తెలంగాణ

telangana

ETV Bharat / city

నేలంతా విషమంట.. రసాయన ఎరువుల దయేనట! - తెలంగాణలో రసాయన ఎరువుల వాడకం

రాష్ట్రంలో రసాయన ఎరువుల వాడకం ఎక్కువగా ఉంటోందని వ్యవసాయశాఖ అధ్యయనంలో తేలింది. ఎకరానికి 185 కిలోల రసాయనాలను వాడుతున్నట్లు స్పష్టం చేసింది. జాతీయ సగటుకన్నా ఏకంగా 261 శాతం అధికంగా వాడినట్లు పేర్కొంది. రైతుల్లో అవగాహన లేకపోవడమే కారణమని తెలిపింది.

fertilizers
fertilizers

By

Published : Jun 18, 2020, 7:52 AM IST

Updated : Jun 18, 2020, 8:34 AM IST

రాష్ట్రంలో పంటల సాగుకు రసాయన ఎరువులు విచ్చలవిడిగా వినియోగిస్తున్నారు. గతేడాది(2019-20) జాతీయ సగటుకన్నా ఏకంగా 261 శాతం అధికంగా వాడినట్లు వ్యవసాయశాఖ అధ్యయనంలో తేలింది. ప్రస్తుత వానాకాలం(ఖరీఫ్‌) సీజన్‌లో రసాయన ఎరువుల కోటా పెంచాలని ఇటీవల కేంద్రాన్ని వ్యవసాయశాఖ అడిగింది. ఇప్పటికే తెలంగాణలో ఎక్కువగా వినియోగిస్తున్నారని, వాటిని నియంత్రించాలని కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ సూచించింది.

ఈ నేపథ్యంలో గతేడాది రాష్ట్రంలో వాడిన ఎరువులెన్ని, సాగైన విస్తీర్ణమెంత, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎలా ఉందనే అంశాలపై వ్యవసాయశాఖ వివరాలు సేకరించింది. ప్రపంచ దేశాల్లో సగటున ఎకరానికి 78.4, భారతదేశంలో జాతీయ సగటు 51.2, తెలంగాణలో 185 కిలోలు వినియోగిస్తున్నట్లు తెలిపింది. ఇంత ఎక్కువగా వాడటానికి రాష్ట్రంలో భూసార పరీక్షల ఫలితాలు సరిగా లేకపోవడం, రైతుల్లో అవగాహనా లేమి అని అంచనా.

ఇంకా ఇంకా భాస్వరం వాడేస్తున్నారు

ఇప్పటికే కొన్ని ప్రాంతాల నేలల్లో భాస్వరం శాతం సాధారణం కన్నా ఎక్కువగా ఉంది. మోతాదుకు మించి వాడటం వల్ల అది నేలలో కరగకుండా నిల్వలు పేరుకుపోతున్నాయి. కరిగించడానికి ఫాస్ఫరస్‌ సాల్యుబుల్‌ బ్యాక్టీరియా(పీఎస్‌బీ)ని వాడాలి. బదులుగా ఇంకా భాస్వరమే వాడుతున్నారని, పీఎస్‌బీని రైతులు కొనడం లేదని వ్యవసాయాధికారులు తెలిపారు.

భూసార పరీక్షలు చేయించి భాస్వరం ఎక్కువగా ఉన్న పొలాల్లో పీఎస్‌బీ చల్లితే ఈ సీజన్‌లో భాస్వరం (డై అమ్మోనియం ఫాస్ఫేట్‌-డీఏపీ) వాడకుండానే సరిపోతుంది. ఒక్కో డీఏపీ 50 కిలోల బస్తాను రూ.1,250 నుంచి 1,300 దాకా అమ్ముతున్నారు. దీనిని వాడకపోతే రైతుకు ఈ మేరకు కలిసొస్తుంది. జీవన ఎరువుల వాడకంపై రైతులకు అవగాహన కల్పించాలని అన్ని జిల్లాల వ్యవసాయాధికారులకు వ్యవసాయశాఖ తాజాగా ఉత్తర్వులు జారీచేసింది.

నత్రజని లోపం ఉంటేనే యూరియా చల్లాలి

కొందరు రైతులు యూరియా ఎక్కువ చల్లితే పంట దిగుబడి ఎక్కువ వస్తుందని ఎకరాకు నాలుగైదు బస్తాలు చల్లుతున్నారు. వాస్తవానికి నేలలో నత్రజని లోపం ఉంటేనే యూరియా చల్లాలి. పంట సాగుకు ముందు జీలుగ, పిల్లిపెసర వంటి పచ్చిరొట్ట పైరు వేసి కలియదున్నితే నేలలో నత్రజని పోషకం సహజంగానే పెరుగుతుంది. ఆ తరువాత ప్రధాన పంట సాగుచేస్తే యూరియా వాడకం తగ్గిపోతుంది.

రైతులకు అవగాహన కల్పించి ఏ పంటకు ఎంత రసాయన ఎరువులు అవసరమో అంతే వాడేలా చూడాలని ఆదేశాలిచ్చినట్లు వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి బి.జనార్దన్‌రెడ్డి ఈనాడుకు చెప్పారు. ఎరువుల వాడకం తగ్గిస్తే పంట సాగు వ్యయం తగ్గి రైతులకు ఆదాయం పెరుగుతుందని సూచించారు.

ఇదీ చదవండి:లాక్‌డౌన్‌పై సీఎం కేసీఆర్‌ సందేహానికి ప్రధాని స్పష్టత

Last Updated : Jun 18, 2020, 8:34 AM IST

ABOUT THE AUTHOR

...view details