దిశ హత్యాచార నిందితుల కాల్చివేతకు సంబంధించి ఎన్హెచ్ఆర్సీ బృందం చేపట్టిన విచారణ మూడోరోజూ కొనసాగింది. ఎన్కౌంటర్లో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎస్సైని, కానిస్టేబుల్ను వారు సుదీర్ఘంగా విచారించారు. ఎన్కౌంటర్లో పాల్గొన్న పది మంది పోలీసులను ఇవాళ ఉదయం విచారించే అవకాశం ఉంది
ఎదురుకాల్పుల్లో ఎస్సై వెంకటేశ్వర్లుతో పాటు కానిస్టేబుల్ అరవింద్గౌడ్ గాయపడ్డారని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. కేర్ ఆసుపత్రిలో ఉన్న వీరిద్దర్నీ కమిషన్ సభ్యులు సుమారు మూడు గంటల సేపు విచారించారు. వారి వైద్య పరీక్షల నివేదికలు తీసుకుని, ఎలాంటి చికిత్స అందిస్తున్నారో వైద్యులను అడిగి తెలుసుకున్నారు. నిందితుల మృతదేహాలకు పంచనామా నిర్వహించిన నలుగురు తహసీల్దార్లను కూడా పిలిచి విచారించినట్లు తెలుస్తోంది.
డీఎన్ఏ విశ్లేషణ ద్వారా అత్యాచారం నిర్ధారణ
"డీఎన్ఏ విశ్లేషణ చేయడం ద్వారా నిందితులు అత్యాచారం చేసినట్లు నిరూపించాల్సి ఉంటుంది. ఎన్కౌంటర్పై షాద్నగర్ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. దీనికి సంబంధించి క్లూస్ సిబ్బంది ఆధారాలు సేకరించారు. నిందితులు తుపాకులు లాక్కొని కాల్పులు జరిపారని, ఆత్మరక్షణ కోసం తాము జరిపిన ఎదురుకాల్పుల్లోవారు మరణించారన్నది పోలీసుల వాదన. దీన్ని శాస్త్రీయంగా నిరూపించాల్సి ఉంది. ఈ రెండు సంఘటనల్లోనూ ఫోరెన్సిక్ నివేదికలు కీలకమైనందున...పోలీసులు వీటిని త్వరలోనే కోర్టుకు సమర్పించనున్నారు"
త్రీడీలో చిత్రీకరణ
చటాన్పల్లి కల్వర్టుసమీపంలో జరిగిన పోలీసు కాల్పుల్లో నలుగురు నిందితులు చనిపోయిన ప్రాంతాన్ని సోమవారం త్రీడీలో చిత్రీకరించారు. మామూలు ఫొటోల్లో వస్తువుల మధ్య దూరం ఎంత ఉందో తెలిసే అవకాశం లేదు. త్రీడీలో ఇలాంటి వాటిని అంచనా వేయవచ్చు.
నేటి నుంచి సిట్ విచారణ
ఎన్కౌంటర్పై దర్యాప్తు జరిపేందుకు రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ సభ్యులు సోమవారం మధ్యాహ్నం రాచకొండ కమిషనర్ కార్యాలయంలో సమావేశమై చర్చించారు. మంగళవారం నుంచి వీరు కూడా క్షేత్రస్థాయిలో విచారణ మొదలుపెట్టనున్నారు.
మృతదేహాల తరలింపు
దిశ హత్యాచార కేసు నిందితుల మృతదేహాలను హైకోర్టు ఆదేశాల మేరకు సోమవారం రాత్రి మహబూబ్నగర్ వైద్య కళాశాల నుంచి హైదరాబాద్కు తరలించారు. హైదరాబాద్ నుంచి వచ్చిన ప్రత్యేక వాహనంలో బందోబస్తు మధ్య గాంధీ ఆసుపత్రికి పంపించారు.
ఫోరెన్సిక్ నివేదికే కీలకం
దిశ అత్యాచారం, హత్య కేసుకు సంబంధించి ఫోరెన్సిక్ నివేదిక సిద్ధమవుతోంది. ఈ వారమే దీన్ని కోర్టుకు సమర్పించే అవకాశం ఉంది. వీటి విశ్లేషణ జరుగుతుండగానే దిశ నిందితులు పోలీసు కాల్పుల్లో మరణించడంతో ఈ సంఘటనపైనా కేసు నమోదు చేసిన పోలీసులు ఆధారాలు సేకరించి ప్రయోగశాలకు పంపారు. ఇప్పుడు వీటిని కూడా విశ్లేషించి నివేదిక ఇవ్వాల్సి ఉంది. దిశపై అత్యాచారం చేసిన ప్రాంతంతో పాటు దహనం చేసిన చోట కూడా క్లూస్ సిబ్బంది పలు కీలక ఆధారాలు సేకరించారు.
ఇవీ చూడండి: ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసులను విచారించిన ఎన్హెచ్ఆర్సీ