తెలంగాణ

telangana

By

Published : Jul 17, 2020, 11:20 PM IST

ETV Bharat / city

సరస్వతీ నమస్తుభ్యం... ఆన్ లైన్ విద్యారంభం కరిష్యామి

కరోనా సంక్షోభంతో విద్యారంగం కొత్తరూపు తీసుకోనుంది. సంక్షోభ సమయంలో విద్యావ్యవస్థ తనను తాను పునర్వ్యవస్థీకరించుకుంటుందని విద్యావేత్తలు చెబుతున్నారు. భవిష్యత్​లో ఆన్​లైన్ విద్య కీలకం కానుందని అంటున్నారు. ఆన్​లైన్ విద్యపై ఈటీవీ భారత్ ప్రత్యేక చర్చ నిర్వహించింది. కరోనాను సంక్షోభంలా చూడకుండా విద్యావిధానాన్ని సంస్కరించుకునే అవకాశంగా చూడాలని ఈ చర్చలో పాల్గొన్న విద్యానిపుణులు అభిప్రాయపడ్డారు. డిజిటల్ విద్యావిధానం అసమానతలకు తావివ్వకుండా ప్రతిఒక్కరికీ అందుబాటులో ఉండాలని సూచించారు.

etv-bharat-debate-on-online-education
సరస్వతీ నమస్తుభ్యం... ఆన్ లైన్ విద్యారంభం కరిష్యామి

సరస్వతీ నమస్తుభ్యం... ఆన్ లైన్ విద్యారంభం కరిష్యామి

జీరో ఎడ్యుకేషన్ ఇయర్​ మంచిది కాదు

కరోనా ఈ ప్రపంచాన్ని మార్చేసింది. అనేక అనివార్యతలు సృష్టించింది. పరిశుభ్రతను నేర్పించిందీ.. ప్రత్యామ్నాయాలు చూపించింది. దీనికి బాగా ప్రభావితమైంది విద్యావ్యవస్థ. యునెస్కో లెక్క ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 138కోట్ల మంది విద్యార్థులు దీని ప్రభావానికి గురయ్యారు. మన దగ్గర కూడా దేశమంతా బడులు, కళాశాలలు బంద్ అయ్యాయి. ఈ విద్యాసంవత్సరం మొదలైనా... విద్యాసంస్థలు ఇప్పుడప్పుడే మొదలయ్యే పరిస్థితి లేదు. ఎంత పెద్ద విపత్తులు వచ్చినా మొత్తం విద్యా సంవత్సరం పోయిన పరిస్థితి ఇంతకు ముందు ఎప్పుడూ లేదు. కానీ కరోనా వలన ఇప్పుడు విద్యా వ్యవస్థ అనేక మార్పులకు లోనవుతోంది. అనివార్యంగా ఆన్ లైన్ వైపు వెళ్లాల్సిన పరిస్థితుల్లో మనం ఉన్నాం. కేంద్ర మానవవనరుల శాఖ కూడా దీనిపై మార్గదర్శకాలు జారీ చేసింది. కరోనా ముప్పు ఎప్పటికి పూర్తిగా తొలగిపోతుందో తెలీని తరుణంలో మన ముందున్న మార్గం ఏంటి.. ? విద్యావిధానంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి. దానికి మనం ఎలా సన్నద్ధం కావాల్సి ఉంది..? ప్రభుత్వాలు, ప్రజల బాధ్యతలు ఏంటి అనే విషయాలపై ఈటీవీ ప్రత్యేక చర్చ చేపట్టింది. విద్యావేత్త వాసిరెడ్డి అమరనాథ్, హెచ్​సీయూ ప్రో వైస్ చాన్సలర్ బి.రాజశేఖర్, పేరెంట్స్ కమిటీ ఛైర్మన్ ఎన్. నారాయణ ఈ చర్చలో పాల్గొన్నారు.

కరోనా కాలంలో ఆన్​లైన్ విద్య అనివార్యం అని విద్యానిపుణులు అన్నారు. తరగతిగదిలో నేర్చుకున్న దానికి సరిసమానం కాకపోయినా.. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంతకు మించి ప్రత్యామ్నాయం లేదన్నారు. చిన్నారులకు రేడియేషన్ సమస్య తలెత్తకుండా.. లైవ్ క్లాసులు కాకుండా వీడియోలు ద్వారా పాఠాలు చెప్పే విధానం మంచిదని సూచించారు.

కరోనా సంక్షోభం అన్​లైన్ విద్యను అనివార్యం చేసింది. స్మార్ట్​ఫోన్ లేకుండా ప్రత్యామ్నాయ విద్య అందించవచ్చు. చిన్న చిన్న వీడియోలుగా.. గ్రాఫిక్స్​తో పాఠాలు రూపొందించాలి. భవిష్యత్​లో రాబోయే మార్పులకు కరోనా తలుపులు తెరిచింది. ఆన్​లైన్ విద్యను కొనసాగించాలని కర్ణాటక, బోంబే హైకోర్టులు చెప్పాయి. తరగతి గదిలో నేర్చుకున్న దానితో పోల్చితే.. ఆన్​లైన్ ద్వారా 75శాతం ఫలితం ఉంటుంది. - వాసిరెడ్డి అమరనాథ్, విద్యావేత్త

ఆన్​లైన్ విధానం తరగతి విధానానికి పూర్తి ప్రత్యామ్నాయం కాదు. రెండు విధానాల్లో లాభాలు నష్టాలు ఉన్నాయి. రెండు విధానాల్లో మెరుగైన వాటిని తీసుకోవాలి. ఆన్​లైన్ విధానాన్ని ఆహ్వానించాలి. ఆన్​లైన్ ద్వారా పిల్లలపై ఒత్తిడి పెరుగుతుందని అనుకోకూడదు. విరామం లేకుండా తరగతి గదుల్లో ఉంచడం వల్ల కూడా ఒత్తిడి ఉంది. విద్యాసంవత్సరాన్ని రద్దు చేయాలనుకోవడం సరికాదు. ఖాళీగా ఉంచితే విద్యార్థులు నష్టపోతారు. ఆన్​లైన్ విధానంలో లోపాలు అధిగమించడానికి ప్రయత్నించాలి. - ప్రొ. బి. రాజశేఖర్, ప్రొ. వైస్ ఛాన్సలర్, హెచ్​సీయూ

ఆన్​లైన్ విద్యావిధానం అనివార్యం. పిల్లలు ఖాళీగా ఉంటే దెబ్బతింటారు. కరోనా వల్ల బయటకు వెళ్లే పరిస్థితి లేదు. ఖాళీగా ఉంటే మానసికంగా దెబ్బతింటారు. ఆన్​లైన్ విధానంలో ఉన్న సమస్యలను పరిష్కరించాలి. -ఎన్. నారాయణ, ఛైర్మన్, పేరెంట్స్ అసోసియేషన్

సరస్వతీ నమస్తుభ్యం... ఆన్ లైన్ విద్యారంభం కరిష్యామి

ఆన్​లైన్ పాఠాల కంటే వీడియో పాఠాలు మేలు

పాఠాలను వీడియోలుగా రూపొందించడమే అత్యుత్తమ విధానం అని విద్యావేత్తలు అన్నారు. పిల్లలు ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకునే వెసులుబాటు ఉండాలన్నారు. నామమాత్రంగా ఆన్​లైన్ క్లాసులు నిర్వహించడం వల్ల ఉపయోగం లేదన్నారు. ఆన్​లైన్ క్లాసుల పేరుతో కొన్ని పాఠశాలలు ఇతర ఫీజులనూ కలిపి తీసుకుంటున్నాయని అటువంటి వారిని నిరోధించాలని వాసిరెడ్డి అమరనాథ్ అభిప్రాయపడ్డారు. ఎక్కువ ఫీజులు తీసుకుంటున్న విషయం పేరెంట్స్ కమిటీ దృష్టికీ వచ్చిందని ఈ విషయంలో ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి నారాయణ డిమాండ్ చేశారు. పేద విద్యార్థులకు ప్రభుత్వమే ట్యాబ్​లు అందించాలన్నారు. ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్ లేని వారి పరిస్థితిని ప్రభుత్వం పట్టించుకోవాలని ప్రొఫెసర్ రాజశేఖర్ సూచించారు.

ఆన్​లైన్​లో నేరుగా పాఠం చెప్పే బదులు వీడియోలు తయారు చేయడం ఉత్తమం. మల్లీమీడియా వీడియోలు తల్లిదండ్రులకు ఇవ్వాలి. దీనివల్ల సమయం ఆదా అవుతుంది. పిల్లలకు వీలున్నప్పుడు చూస్తారు. ఇంటర్నెట్ ఉపయోగించి పిల్లలకు పక్కదారి పట్టకుండా అవకాశం ఉంటుంది. ఆన్​లైన్ క్లాసులు పేరుతో ఇతర ఫీజులు తీసుకోవడం తప్పు. అలాంటి పాఠశాలలపై చర్యలు తీసుకోవచ్చు. -వాసిరెడ్డి అమరనాథ్, విద్యావేత్త

ట్రాన్స్​పోర్టు, బిల్డింగ్ ఫీజులు ఆన్​లైన్ క్లాసులు పేరుతో తీసుకుంటున్న ఘటనలు మా దృష్టికి వచ్చాయి . దీన్ని నిరోధించాలి. ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్​లైన్ పాఠాలు లేవు దీనిపై దృష్టిపెట్టాలి. ప్రభుత్వ విద్యాసంస్థల విద్యార్థులు వెనుకబడుతున్నారు. కొన్ని నెలలుగా పాఠశాలలు లేనందువల్ల ప్రభుత్వానికి డబ్బు ఆదా అయింది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ట్యాబులు, డేటా కార్డులు ఇవ్వాలి. - నారాయణ, ఛైర్మన్, పేరెంట్స్ అసోసియేషన్

ఇంటర్నెట్, స్మార్ట్​ఫోన్లు లేనివారి పరిస్థితిని ప్రభుత్వం పట్టించుకోవాలి. విద్యాపరంగా సంక్షోభం వచ్చింది కాబట్టి ప్రభుత్వం స్పందించాలి. దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ వేగం పెరగాలి. ఉపాధ్యాయులందరికీ ఇప్పటికే శిక్షణ ఇచ్చి ఉంటే.. ప్రభుత్వ విద్యాసంస్థల్లోనే ఆన్​లైన్ విద్యావిధానం ప్రారంభమై ఉండేది. ఈ విధానంలో తోడ్పాటు ఇస్తున్న సంస్థలతో ఒప్పందం చేసుకోవాలి. - ప్రొ. బి. రాజశేఖర్, ప్రొ. వైస్ ఛాన్సలర్, హెచ్​సీయూ

సరస్వతీ నమస్తుభ్యం... ఆన్ లైన్ విద్యారంభం కరిష్యామి

ప్రతికూలతేే అవకాశంగా మలుచుకొని సాగాలి

కరోనా సంక్షోభాన్ని ప్రతికూలంగా కాకుండా.. విద్యావ్యవస్థలో సాంకేతికతను తీసుకొచ్చే అవకాశంగా తీసుకోవాలని వక్తలు సూచించారు. రాబోయే రోజుల్లో డిజిటల్ విద్య అన్నది సాధారణం అవుతుందని అమరనాథ్ అన్నారు. ప్రపంచస్థాయి విద్యా సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయన్నారు. అంతర్జాతీయ విద్యాసంస్థలతో సంబంధాలు ఏర్పడతాయని... పోటీతత్వం బాగా పెరగనుందని ప్రొఫెసర్ రాజశేఖర్ చెప్పారు. డిజిటల్ అంతరాలు పెరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, ఆన్ లైన్ విద్య అందరికీ అందుబాటులో ఉండాలని పేరెంట్స్ కమిటీ ఛైర్మన్ నారాయణ సూచించారు.

కరోనా సంక్షోభాన్ని ఒక అవకాశంగా మలుచుకోవాలి. రాబోయే రోజుల్లో ఆన్​లైన్ అనేది విద్యావిధానంలో ఒక భాగం అవుతోంది. కొన్ని రోజులు ఇంటిదగ్గర.. కొన్ని రోజులు స్కూళ్లలో చదువుకునే రోజులు వస్తాయి. 5జీ సాంకేతికతతో మారుమూల ప్రాంతాలకు అత్యాధునిక విద్యాసౌకర్యం వస్తుంది . -వాసిరెడ్డి అమరనాథ్, విద్యావేత్త

అంతర్జాతీయంగా ఉన్న అత్యుత్తమ విద్యాసంస్థలతో సంబంధాలు ఏర్పడతాయి. మౌలిక సదుపాయాలు బాగా మెరుగుతాయి. అంతర్జాతీయ పోటీతత్వం పెరుగుతుంది. -ప్రొ. బి.రాజశేఖర్, ప్రొ. వైస్ ఛాన్సలర్, హెచ్​సీయూ

విద్యారంగంలో సమానత్వం రావాలి. డిజిటల్ సాంకేతికత కొందరికే పరిమితం కాకూడదు.పేద, మధ్యతరగతి వర్గాలకు ఆన్​లైన్ విద్య అందేలా ప్రభుత్వాలు ప్రయత్నించాలి. -నారాయణ, ఛైర్మన్, పేరెంట్స్ అసోసియేషన్

ఇదీ చదవండి:భారత్​ బయోటెక్​ కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభం

ABOUT THE AUTHOR

...view details