హైదరాబాద్ మహానగర పాలక సంస్థ కొత్త పాలకవర్గం కొలువుతీరింది. మేయర్గా బంజారాహిల్స్ తెరాస కార్పొరేటర్ , సీనియర్ నేత కె. కేశవరావు కుమార్తె గద్వాల విజయలక్ష్మి ఎన్నికయ్యారు. ఉప మేయర్గా తార్నాక కార్పొరేటర్ మోతె శ్రీలత విజయం సాధించారు. మరోసారి అధికార పార్టీకి మజ్లిస్ పార్టీ అండగా నిలిచింది. సరైన బలం లేకపోవడంతో మేయర్, ఉపమేయర్ కోసం భాజపా పోటీపడినా ఓటమి చవిచూసింది.
మేయర్గా గద్వాల విజయలక్ష్మి..
మేయర్గా అధికార తెరాస తరపున బంజారాహిల్స్ కార్పొరేటర్ గద్వాల విజయలక్ష్మీని మేయర్గా తెరాస నియమించింది. మేయర్గా విజయలక్ష్మీ పేరును..... మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్ ప్రతిపాదించగా... గాజులరామారం డివిజన్ కార్పొరేటర్ రావుల శేషగిరి మద్దతు తెలిపారు. మేయర్ అభ్యర్థిగా అర్కేపురం డివిజన్ అభ్యర్థి వీరన్నగారి రాధను భాజపా నిలబెట్టింది. మైలార్ దేవ్పల్లి డివిజన్ కార్పొరేటర్ శ్రీనివాస్ రెడ్డి ప్రతిపాదించగా.. వినాయక నగర్ డివిజన్ అభ్యర్థి రాజ్యలక్ష్మీ మద్దతు తెలిపారు. ఆ తర్వాత మేయర్ ఎన్నికను రిటర్నింగ్ అధికారి శ్వేతా మహంతి నిర్వహించారు. అందులో విజయలక్ష్మీకి ఎక్కువ ఓట్లు రావడంతో విజయలక్ష్మీ అధికారికంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు.