తెలంగాణ

telangana

ETV Bharat / city

ఆనకట్టల నిర్వహణపై అలసత్వం.. ప్రమాదకరంగా కడెం, కుమురం భీం, వట్టివాగు - ఆనకట్టల నిర్వహణపై అలసత్వం

వేల ఎకరాల ఆయకట్టు, లక్షల మందికి తాగునీటి వసతి కల్పించే ప్రాజెక్టుల నిర్వహణ నానాటికీ తీసికట్టుగా మారుతోంది. పాత ప్రాజెక్టుల నిర్వహణ లోపభూయిష్టంగా ఉండటంతో ఒకదాని వెంట మరొకటి ప్రమాదకర పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఎప్పటికప్పుడు పాతవాటికి చేయాల్సిన మరమ్మతులపై అధికారులు ఉదాసీనంగా వ్యవహారిస్తున్నారు. దీంతో కడెం, కుమురం భీం, వట్టివాగు ఆనకట్టలు ప్రమాదకరస్థితికి చేరుకున్నాయి.

ఆనకట్టల నిర్వహణపై అలసత్వం
ఆనకట్టల నిర్వహణపై అలసత్వం

By

Published : Aug 1, 2022, 4:12 AM IST

నీటిపారుదల శాఖ పరిధిలో అనేక కొత్త ప్రాజెక్టులు వచ్చి చేరుతున్నాయి. అయితే, ఇప్పటికే ఉన్న వాటి నిర్వహణ విషయంలో మాత్రం ఆ శాఖ వెనకబడి పోయిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వేల ఎకరాల ఆయకట్టు, లక్షల మందికి తాగునీటి వసతి కల్పించే ఈ ప్రాజెక్టుల నిర్వహణ నానాటికీ తీసికట్టుగా మారుతోంది. పాత ప్రాజెక్టుల నిర్వహణ లోపభూయిష్టంగా ఉండటంతో ఒకదాని వెంట మరొకటి ప్రమాదకర పరిస్థితిని ఎదుర్కొంటోంది. రెండేళ్ల క్రితం రాష్ట్రంలో ‘ఓ అండ్‌ ఎం’ (ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌) విభాగాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసినప్పటికీ ఫలితాలు ఇంకా కనిపించడం లేదన్న అభిప్రాయం వినిపిస్తోంది.

గడిచిన ఎనిమిదేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం మొదటి ప్రాధాన్య అంశంగా ప్రాజెక్టుల నిర్మాణాన్ని చేపడుతూ వస్తోంది. సింహభాగం నిధులు కూడా ఈ రంగానికే కేటాయిస్తోంది. ‘ఓ అండ్‌ ఎం’ విభాగం ఏర్పాటు చేయడంతోపాటు ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్‌నూ కేటాయిస్తూ వస్తోంది. వర్షాకాలం ప్రారంభంకాకముందే ప్రాజెక్టులు, ఎత్తిపోతల నిర్వహణపై సమీక్షలు చేపట్టి మరమ్మతులు చేయాల్సిన బాధ్యత ఈ విభాగంపై ఉంది. రెండేళ్ల నుంచి జూరాల, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుల మరమ్మతులకు సంబంధించి నిధుల విడుదల, టెండర్ల ఖరారు, పనుల ప్రారంభం విషయంలో ఆశించిన పురోగతి లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు నీటిపారుదల శాఖలో పెద్దఎత్తున పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఒక్కో భారీ ప్రాజెక్టుకు 30 మందికి పైగా సిబ్బంది అవసరం ఉండగా.. సగం మంది కూడా లేరు. ఏటా ఆనకట్టల భద్రత పర్యవేక్షణ కమిటీ ఇచ్చే నివేదికలను అమలు చేయడంలోనూ వెనుకంజలో ఉన్నట్లు విమర్శలున్నాయి.

ఏ ప్రాజెక్టు చూసినా..

  • కృష్ణా నదిపై రాష్ట్రంలో ఉన్న మొదటి ప్రాజెక్టు ఇందిరా ప్రియదర్శిని జూరాల. వనపర్తి-జోగులాంబ గద్వాల జిల్లాల మధ్య ఉన్న ఈ ప్రాజెక్టు నిల్వ సామర్థ్యం 9.65 టీఎంసీలు. ఆయకట్టు 1.50 లక్షల ఎకరాలు. ప్రాజెక్టుకు ఉన్న 72 గేట్లు తుప్పుపట్టిపోతున్నాయి. రెండేళ్ల క్రితమే తుప్పు, లీకేజీలను గుర్తించారు. ఇప్పటికీ గేట్ల మరమ్మతు పూర్తిస్థాయిలో జరగలేదు. రెండేళ్లుగా అంచనాలు రూపొందించి ఈ ఏడాది టెండర్లు ఖరారు చేశారు. రూ.9.50 కోట్లకు పనులు అప్పగించారు. ఇప్పటికీ గేట్లకు రంగులు వేయడం పూర్తికాలేదు.
  • నాగార్జునసాగర్‌ నిర్వహణ కూడా అంతంత మాత్రంగానే ఉంది. స్పిల్‌వే వోగీపై భారీ గుంతలు ఏర్పడ్డాయి. దీని మరమ్మతులకు ఎక్కువ సమయం పట్టే అవకాశాలున్నా.. తీవ్ర జాప్యం చేసి ఈ ఏడాది రూ.19 కోట్లు కేటాయించారు. టెండర్ల నిర్వహణలోనూ నిర్లక్ష్యం చేశారు. పనులు చేపట్టేందుకు అంతా సిద్ధమయ్యాక ప్రాజెక్టుకు వరద ప్రారంభమైంది.
  • ఇటీవలి వరదలకు నిర్మల్‌ జిల్లా కడెం ప్రాజెక్టు ప్రమాదపుటంచుల వరకు వెళ్లిన సంగతి తెలిసిందే. 7.60 టీఎంసీల నిల్వ సామర్థ్యమున్న ఈ ప్రాజెక్టు గేట్ల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉంది. మొత్తం 18 గేట్లు ఉండగా తాజా వరదలకు 12వ నంబరు గేటు తెరచుకోలేదు. మూడేళ్ల క్రితం రెండో నంబరు గేటుకు సంబంధించి కౌంటర్‌ వెయిట్‌ ఊడిపోయి నీరంతా వృథాగా పోయింది.
  • ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రం సమీపంలో ఉండే కుమురం భీం ప్రాజెక్టు నిల్వ సామర్థ్యం 10.93 టీఎంసీలు. రెండు కాల్వల కింద 45,500 ఎకరాల ఆయకట్టు ఉంది. ఇటీవలి వరదలకు ఆనకట్ట చివరి భాగం దెబ్బతింది. దీంతో మరింత నష్టం వాటిల్లకుండా ఆనకట్టపై పాలిథిన్‌ కవర్‌ కప్పారు. ప్రాజెక్టు విద్యుత్‌ బిల్లుల బకాయిలు రూ.14 లక్షలు దాటడంతో ఏడాది క్రితం సరఫరాను నిలిపివేశారు. గేట్ల నిర్వహణను పూర్తిగా జనరేటర్‌ ఆధారంగా చేపడుతున్నారు.
  • ఆసిఫాబాద్‌ జిల్లాలోనే ఉన్న వట్టివాగు ప్రాజెక్టు నిల్వ సామర్థ్యం 2.89 టీఎంసీలు. 24,500 ఎకరాల ఆయకట్టు ఉంది. రూ.2 లక్షల బిల్లులు పెండింగ్‌లో ఉండటంతో విద్యుత్‌ శాఖ మొన్నటి వరకు త్రీఫేజ్‌ సరఫరాను నిలిపివేసింది. ఈ అంశంపై ‘ఈనాడు’లో కథనం వచ్చాక.. విద్యుత్‌ పునరుద్ధరణకు చర్యలు చేపట్టారు.
  • సూర్యాపేట జిల్లాలో ఉన్న మూసీ ప్రాజెక్టు గేటు ఒకటి రెండేళ్ల క్రితం నిర్వహణ లోపంతో తెరుచుకోలేదు.

ఇవీ చూడండి

ABOUT THE AUTHOR

...view details