ఏపీలోని చిత్తూరు జిల్లా పెనుమూరు మండలంలోని లక్కలపూడివాండ్లూరు, సామిరెడ్డిపల్లె గ్రామాలు... దశాబ్దాలుగా సర్పంచి పదవి చేపట్టిన నేతల ఇంటిపేర్లతో ఏర్పడ్డాయి. పెనుమూరు మండలంలోని చిన్నమరెడ్డికండ్రిగ గ్రామం.. గతంలో పంచాయతీగా ఉండేది. దీనిపరిధిలో చిన్నమరెడ్డికండ్రిగతో పాటు బండమీదూరు, చీకలగుట్ట, వెంకటేశపురం, వాసుదేవపురం, కలికిరివాండ్ల ఊరు, లంకిపల్లె గ్రామాలు ఉండేవి. చిన్నమరెడ్డి గ్రామ పంచాయతీకి సర్పంచ్లుగా లక్కలపూడి కుటుంబీకులు ఎక్కువ కాలం పనిచేశారు. లక్కలపూడి వెంకటాద్రి నాయుడు పదేళ్లు.. ఆయన చిన్నాన్న కుమారుడు లక్కలపూడి మునిస్వామినాయుడు ఒకసారి సర్పంచిగా ఎన్నికయ్యారు. అనంతరం వెంకటాద్రినాయుడు కుమారుడు లక్కలపూడి మునిరత్నం నాయుడు చిన్నమరెడ్డికండ్రిగ సర్పంచుగా, ఉప సర్పంచుగా పనిచేసి తమ కుటుంబ ప్రాభవాన్ని మరింత పెంచారు.
పంచాయతీగా ఏర్పాటు..
పంచాయతీ కేంద్రం చిన్నమరెడ్డికండ్రిగ, మిగిలిన గ్రామాల మధ్య దూరం ఎక్కువగా ఉండటంతో... తాము నివాసం ఉంటున్న ప్రాంతంలో పరిసర గ్రామాలను కలిపి పంచాయతీగా ఏర్పాటు చేయటానికి ప్రతిపాదనలు పంపించారు. దీంతో 1995 సంవత్సరంలో చిన్నమరెడ్డికండ్రిగ నుంచి వెంకటేశపురం, వాసుదేవపురం, కలికిరివాండ్ల ఊరు, లంకిపల్లె గ్రామాలు విడిపోగా... ఓ కొత్త పంచాయతీ ఏర్పడింది.