తెలంగాణ

telangana

ఒకటికి రెండుసార్లు కొవిడ్‌-19 నిర్ధరణ

దిల్లీ ప్రార్థనల్లో పాల్గొని వచ్చిన కొందరిలో కరోనా వైరస్‌ వచ్చిందనే అనుమానంతో వారి కుటుంబ సభ్యులు, సన్నిహితులను ఆసుపత్రికి తీసుకువస్తున్నారు. రక్త నమూనాలు తీసుకున్న వారిలో 60శాతం యువత ఆరోగ్యంగా ఉంటున్నారు. కచ్చితత్వం కోసం వీరందరికి ఒకటికి రెండుసార్లు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. కొందరిలో తొలుత నెగిటివ్‌ రిపోర్టు వచ్చిన వారికి రెండోసారి, మూడోసారి పరీక్షల్లో పాజిటివ్‌ వస్తోంది.

By

Published : Apr 9, 2020, 9:57 AM IST

Published : Apr 9, 2020, 9:57 AM IST

covid positive
ఒకటికి రెండుసార్లు కొవిడ్‌-19 నిర్ధరణ

సర్‌.. ఆసుపత్రి నుంచి మాట్లాడుతున్నాం... ఈ రోజు ఉదయం 9 మందికి రెండుసార్లు రక్త నమూనాలు తీసుకున్నాం. తొలి నమూనాలకు చేసిన కొవిడ్‌-19 పరీక్షలో ఫలితం నెగిటివ్‌ వచ్చింది.. వారిని 14 రోజులు క్వారంటైన్‌లో ఉండాలని చెప్పి పంపించాం.. రాత్రి రెండో నమూనాలకు చేసిన పరీక్షలో పాజిటివ్‌ వచ్చింది. అందువల్ల వారిని వెంటనే రప్పించండి. లేకపోతే వారితో దగ్గరగా తిరిగేవారికి కూడా పాజిటివ్‌ వచ్చే అవకాశాలున్నాయ్‌. వారి ఫోన్‌ నంబర్లు, చిరునామాలు ఇన్‌స్పెక్టర్‌కు పంపించాం. వెంటనే స్పందించండి.

కరోనా వైరస్‌ నిర్ధరణ పరీక్షలు నిర్వహిస్తున్న ఆసుపత్రి నుంచి పోలీస్‌ ఉన్నతాధికారులకు సోమవారం రాత్రి వచ్చిన ఫోన్‌కాల్‌ సారాంశమిది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు కరోనా పాజిటివ్‌ లక్షణాలున్న వారిని అంబులెన్స్‌ ద్వారా ఆసుపత్రికి చేర్చారు. మరోసారి ఇలాంటి సమాచారమే మంగళవారం కూడా పోలీస్‌ అధికారులకు వచ్చింది. తక్షణం పాజిటివ్‌ వచ్చిన వ్యక్తులను పోలీసులు తీసుకువచ్చారు.

గత నెల మార్చి 15 నుంచి..

హైదరాబాద్‌లో వైరస్‌ విస్తరణను అడ్డుకునేందుకు పోలీస్‌, జీహెచ్‌ఎంసీ, వైద్యారోగ్య సిబ్బంది ప్రత్యేక బృందాలుగా ఏర్పడ్డారు. తమ పరిధుల్లో నివాసముంటున్న వారి వివరాలను సేకరించి అనుమానిత లక్షణాలతో ఉన్నవారిని నిర్ధరణ కోసం గత నెల 15 నుంచి గాంధీ ఆసుపత్రికి తరలిస్తున్నారు. దిల్లీలో ప్రార్థనల్లో పాల్గొని వచ్చిన కొందరిలో కరోనా వైరస్‌ వచ్చినట్టు అనుమానిస్తుండడంతో వారి కుటుంబ సభ్యులు, సన్నిహితులను ఆసుపత్రికి తీసుకువస్తున్నారు.

కచ్చితత్వం కోసం..

రక్త నమూనాలు తీసుకున్న వారిలో 60శాతం యువత ఆరోగ్యంగా ఉంటున్నారు. కచ్చితత్వం కోసం ఒకటికి రెండుసార్లు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. కొందరిలో తొలుత నెగిటివ్‌ రిపోర్టు వచ్చిన వారికి రెండోసారి, మూడోసారి పరీక్షల్లో పాజిటివ్‌ వస్తోంది. ఇలాంటివారు అప్పటికే క్వారంటైన్లు, ఇళ్లల్లో ఉండడంతో వారిని రప్పించేందుకు వైద్యులు పోలీస్‌ అధికారులకు సమాచారమిస్తున్నారు.

హోం క్వారంటైన్లలో లేరు..

కరోనా పాజిటివ్‌ వచ్చిన వారిని గుర్తించేందుకు పోలీసులకు క్షేత్రస్థాయిలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వీరిలో ఇళ్లకు వెళ్లినవారు బయట స్వేచ్ఛగా తిరుగుతున్నారు. క్వారంటైన్లలో ఉంటున్న వారిలో కొందరు ఇప్పుడే బయటకు వెళ్లొస్తామని చెప్పి వెళ్తున్నారు. ఫలితంగా వారిని గుర్తించేందుకు ఎక్కువ సమయం పడుతోంది.

4 గంటలపాటు వెతికి..

నలుగురు వ్యక్తుల రక్త నమూనాల పరీక్షల్లో కరోనా నెగిటివ్‌ రాగా.. ఇంటికి వెళ్లొచ్చని రెండు రోజుల క్రితం వైద్యులు సూచించారు. అదేరోజు రాత్రి వారిలో ముగ్గురికి తదుపరి పరీక్షల్లో పాజిటివ్‌ రాగా పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వారి చిరునామాలకు వెళ్లగా అందుబాటులో లేరు. స్నేహితులు, సన్నిహితుల ద్వారా ఎక్కడున్నారో తెలుసుకుని, సంతోష్‌నగర్‌, అత్తాపూర్‌, రాజేంద్రనగర్‌లో 4 గంటలపాటు వెతికి ఆసుపత్రికి తరలించామని పోలీసులు తెలిపారు.

ఇవీ చూడండి:కోయలేక.. కోసినా అమ్మలేక.. చ'మిర్చి'న రైతు కళ్లు!

ABOUT THE AUTHOR

...view details