తెలంగాణ

telangana

ETV Bharat / city

రాష్ట్రవ్యాప్తంగా ఫీవర్‌ సర్వే.. అవగాహన, అప్రమత్తపై దృష్టి - fever survey updates

రాష్ట్రవ్యాప్తంగా ఫీవర్‌ సర్వే కొనసాగుతోంది. లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఈ సర్వే ద్వారా ప్రజల్లో కరోనాపై భయాన్ని పోగొట్టడంతో పాటు స్వల్ప లక్షణాలు ఉన్న వాళ్లను హోం ఐసోలేషన్​కు పరిమితం చేస్తున్నామని వైద్యారోగ్యశాఖ అధికారులు తెలిపారు.

fever survey continuing in all districts in telangana
fever survey continuing in all districts in telangana

By

Published : May 8, 2021, 10:55 PM IST

రాష్ట్రవ్యాప్తంగా ఫీవర్‌ సర్వే.. అవగాహన, అప్రమత్తపై దృష్టి

కొవిడ్​ నియంత్రణలో భాగంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న పీవర్​ సర్వే రాష్ట్రవ్యాప్తంగా జోరుగా సాగుతోంది. గ్రేటర్ హైదరాబాద్​లో ఇవాళ 704 బృందాలతో 48,797 ఇళ్లలో సర్వే నిర్వహించారు. సోమవారం నుంచి ప్రారంభమైన ఈ సర్వేలో ప్రతి రోజు జీహెచ్ఎంసీ, వైద్య ఆరోగ్య శాఖలకు చెందిన బృందాలు ఇంటింటికి తిరిగి జ్వరం, కొవిడ్ లక్షణాలున్నవారి సర్వేను పెద్ద ఎత్తున చేపట్టాయి. ఒక్కో బృందంలో ఏఎన్​ఎం ఆశావర్కర్, జీహెచ్ఎంసీ వర్కర్​తో కూడిన సభ్యులు ఇంటింటికి తిరిగి సర్వేను చేపట్టారు. జ్వరంతో ఉన్న వారి వివరాలు సేకరించి వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతో పాటు కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో యాంటీ లార్వా ద్రావకాన్ని పిచికారీ చేస్తున్నారు.

కరోనా లక్షణాలు ఉండి కూడా కొంతమంది నిర్లక్ష్యం చేస్తున్నారని దాని వల్ల వ్యాధి తీవ్రత పెరిగి వారు ఇబ్బంది పడటంతో పాటు కుటుంబ సభ్యులకు, ఇతరులకు వ్యాపింపజేస్తున్నారని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​ రావు అన్నారు. మెదక్ కలెక్టరేట్‌లో ఫీవర్‌ సర్వేపై అధికారులతో మంత్రి హరీశ్​ రావు, ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌ రెడ్డి, ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డి, అందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ సమీక్ష నిర్వహించారు. కొవిడ్ విస్తరిస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా ఇంటింటి సర్వే చేస్తున్నామన్నారు. జిల్లాలో వెయ్యి ఇళ్లకు ఒక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అందులో భాగంగా జిల్లాలో ఇప్పటివరకు ఒక లక్షా 40 వేల ఇళ్లను సర్వే చేయించామన్నారు. 6,120 మందికి వ్యాధి లక్షణాలు ఉన్నట్లు గుర్తించామన్నారు. జిల్లాలో 240 ఆక్సిజన్​తో కూడిన బెడ్లు ఉన్నాయని, ప్రైవేట్ ఆస్పత్రిలో కూడా 600 పడకలు అందుబాటులో ఉన్నాయన్నారు.

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఫీవర్ సర్వే నిరాటంకంగా కొనసాగుతోంది. శని, ఆదివారాలు సెలవులున్నా వైద్యారోగ్య, మున్సిపల్ అధికారులు మాత్రం సర్వేను కొనసాగిస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో ఇప్పటి వరకూ సుమారు లక్షా 90వేల మందికికి సంబంధించిన సర్వేను దాదాపు పూర్తి చేశారు. ప్రతి ఆశా కార్యకర్త రోజుకు వెయ్యి మందిని సర్వే చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకోసం పట్టణంలో 97 బృందాలు, గ్రామీణ ప్రాంతాల్లో 690కి పైగా బృందాలు పనిచేస్తున్నాయి. మహబూబ్ నగర్ పట్టణంలో జరిగిన ఇంటింటి ఫీవర్ సర్వేను కలెక్టర్​ వెంకట్రావు స్వయంగా పరిశీలించారు. మున్సిపాలిటీ అధికారులు సైతం సర్వేలో పాల్గొని..పాజిటివ్ కేసులు నమోదైన చోట క్రిమిసంహారక ద్రావణాల పిచికారీ చేస్తున్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలో ఇప్పటి వరకూ 85,357 కుటుంబాలను సర్వే చేయగా.. 1,436 మందికి ఐసోలేషన్ కిట్లు పంపిణీ చేశారు. 1,927 అనుమానితులను గుర్తించారు.

మహబూబాబాద్ జిల్లాలోని 461 గ్రామపంచాయతీలు, 4 మున్సిపాలిటీల్లో ఆశా, అంగన్వాడీ, పంచాయతీ కార్యదర్శి, పట్టణాల్లో మున్సిపల్ సిబ్బందితో 728 బృందాలను ఏర్పాటు చేశారు. వీరు ఇంటింటికీ తిరుగుతూ జ్వరం, దగ్గు, జలుబుతో పాటు కరోనా వైరస్ లక్షణాలతో బాధ పడుతున్న వారిని గుర్తిస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల కేంద్రంలో జరుగుతున్న ఇంటింటి సర్వేను జిల్లా కలెక్టర్ గౌతమ్, అడిషనల్ కలెక్టర్ అభిలాష అభినవ్ పరిశీలించారు. మొదటి రోజు కరోనా ప్రాథమిక లక్షణాలు కలిగిన 548 మందిని గుర్తించి వారికి ఔషధ కిట్ల ను అందించారు.

ఇదీ చూడండి: ప్రజలు కరోనాతో మరణిస్తుంటే.. మీకు ఇది అవసరమా?

ABOUT THE AUTHOR

...view details