తెలంగాణ

telangana

ETV Bharat / city

అధికారుల ఎత్తులకు పైఎత్తులు.. అడ్డదారిలో బంగారం.. - తెలంగాణ నేర వార్తలు

విదేశాల నుంచి హైదరాబాద్‌కు బంగారం అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడడంలేదు. ఎప్పటికప్పుడు తమ విధానాలను మార్చుకుంటూ…అధికారుల కళ్లుగప్పి తెస్తున్నారు. అధికారుల ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నారు అక్రమార్కులు. ఎయిర్‌ పోర్టులో నిఘా కళ్లకూ దొరక్కుండా తప్పించుకుంటున్నారు. అధికారికంగా విదేశాల నుంచి తెచ్చిన బంగారం అయితే.. ప్రభుత్వానికి 40శాతానికిపైగా ఎక్సైజ్‌ సుంకం, జీఎస్టీలు చెల్లించాల్సి ఉంటుంది. వాటిని తప్పించుకోవడం కోసం అక్రమార్కులు తరచూ అడ్డదారులు వెతుక్కుంటూ.. పన్నులను ఎగవేస్తున్నారు.

foreign to hyderabad Gold Transport by  illegals
అధికారుల ఎత్తులకు పైఎత్తులు.. అడ్డదారిలో బంగారం..

By

Published : Dec 26, 2020, 4:09 PM IST

విదేశాల నుంచి బంగారం అక్రమ రవాణా ఆగడం లేదు. అధికారుల ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నారు అక్రమార్కులు. విదేశాల నుంచి మూడో కంటికి తెలియకుండా బంగారం స్మగ్లింగ్‌ చేస్తున్నారు. అక్రమ రవాణానే వృత్తిగా ఎంచుకుంటున్న అక్రమార్కులు.. తమిళనాడుకు చెందిన వారినే ఎక్కువగా ఇందుకు ఉపయోగిస్తున్నట్లు కస్టమ్స్‌ అధికారుల పరిశీలనలో వెల్లడైంది. బంగారాన్ని ధరించడం ఇక్కడ సంప్రదాయం కావడంతో ఉత్తరభారత దేశం కంటే దక్షిణ భారత దేశంలో వినియోగం అధికం. అందువల్ల బంగారానికి డిమాండ్‌ ఎక్కువ. ప్రధానంగా గల్ఫ్‌ దేశాల నుంచి అనధికారికంగా స్మగ్లింగ్‌ అయ్యే బంగారంలో ఎక్కువ భాగం హైదరాబాద్‌, చెన్నై, బెంగుళూరుకు చేరుతుంది.

పన్నుల ఎగవేత:

రాజ మార్గాన బయట దేశాల నుంచి బంగారం దిగుమతి చేసుకోవాలంటే ఎక్సైజ్‌ సుంకం 38.5 శాతం, మరో 3శాతం జీఎస్టీ కట్టాలి. అంటే విదేశాల నుంచి తెచ్చిన బంగారం విలువపై 40శాతానికిపైగా ఎక్సైజ్‌ సుంకం, జీఎస్టీలు చెల్లించాల్సి ఉంటుంది. ఇదే జరిగితే.. బయట దేశాల నుంచి తెచ్చే బంగారం ధరలు.. స్థానిక ధరల కంటే ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. అందువల్ల కొన్ని సార్లు నష్టమూ రావచ్చు. అక్రమార్కులు విదేశాల నుంచి బంగారం స్మగ్లింగ్‌ చేస్తూ.. ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులను ఎగవేస్తున్నారు.

మూడుపూవులు.. ఆరు కాయలుగా..

ఈ ఏడాది కొవిడ్‌ ప్రభావంతో.. బంగారం ధరలకు రెక్కలొచ్చాయి. అనూహ్యంగా పెరిగి యాభైవేల మార్కు దాటింది. ఈ అవకాశాన్ని వినియోగించుకుని అక్రమార్కులు భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. దొరికితే దొంగలు.. లేకపోతే దొరలు అన్న చందంగా మూడుపూవులు.. ఆరు కాయలుగా బంగారం అక్రమ రవాణా సాగుతోంది. హైదరాబాద్‌, చెన్నై, బెంగుళూరు విమానాశ్రయాల్లో డీఆర్‌ఐ, కస్టమ్స్‌, సీఐఎస్‌ఎఫ్‌ అధికారుల నిఘాను ఎప్పటికప్పుడు అంచనా వేసుకుంటూ అక్రమార్కులు తమ ఎత్తులను మార్చుకుంటున్నట్లు అధికారుల పరిశీలనలో తేలింది. పక్కా సమాచారం ఉంటే తప్ప బంగారం అక్రమ రవాణాదారులు పట్టుబడడం లేదు.

తెరవెనుకే ఉంటారు:

గల్ఫ్‌ దేశాల నుంచే కాకుండా దేశ సరిహద్దు ప్రాంతాలైన భూటాన్‌, నేపాల్‌, మయన్మార్‌ దేశాల నుంచీ బంగారాన్ని సరిహద్దులు దాటిస్తున్నారు. అక్రమార్కులు ఎక్కువగా క్యారియర్స్‌ను వాడుకుంటున్నారు. దొరికినా తెరవెనుక సూత్రధారులు పట్టుబడరు. జీవనోపాధి కోసం గల్ఫ్‌ దేశాలకు వెళ్లి తిరిగి భారత్​కు వచ్చే వారిని.. బంగారాన్ని అక్రమంగా పంపేందుకు ఉపయోగించుకుంటున్నారు.

ఉచితం అంటూ..

ఉచితంగా పుణ్యక్షేత్రాలు చూపిస్తామంటూ విదేశాలకు పంపించి.. అక్కడి నుంచి బంగారాన్ని తెప్పిస్తున్నారు. చెన్నై ప్రాంతానికి చెందిన వారిని కారియర్స్​గా బంగారం స్మగ్లింగ్‌ కోసమే గల్ఫ్‌ దేశాలకు పంపిస్తున్నారు. విదేశాల నుంచి... హైదరాబాద్‌, బెంగుళూరు, చెన్నైలకు వచ్చే వారికి అక్రమార్కులే టికెట్లు తీయించి తామిచ్చిన పార్శిల్​ను తమ వాళ్లకు అందచేయాలని చెప్తున్నారు. అదే విధంగా బంగారం స్మగ్లింగ్‌ కోసం ప్రత్యేకంగా ట్రాలీ బ్యాగ్‌లు, సూట్‌కేసులు లాంటి కొన్ని నిత్యావసర పరికరాలను సిద్ధం చేసి అందులో బంగారాన్ని కడ్డీల రూపంలో, తీగ రూపంలో పెట్టి పంపిస్తున్నారు. అధికారులు పసిగట్టి ఆ విధానాలను తెలుసుకునే లోపు పైఎత్తులు వేసి నిఘా కళ్లు కప్పేస్తున్నారు.

ఇదీ చూడండి: రైతు గోస: అధికారులకు లంచం ఇవ్వడానికి భిక్షాటన

ABOUT THE AUTHOR

...view details