ఉపాధి హామీ పథకం కింద చేపడుతున్న పనుల్లో దుర్వినియోగమైన నిధుల రికవరీ తక్కువగా ఉందని కేంద్ర పంచాయతీరాజ్శాఖ పేర్కొంది. రాష్ట్రంలో 2020-21 ఏడాదికి పథకం కింద రూ.84.7 కోట్లు దుర్వినియోగమైనట్లు వెల్లడైతే రూ.1.15 కోట్లు మాత్రమే రికవరీ జరిగిందని తెలిపింది. పనులు, నిధులపై సామాజిక తనిఖీ పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన క్షేత్రస్థాయి సిబ్బందిని నియమించి, తనిఖీల్లో వెల్లడైన లోటుపాట్లు, తీసుకున్న చర్యలను ఎప్పటికప్పుడు పోర్టల్లో నమోదు చేయాలంది. గత ఏడాదికి సంబంధించి ఉపాధి హామీ పనితీరుపై మదింపు నివేదికలో ఈ విషయాలు తెలిపింది. నిధుల దుర్వినియోగానికి సంబంధించిన రికార్డులను నిర్వహించి, వాటి రికవరీ వివరాలను కేంద్రానికి పంపించాలంది.
ఎప్పటికప్పుడు సమీక్ష..
ఉపాధి హామీ కింద చేపట్టిన, పూర్తయిన పనుల వివరాలను జియో ట్యాగింగ్ చేయాలంది. తొలిదశలో చేపట్టిన పనులు ఆస్తులు క్షేత్రస్థాయిలో కనిపించకపోయినా, కొట్టుకుపోయినా కారణాలపై ప్రభుత్వం ధ్రువీకరణ ఇవ్వాలని ఆదేశించింది. హైదరాబాద్ మినహా మిగతా 32 జిల్లాలకు అంబుడ్స్మెన్ నియామకాన్ని పూర్తి చేయాలంది. ఉపాధి హామీ పనులకు సంబంధించిన ఫిర్యాదులపై తీసుకుంటున్న చర్యలపై ఎప్పటికప్పుడు సమీక్షించాలని అధికారులకు తెలిపింది. దీన్దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ యోజన కింద గతేడాది 1063 మందికి శిక్షణ లభించిందని, 2021-22లో 42 వేల మందికి శిక్షణ పూర్తి చేయాలని సూచించింది.