది. 15న మరోసారి రూ.50 పెంచడంతో ధర రూ.746.50 కు చేరింది. ఇక్కడే రెండు రకాలుగా వినియోగదారులకు నష్టం జరిగింది. ధర పెరిగిన తరువాత తీసుకున్న వారికి ఆ మేరకు వసూలు చేస్తే తప్పులేదు.

కానీ.. నగరంలో కొంతమంది డీలర్లు అడ్డగోలుగా వ్యవహరించారు. ఉదాహరణకు అత్తాపూర్‌ సోమిరెడ్డినగర్‌కు చెందిన వినియోగదారుడు ఈనెల 3న సిలిండర్‌ బుక్‌ చేసుకున్నారు. ముందురోజే రూ.50 ధర పెరిగింది కాబట్టి రూ.696 బిల్లు కట్టాలి. ఏజెన్సీ ప్రతినిధులు మాత్రం 14 రోజులకు గానీ ఇంటికి ఇవ్వలేదు. అప్పటికి ధర మరో యాభై పెరగడంతో రూ.746.50 బిల్లు అయింది. సిబ్బంది వచ్చి ఆ బిల్లు ఇవ్వకుండానే మామూళ్లు(రూ.23)తో కలిపి రూ.770 వసూలు చేశారు. గత వారం రోజులుగా వేలాది మంది వినియోగదారులు ఇలానే నష్టపోయారు.

ఖాతాలో ఎప్పుడు పడేది!

గతంలో సిలిండర్‌కు రూ.646.50 వసూలు చేస్తే అందులో సబ్సిడీ కింద రూ.40.71 వినియోగదారుని ఖాతాలో పడేవి. కూకట్‌పల్లికి చెందిన వ్యక్తి ఈ నెల 1న గ్యాస్‌బుక్‌ చేసుకోగా పెరిగిన ధరతో కలిపి రూ.696.50 ను డీలరు వసూలు చేశారు. సబ్సిడీ కింద పాత పద్ధతి ప్రకారం ఎంత వచ్చేవో అంతే ఖాతాలో పడ్డాయి. ఈనెల 2 నుంచి 16 వరకు నగర వ్యాప్తంగా లక్షకు పైగా సిలిండర్లను ఏజెన్సీలు సరఫరా చేశాయి. వీరంతా పెరిగిన ధరను చెల్లించినా ఒక్కరికి కూడా ఆ మొత్తాన్ని సబ్సిడీగా బదిలీ చేయలేదు. చమురు సంస్థల ప్రతినిధులు దీనిపై స్పందించేందుకు ఇష్టపడటంలేదు.

సంస్థలు ఎలా చెబితే అలా

చాలా వరకు నాలుగు రోజుల్లోనే గ్యాస్‌ సిలిండర్లను పంపిణీ చేస్తున్నాం. ఎక్కడో కొంతమంది ఆలస్యంగా ఇస్తుండవచ్ఛు రెండుదఫాలు పెరిగిన ధరను తిరిగి వినియోగదారునికి బదిలీ చేసే విషయంలో చమురు సంస్థలే నిర్ణయం తీసుకోవాలి. ఆయా ప్రతినిధులు ఎలా చెబితే అలా చేస్తాం. ఎక్కడైనా సిబ్బంది అధికంగా వసూలు చేస్తే చర్యలు తీసుకుంటాం.

అశోక్‌కుమార్‌, నగర గ్యాస్‌ డీలర్ల సంఘం ప్రతినిధి

ABOUT THE AUTHOR

...view details