తగ్గిపోయిందనుకున్న కొవిడ్ ఒక్కసారిగా విరుచుకుపడుతోంది. మీ పరిశీలన...
ముఖ్యంగా మూడు కారణాల వల్ల వైరస్ తిరిగి విరుచుకుపడుతోంది.
- కొవిడ్ నిబంధనలను ఉల్లంఘించడం...అంటే మాస్కులు ధరించకపోవడం, గుంపులు, గుంపులుగా చేరిపోవడం, చేతులు శుభ్రపర్చుకోకపోవడం వంటివాటిని వదిలేయడం.
- శుభకార్యాలు, పండుగల పేరిట ప్రజలు పెద్దసంఖ్యలో గుమిగూడారు. ఎన్నికలు కూడా ప్రజలు ఒకచోటుకు పెద్దసంఖ్యలో చేరడానికి కారణమైంది.
- వైరస్ జన్యుపరంగా పరిణామం చెందడం. ముఖ్యంగా బ్రిటన్ రకం వైరస్ మన దగ్గర తీవ్ర ప్రభావాన్నే చూపుతోందని పరిశోధనలు చెబుతున్నాయి. దీని వల్ల అధిక మరణాలు లేవు గానీ ఎక్కువమందికి ఇది వ్యాప్తి చెందుతోంది. ఇవి కాకుండా మన దేశంలోనే మార్పు చెందిన వైరస్ కూడా ప్రభావం చూపుతోంది. దీన్ని ‘డబుల్ మ్యూటెంట్’గా గుర్తించారు.
కొవిడ్ తొలిదశకు, రెండోదశకు మధ్య ఉద్ధృతిలో ఏమైనా తేడాలున్నాయా?
మొదటి దశ నెమ్మదిగా మొదలైంది. ఏప్రిల్, మేలో ప్రారంభమై ఆగస్టు, సెప్టెంబరుకు తారాస్థాయికి చేరుకుంది. అదే రెండోదశ మార్చిలో ప్రారంభమై ఏప్రిల్ రాకముందే ఉద్ధృతి పెరిగింది. 1918లో స్పానిష్ ఫ్లూలోనూ రెండోదశ, మూడోదశల్లో ఉన్నట్టుండి తీవ్రత పెరిగింది. అంతే వేగంగా ఆ తీవ్రత తగ్గిపోతుంది. ప్రస్తుతం మన దగ్గర కొవిడ్ రెండోదశ ఉద్ధృతి మే నెలాఖరు వరకూ ఇలాగే కొనసాగుతుందని అంచనా. ఈలోగా మనం ఎంత వేగంగా ఎక్కువమందికి వ్యాక్సిన్ ఇవ్వగలిగామనేది ముఖ్యం. అలాగే అందరం కూడా కొవిడ్ నిబంధనలను కచ్చితంగా పాటిస్తున్నామా? లేదా? అనేది అతి ముఖ్యం. ఈ రెండూ గనుక ఆచరిస్తే మే నెలాఖరుకు కొవిడ్ను అదుపులోకి తీసుకురావచ్చు. ప్రస్తుతం రోజుకు సగటున 15-20 లక్షల వరకూ టీకాలు ఇస్తున్నారు. ఈ సంఖ్యను 50 లక్షలకు పెంచాలి. 45 ఏళ్ల పైబడినవారికే ఇవ్వాలనే నిబంధన కూడా సరికాదు. 18 ఏళ్లు పైబడిన వారందరికీ ఇవ్వాలి.
ఇప్పటికీ టీకాలు తీసుకోవడంపై అపోహలున్నాయి
దీనిపై మేం అధ్యయనం చేశాం. ఇప్పటికీ 30-40 శాతం మంది టీకాలను పొందడానికి ముందుకు రావడం లేదు. టీకాలపై అపోహలను తొలగించడానికి అమెరికా ప్రభుత్వం పలువురు వేర్వేరు రంగాలకు చెందిన ప్రముఖులను రంగంలోకి దింపింది. ఈ ప్రక్రియ సానుకూల ఫలితాలనిచ్చింది. మన దగ్గర కూడా రాజకీయ నేతలు, సినిమా నటులు, క్రీడాకారులు, గాయకులు, ప్రముఖ వైద్య నిపుణులు, పారిశ్రామికవేత్తలు.. ఇలా వేర్వేరు రంగాలకు ప్రముఖులను కూడా ప్రచారంలోకి తీసుకురావాలి. కొవిడ్ టీకా తీసుకున్న తర్వాత రక్తనాళాల్లో గడ్డకట్టే ప్రమాదముందని కొంత ప్రచారం జరిగింది. యూరప్ దేశాల్లో చాలా తక్కువమందిపై చేసిన ఒక అధ్యయనంలో ఈ తరహాలో జరిగినట్లు వెల్లడించారు. కానీ మన దేశంలో ఒక్క కేసు కూడా ఇటువంటిది నమోదు కాలేదు. అందువల్ల మనం భయపడాల్సిన పనిలేదు. ఏ టీకా తీసుకోవాలని కూడా చాలా మంది అడుగుతుంటారు. అన్ని టీకాలు సమర్థమైనవే. ఏ టీకా అందుబాటులో ఉంటే అది తీసుకోండి.
టీకా వల్ల కొవిడ్ ఉద్ధృతి తగ్గినట్లుగా దాఖలాలున్నాయా?
కచ్చితంగా ఉన్నాయి. మన కంటే మూణ్నాలుగు నెలలు ముందుగా టీకా ప్రక్రియ ప్రారంభించిన దేశాల్లో ఆ ఫలితాలు కనిపిస్తున్నాయి. భారత్లో ఇప్పటికీ 5.2 శాతం మంది మాత్రమే టీకాలు పొందారు. గరిష్ఠంగా ఇజ్రాయిల్లో 100 శాతం టీకాల పంపిణీ పూర్తయింది. అక్కడ దాదాపుగా సున్నా కేసులకొచ్చాయి. కాబట్టి టీకాలు పొందడానికి, కేసుల నమోదుకు మధ్య చాలా స్పష్టమైన సంబంధమున్నట్లుగా తెలుస్తోంది. మన దేశంలో టీకా మినహా మరో దారి లేదు. తొలిడోసు తీసుకున్న 4 వారాల తర్వాత 50 శాతం యాంటీబాడీలు వృద్ధి చెందుతున్నాయి. రెండోడోసు పూర్తయిన 15 రోజుల తర్వాత పూర్తిస్థాయిలో యాంటీబాడీలు వృద్ధిచెందుతున్నాయి. తొలిదశలో మా ఆసుపత్రిలో 4500 మంది ఉద్యోగులుంటే.. వారిలో 50 శాతం మంది ఇన్ఫెక్షన్ బారినపడ్డారు. ఈసారి అందరికీ వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల 7 శాతం మంది మాత్రమే ఇన్ఫెక్షన్కు గురయ్యారు.