వరి కొనుగోళ్లపై తెలంగాణలో తెరాస-భాజపా మధ్య పంచాయితీ నడుస్తోంది. ఒకరిపై మరొకరు తీవ్రవ్యాఖ్యలు చేస్తున్నారు. తామంటే తామే రైతులకు మేలు చేస్తున్నామంటూ ప్రకటనలు చేస్తున్నారు. హుజూరాబాద్ ఎన్నికల ముందు ఈటల కేంద్రంగా రాజకీయాలు చేసిన తెరాస, భాజపా. ఫలితాల అనంతరం వరి కొనుగోళ్ల వ్యవహారాన్ని భుజానికెత్తుకున్నాయి. ఫలితంగా ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుతోంది. ఈటల బర్తరఫ్ సమయంలో వేడెక్కిన తెలంగాణ రాజకీయం నేటి వరకు రోజుకో మలుపు తిరుగుతూ మరింతగా హీటెక్కుతోంది.
తెరాస వాదనిది..
కేంద్రం ప్రభుత్వం రాష్ట్రంలోని రైతులను మోసం చేస్తోందని.. ఉత్తరాదిపై ప్రేమ కురిపిస్తూ.. దక్షిణాది రైతులను ముంచేస్తోందని తెరాస నేతలు ఆరోపించారు. కేంద్ర వరి కొనుగోలు చేయలేము.. వరి సాగు నుంచి రైతులను దృష్టిమళ్లించాలని కోరితేనే.. తెలంగాణ ప్రభుత్వం రైతులకు స్పష్టమైన ప్రకటన చేసిందని.. తెరాస నేతలు, మంత్రులు చెబుతున్నారు.
ప్రతి గింజా కొంటామన్నారుగా.. అంటున్న భాజపా
రాష్ట్రంలో పండిన ప్రతిగింజా కొంటామని.. కేంద్రంలో పనేంటని గతంలో తెరాస ప్రభుత్వం, నేతలు అనేకసార్లు చెప్పారంటూ.. గులాబీ పార్టీ నేతలపై భాజపా నేతలు మండిపడుతున్నారు. ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్రానికి పైసా కూడా ఖర్చులేదని.. చివరికి గన్నీ సంచుల నగదు కూడా కేంద్రమే ఇస్తోందని.. తెరాస నేతలు రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని.. ధాన్యం కొనుగోలు చేయమని కేంద్రం ఎటువంటి ప్రకటన చేయలేదని రాష్ట్ర భాజపా నేతలు చెబుతున్నారు. ఆగస్టు 31న రాష్ట్ర ప్రభుత్వానికి ఎఫ్సీఐ లేఖ రాసిందని.. 40 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం, 60 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొంటామని కేంద్రం లేఖ ఇచ్చిందని భాజపా నేతలు చెబుతున్నారు. ఇలా కేంద్రానిదే తప్పని తెరాస నేతలు, రాష్ట్రానిదే బాధ్యతని భాజపా నేతలు ఎవరికీ వారు తెగేసి చెబుతున్నారు.
కేసీఆరే స్వయంగా రంగంలోకి..
ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగారు. నవంబర్ 7న సుమారు గంటన్నరపాటు మీడియా సమావేశం నిర్వహించి.. కేంద్ర ప్రభుత్వం, భాజపా నేతలపై వ్యాఖ్యలపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. వరి కొనుగోళ్ల వ్యవహారంలో కేంద్రం కొర్రీలు పెడుతోందంటూ.. నిప్పులు చెరిగారు. వరి కొనుగోళ్లు చేయలేమని... రైతులకు ప్రత్యామ్నాయ మార్గాలు చూపించాలని లిఖితపూర్వకంగా కేంద్రం రాసిచ్చిందని కేసీఆర్ వెల్లడించారు. కేంద్రం సూచనతోనే రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి యాసింగిలో వరి సాగుచేయొద్దని స్పష్టమైన ప్రకటన చేయాల్సి వచ్చిందని వివరించారు.
'ప్రజలకు ఆహార కొరత రాకుండా చూసుకునే బాధ్యతను రాజ్యాంగం కేంద్రంపై పెట్టింది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తన బాధ్యతను విస్మరిస్తోంది. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రం రోజుకో మాట చెబుతోంది. ధాన్యం విదేశాలకు ఎగుమతి చేసే అధికారం రాష్ట్రాలకు లేదు. ధాన్యం సేకరణ, నిల్వ, ఎగుమతి వంటి అంశాలు కేంద్రం పరిధిలో ఉన్నాయి. రైతులతో పంట మార్పిడి చేయించాలని కేంద్రమే చెప్పింది.