తెలంగాణ

telangana

ETV Bharat / city

VIJAYA DASHAMI: ఈసారి వారికి దశమి కలిసొచ్చింది.. విజయాన్ని మోసుకొచ్చింది! - telangana news updates

ఈసారి దశమి కలిసొచ్చింది.. విజయాన్ని మోసుకొచ్చింది.. ఏడాదిన్నర కాలంగా కరోనా ధాటికి కుదేలైన కుటుంబాలకు కొత్త కాంతులనందించింది. గతేడాది రూ.లక్షల్లో పెట్టుబడి పెట్టి రూ.వేల రాబడితో తీవ్ర నష్టాలపాలయ్యాయి పండగ ఆధారిత వ్యాపారాలు చేసే కుటుంబాలు. విగ్రహ ప్రతిమల తయారీదారులదైతే మరీ కష్టం. వివిధ రాష్ట్రాల నుంచి కళాకారుల్ని తెప్పించి అప్పులతో సామగ్రి కొని ప్రతిమలు చేస్తే అందులో కనీసం 30 శాతం కూడా అమ్ముడుపోక అప్పుల ఊబిలో కూరుకుపోయారు. ఈ ఏడాది మాత్రం జంట నగరాల పరిధిలో 90 శాతం ప్రతిమలు అమ్ముడుపోయినట్లు నిర్వాహకులు చెబుతున్నారు. మరోవైపు నగరంలోని అన్ని వ్యాపార కేంద్రాల వద్ద పండగ షాపింగ్‌ రద్దీ కనిపిస్తోంది.

VIJAYA DASHAMI: ఈసారి వారికి దశమి కలిసొచ్చింది.. విజయాన్ని మోసుకొచ్చింది!
VIJAYA DASHAMI: ఈసారి వారికి దశమి కలిసొచ్చింది.. విజయాన్ని మోసుకొచ్చింది!

By

Published : Oct 13, 2021, 11:07 AM IST

జంట నగరాల పరిధిలో దాదాపు 5 వేలకుపైగా కుటుంబాలు విగ్రహాల తయారీ మీదే ఆధారపడి బతుకుతున్నాయి. వీరికితోడు సీజన్‌కి 7 నెలల ముందు జనవరిలో కోల్‌కతా, ముంబయి, యూపీ నుంచి వేల మంది కళాకారులు వస్తుంటారు. వినాయక ఉత్సవాల కోసం కనీసం లక్షకుపైగా గణేశ్‌ ప్రతిమలు, దసరాకు ముందు 60 వేల దాకా దుర్గామాత ప్రతిమలు తయారు చేస్తుంటారు. అయితే గత ఏడాదిన్నరగా రెండు సీజన్లూ ఈ కుటుంబాలకు కలిసి రాకపోగా విగ్రహాలన్నీ షెడ్లకే పరిమితమై పాడైపోయాయి. ఈ ఏడాది 70 వేల భారీ గణేశ్‌ విగ్రహాలు అమ్ముడుకాగా 50 వేల దాకా దుర్గామాత ప్రతిమలు నగరంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాలకు తరలివెళ్లాయని నిర్వాహకులు చెబుతున్నారు. దీంతో పెట్టిన ఖర్చుతోపాటు నష్టం నుంచీ తేరుకునే అవకాశం దక్కిందని సంబరపడుతున్నారు

మార్కెట్లకు పండగ కళ!

వారాంతాలు, పండగల సమయంలో నగరంలోని కోఠి, సుల్తాన్‌బజార్‌, అమీర్‌పేట, పంజాగుట్ట, బేగంపేట ప్రాంతాలు కళకళలాడుతుంటాయి. కొవిడ్‌ దెబ్బకి కొంతకాలంగా బోసిపోయిన ఈ ప్రాంతాలకు దసరా పండగ కళతెచ్చింది. అమీర్‌పేట, పీఅండ్‌టీ కాలనీ, దిల్‌సుఖ్‌నగర్‌, చార్మినార్‌ పరిసరాల్లో అయితే 24 గంటలూ దారులన్నీ రద్దీగా కనిపిస్తున్నాయి. షాపింగ్‌ మాళ్లు కిక్కిరిసి కనిపిస్తున్నాయి. కుటుంబసమేతంగా సినిమా హాళ్లదీ అదే కథ.

‘ఆహా’రం భళా

రెస్టారెంట్లు, హోటళ్లకు భారీగా జనం వస్తున్నారు. ఎన్నోరోజుల తర్వాత సెలవులూ కలిసి రావడంతో కుటుంబసమేతంగా ఆహార ప్రియులు ఆహారశాలలకు క్యూ కడుతున్నారు. ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని ఓ ప్రముఖ హోటల్‌, సికింద్రాబాద్‌లోని ఓ హోటల్‌లో అయితే కుర్చీ దొరికేందుకు కనీసం అరగంట సమయం పడుతోంది. ఖైరతాబాద్‌లోని మరో హోటల్‌లో బిర్యానీ ఆర్డర్లే రోజుకు 2 వేలు వస్తున్నాయని నిర్వాహకులు తెలిపారు.

151 చేస్తే అన్నీ అయిపోయాయి

ఏటా వందల్లో విగ్రహాలు చేసి పెడుతుంటాం. కానీ 2 దఫాలు వినాయక ప్రతిమలు, దుర్గామాత ప్రతిమలు సగం కూడా అమ్ముడు పోలేదు. సెప్టెంబరు, అక్టోబరులో జరిగే పండగల కోసం జనవరి నుంచే తయారీ మొదలుపెడతాం. దాదాపు 20 మంది కార్మికులు ఎక్కడెక్కడి నుంచో వచ్చి పనిచేస్తారు. వారందరికీ ఖర్చులూ కష్టమయ్యేవి. ఈ ఏడాది 151 విగ్రహాలూ అమ్ముడుపోయాయి.

- లక్ష్మీనారాయణ విగ్రహాల తయారీదారు, ధూల్‌పేట

ఇదీ చదవండి:Saddula Bathukamma 2021: గడగడపనా పూల సంబురం.. బతుకు పండుగకు నీరాజనం!

ABOUT THE AUTHOR

...view details