CS Somesh Kumar Review on Rains: భారీ వర్షాల నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ అన్ని జిల్లాల కలెక్టర్లతో దృశ్య మాధ్యమ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నెలకొన్న పరిస్థితులను సీఎస్ సమీక్షించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని.. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను సీఎస్ ఆదేశించారు.
రాష్ట్రంలో గత మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నందున కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని.. ప్రాణ, పశువులు, ఆస్తినష్టం జరగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. కలెక్టరేట్లో కంట్రోల్ రూం ఏర్పాటు చేసి నిఘా పెంచాలని కలెక్టర్లను సీఎస్ ఆదేశించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల నీటిపారుదల, పంచాయతీరాజ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, ఇంధన శాఖలు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సూచించారు.