తెలంగాణ

telangana

ETV Bharat / city

పెరిగిన ధరలు: ఖరీఫ్‌ ఆరంభానికి ముందే రైతులపై ఆర్థికభారం

ముడిసరకులు, పెట్రో ధరల పెంపు ప్రభావం ఎరువుల రూపంలో రైతులను పిడుగులా తాకనుంది. జూన్‌ నుంచి ప్రారంభమయ్యే ఖరీఫ్‌(వానాకాలం) సీజన్‌ ఆరంభానికి ముందే డీఏపీ, కాంప్లెక్స్‌(మిశ్రమ) ఎరువుల ధరలను పెంచాలని కంపెనీలు నిర్ణయించడమే దానికి కారణం. ఈ మేరకు టోకు వ్యాపారులకు సమాచారం అందింది. పెంపు సుమారు 58 శాతం ఉండటంతో అన్నింటి ధరలు భారీగా పెరగనున్నాయి. మొదలే సాగు వ్యయం పెరిగి, పండిన పంటలకు మద్దతు ధర దొరకని పరిస్థితుల్లో నానా ఇబ్బందులు పడుతున్న అన్నదాతలకు ఈ నిర్ణయం అశనిపాతమేననే ఆందోళన వ్యక్తమవుతోంది.

By

Published : Apr 9, 2021, 4:10 AM IST

fertilizer prices are increased in telangana farmers facing financial problems
పెరిగిన ధరలు: ఖరీఫ్‌ ఆరంభానికి ముందే రైతులపై ఆర్థికభారం


మోయలేని బరువే..


‘డై అమ్మోనియం ఫాస్ఫేట్‌’(డీఏపీ) 50 కిలోల బస్తా గరిష్ఠ చిల్లర ధర(ఎమ్మార్పీ) ప్రస్తుతం రూ.1200 ఉండగా, పెరిగిన ఉత్పత్తి వ్యయంతో రూ.1900 అవుతుందని ‘ఇఫ్కో’ కంపెనీ వ్యాపారులకు పంపిన సమాచారంలో తెలిపింది. ప్రస్తుతం చిల్లర, టోకు వ్యాపారుల వద్ద నిల్వ ఉన్న సరకును పాత ధరలకే అమ్మాలని, ఈ నెల ఒకటి నుంచి సరఫరా అయ్యే వాటికి మాత్రమే కొత్త ధరలు వర్తిస్తాయని పేర్కొంది. ఇదే కాదు ఇతర కంపెనీలు కూడా ధరలు పెంచుతున్నట్లు జిల్లాల్లోని వ్యాపారులకు సమాచారం ఇచ్చాయి. ఆయా కంపెనీలు డీఏపీ ధరను రూ.1200 నుంచి 1700 వరకూ పెంచాయి. తాజా పెంపుతో సాగువ్యయం గణనీయంగా పెరగనుంది. ‘డీఏపీ సహా పెరిగే అన్నింటి ధరలను పరిగణనలోకి తీసుకుంటే అదనంగా కనీసంగా ఎకరాకి రూ.2 వేల భారం పడే అవకాశం ఉందని’ వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. వరి సాగుచేసే రైతులపై ఈ భారం దాదాపు రూ.3 వేల వరకు ఉంటుందని పేర్కొన్నాయి. ప్రస్తుత వేసవిలో పంటల సాగు లేనందున ఎరువులను రైతులు కొనడం లేదు. వచ్చే నెలాఖరు నుంచి కొనుగోళ్లు మొదలవుతాయి. అప్పటికి కొత్త ధరలతో కొత్త నిల్వలు జిల్లాలకు వస్తాయని ఓ కంపెనీ అధికారి ‘ఈనాడు’కు చెప్పారు. తెలంగాణలో వానాకాలం, రబీ సీజన్లలో కలిపి 3 లక్షల టన్నుల డీఏపీ, 10 లక్షల టన్నుల కాంప్లెక్స్‌ ఎరువుల విక్రయాలు జరుగుతాయి.

పాత డీఏపీ పాత ధరకే: ఇఫ్కో ప్రకటన


దిల్లీ: పాత డీఏపీని పాత ధరలకే విక్రయించనున్నట్టు సహకార రంగంలోని ఇఫ్కో ప్రకటించింది. 50 కిలోల డీఏపీ సంచిని రూ.1,200కు, ఎంఓపీ, ఎన్‌పీకేలను రూ.925-1,185 మధ్య విక్రయిస్తామని తెలిపింది. మొత్తం 11.26 లక్షల టన్నుల సరకును అమ్మకానికి పెడతామని పేర్కొంది. ‘కొత్త సరకుకు కొత్త ధర ఉన్నా, అవి ప్రస్తుతానికి రైతులకు విక్రయించడానికి కాదు. ఆ సరకును నిల్వ చేస్తారు. పాత నిల్వలు పూర్తయిన తరువాతనే కొత్త నిల్వలు రైతులకు అందుబాటులోకి వస్తాయి’ అని ఇఫ్కో ఎండీ అవస్థీ ట్విటర్‌లో తెలిపారు. భవిష్యత్తులో ధర తగ్గే అవకాశం కూడా ఉంటుందని చెప్పారు. ఎరువుల ధరలు బాగా పెరగబోతున్నాయంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరగడం, కొందరు ఇఫ్కో ధరల పత్రాన్ని అందులో చూపడంతో కేంద్ర ఎరువుల శాఖ అవస్థీ ద్వారా హడావుడిగా ఈ వివరణ ఇప్పించిందనే విమర్శలున్నాయి.

ఇవీ చూడండి: ప్రైవేట్ ఉపాధ్యాయులు, సిబ్బందికి సాయం ప్రకటించిన సీఎం కేసీఆర్

ABOUT THE AUTHOR

...view details