తెలంగాణ

telangana

ETV Bharat / city

'విచక్షణాధికారాలకు తావు లేకుండా.. పారదర్శకంగా, సులభంగా..'

రాష్ట్రంలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. రిజిస్ట్రేషన్ల కోసం ముందస్తు స్లాట్ల బుకింగ్ ప్రారంభం కాగా.... సోమవారం నుంచి రిజిస్ట్రేషన్లు జరగనున్నాయి. పూర్తి పారదర్శకతతో అధికారులకు ఎలాంటి విచక్షణాధికారాలు లేకుండా రిజిస్ట్రేషన్లు జరుగుతాయని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. 96శాతం వరకు సేవలను అందుబాటులోకి తెస్తున్నామన్న ప్రభుత్వం.. ఎల్​ఆర్​ఎస్​ లేని వాటికి సంబంధించి కూడా త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది.

By

Published : Dec 11, 2020, 7:39 PM IST

cs somesh kumar started slot booking services
'పారదర్శకంగా, సులభంగా, ఎటువంటి విచక్షణాధికారాలకు తావు లేకుండా'

రాష్ట్రంలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం

రాష్ట్రంలో గత మూడు నెలలుగా నిలిచిపోయిన వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. రిజిస్ట్రేషన్ కోసం ముందస్తుగా స్లాట్ బుక్ చేసుకోవడం తప్పనిసరి చేసిన పరిస్థితుల్లో స్లాట్ల అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైంది. ఈ ప్రక్రియను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ సచివాలయంలో లాంఛనంగా ప్రారంభించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయాలకు అనుగుణంగా, హైకోర్టు ఆదేశాల ప్రకారం రిజిస్ట్రేషన్ ప్రక్రియ పారదర్శకంగా, సులభంగా, ఎటువంటి విచక్షణాధికారాలకు తావు లేకుండా జరుగుతుందని సీఎస్​ తెలిపారు.

ఆన్‌లైన్ పద్ధతిలో...

ఆస్తుల నిర్ధారిత విలువల ప్రకారం ఆన్‌లైన్ పద్ధతిలో, నెట్ బ్యాంకింగ్ ద్వారా చలాన్ అనుగుణంగా చెల్లింపులు చేసి ఆ తర్వాత బుక్ చేసుకున్న స్లాట్‌కు అనుగుణంగా సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలకు వెళ్లాల్సి ఉంటుందని సోమేశ్​ కుమార్ వివరించారు. ఆధార్ వివరాలు ఇస్తే ఎలాంటి ఇబ్బందులూ ఉండబోవని, హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఆధార్ ఇవ్వని వారి కోసం కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. గతంలో 16 లక్షల లావాదేవీల్లో కేవలం 10 వేలు మాత్రమే స్లాట్ బుకింగ్ ద్వారా జరిగేవని... ఇక నుంచి వందశాతం స్లాట్ బుకింగ్ ద్వారానే జరుగుతాయని చెప్పారు.

టీపీఐఎన్​, పీటీఐఎస్​ ద్వారా..

రిజిస్ట్రేషన్ స్లాట్లను www.registration.telangana.gov.in వెబ్ సైట్ ద్వారా ఆన్‌లైన్​లో బుక్ చేసుకోవాల్సి ఉంటుంది, ఇందుకోసం ఆస్తిపన్ను చెల్లింపులకు సంబంధించిన టీపీఐఎన్​, పీటీఐఎస్​ సంఖ్యలను నమోదు చేయాల్సి ఉంటుంది. పన్నుచెల్లింపు సంఖ్యలు లేనివారు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకుంటే రెండు రోజుల్లో కేటాయిస్తామని సీఎస్ తెలిపారు. ప్రస్తుతం 96 నుంచి 97 శాతం వరకు రిజిస్ట్రేషన్ సర్వీసులను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు చెప్పారు. మిగతా సర్వీసులను కూడా త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తామని అన్నారు.

రోజుకు 24 స్లాట్​లే..

రిజిస్ట్రేషన్ పూర్తయిన వెంటనే ఈ-పాస్ బుక్ ఇస్తామని, ఆ తర్వాత ఏడు నుంచి పదిరోజుల్లోపు ముదురు ఎరుపురంగు పాసుపుస్తకాలు ఇస్తామని చెప్పారు. ప్రస్తుతానికి ప్రతి రిజిస్ట్రేషన్ కార్యాలయంలో రోజుకు 24 స్లాట్​లను కేటాయిస్తున్నామన్న సీఎస్.. డిమాండ్ మేరకు అవసరమైన చోట పెంచుతామని తెలిపారు. సాంకేతికంగా ఎదురయ్యే సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు బీఆర్కే భవన్​లోని వార్ రూంలో అధికారులు, సాంకేతిక నిపుణులు అందుబాటులో ఉంటారని సోమేశ్​ కుమార్ చెప్పారు. 24 లైన్లతో ప్రత్యేకంగా 18005994788 నంబర్ కాల్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు వివరించారు.

ఇవీ చూడండి:రైతు ఖాతాలో 4 వందల కోట్లు... చేతికి పైసా రావట్లేదు...!

ABOUT THE AUTHOR

...view details