తెలంగాణ

telangana

ఘోరంగా విఫలమైన నిఘా వ్యవస్థ.. మంత్రి, ఎమ్మెల్యేల నివాసాలకు నిప్పు...

By

Published : May 25, 2022, 8:47 AM IST

ఏపీలోని అమలాపురంలో విధ్వంసానికి పోలీసుల వైఫల్యమే కారణమనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఆందోళనలు తీవ్రరూపం దాల్చి... రాష్ట్ర మంత్రి , అధికార పార్టీ ఎమ్మెల్యే నివాసాలకే నిప్పుపెట్టడం, ప్రాణ భయంతో ఉన్నవారిని అక్కడి నుంచి తరలించాల్సిన పరిస్థితులు తలెత్తటం, ఏకంగా జిల్లా ఎస్పీపైనే రాళ్లదాడి జరగడం, ఆయన్ను మిగతావారు కాపాడాల్సి రావడం వంటి ఘటనలు కొన్ని దశాబ్దాలుగా రాష్ట్రంలో జరగలేదు. రాష్ట్రంలో..... శాంతిభద్రతలు ఎంతలా దిగజారిపోయాయో చెప్పేందుకు అమలాపురంలో జరిగిన ఘటనలే నిదర్శనంగా నిలుస్తున్నాయి.

POLICE FAILURE
POLICE FAILURE

ఏపీలోని అమలాపురంలో మంగళవారం నాటి భారీ విధ్వంసానికి పోలీసుల వైఫల్యమే ప్రధాన కారణమైంది. ప్రజాగ్రహం, ఆందోళన తీవ్రరూపం దాల్చి సాక్షాత్తూ రాష్ట్ర మంత్రి, అధికార పార్టీ ఎమ్మెల్యే నివాసాలకే నిప్పు అంటించటం, వాటిలో ప్రాణభయంతో ఉన్నవారిని అక్కడి నుంచి తరలించాల్సిన పరిస్థితులు తలెత్తటం, ఏకంగా జిల్లా ఎస్పీపైనే రాళ్ల దాడి, ఆయన్ను మిగతావారు కాపాడాల్సి రావడం వంటి ఘటనలు కొన్ని దశాబ్దాలుగా రాష్ట్రంలో జరగలేదు. రాష్ట్రంలో శాంతిభద్రతలు ఎంతలా దిగజారిపోయాయో చెప్పేందుకు మంగళవారం నాటి ఘటనలే తార్కాణం.

గత అనుభవాలు ఉన్నా..కుల సమీకరణాల పరంగా అత్యంత సున్నిత ప్రాంతమైన కోనసీమలో చిన్న వివాదం కూడా పెద్ద పెద్ద ఘర్షణలకు దారితీసిన అనుభవాలు గతంలో చాలా ఉన్నాయి. అలాంటిచోట జిల్లా పేరు మార్పుపై అభ్యంతరం తెలుపుతూ గత నాలుగైదు రోజులుగా భారీ నిరసనలు చేపడుతూనే ఉన్నారు. అవి తీవ్రరూపం దాల్చక ముందే పరిస్థితి అంచనా వేసి జాగ్రత్తపడాల్సిన ఆ విషయంలో పోలీసులు ఘోరంగా విఫలమయ్యారు. నిరసనలు తెలుపుతున్న వారి అభ్యంతరాలేంటో చర్చల ద్వారా తెలుసుకోలేకపోయారు. వాటి ఫలితమే.. మంగళవారం నాటి విధ్వంసం.

ముందస్తు అంచనా.. నియంత్రణ ఏదీ..?కొత్త జిల్లాల ఏర్పాటు సందర్భంగా తొలుత కోనసీమ పేరిట జిల్లాను ఏర్పాటుచేసిన రాష్ట్ర ప్రభుత్వం.. దాని పేరును డా.బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాగా మారుస్తూ ఈ నెల 18న ప్రాథమిక నోటిఫికేషన్‌ జారీచేసింది. దానిపై అభ్యంతరాల స్వీకరణకు 30 రోజులు గడువిచ్చింది. అమలాపురం కలెక్టరేట్‌లో లిఖితపూర్వకంగా అభ్యంతరాలు అందజేయాలని పేర్కొంది. ప్రాథమిక నోటిఫికేషన్‌ జారీ కాగానే పేరు మార్పునకు వ్యతిరేకంగా పలువురు సంఘటితమయ్యారు. ‘కోనసీమే ముద్దు... మరే పేరూ వద్దేవద్దు’ అంటూ ఈ నెల 20న అమలాపురంలో ఆందోళనలు నిర్వహించారు. వేలమంది చేరి కలెక్టరేట్‌ గేట్లు తోసేసి మరీ లోపలికి వెళ్లారు. తర్వాత సామాజిక మాధ్యమాల్లో సందేశాలు పంపించుకుని ఏకతాటిపైకి వచ్చారు. ఈ పరిస్థితి మరింత జటిలంగా మారకముందే అప్రమత్తం కావాల్సిన పోలీసులు తగిన ముందుజాగ్రత్త చర్యలు తీసుకోలేకపోయారు. కోనసీమలో జూన్‌ 30 వరకూ సెక్షన్‌ 144, సెక్షన్‌ 30 అమల్లో ఉంటాయని.. ర్యాలీలు, నిరసనలు, బహిరంగ సభలకు అనుమతి లేదని ప్రకటించారు. అయితే ఆ దిశగా తగిన కార్యాచరణ అమలు చేయటంలో విఫలమయ్యారు. కోనసీమ జిల్లా సాధన సమితి పిలుపు మేరకు మంగళవారం తలపెట్టిన కార్యక్రమానికి వేల సంఖ్యలో జనం తరలివస్తారనే విషయాన్ని ముందుగా అంచనా వేయలేకపోయారు. వందల్లోనే వస్తారని భావించి... వారిని నియంత్రించేందుకు వీలుగానే పోలీసు పికెట్లు, సిబ్బందిని ఏర్పాటు చేసుకున్నారు. అయితే వేల మంది యువకులు పోటెత్తటంతో వారిని అదుపు చేయటం పోలీసుల వల్ల కాలేదు.

పరిణామాల్ని ముందే అంచనా వేయకపోవటం వల్లే...పేరు మార్పుపై అభ్యంతరాలను కలెక్టరేట్‌కే పరిమితం చేయకుండా.. డివిజన్‌, మండల కేంద్రాల్లో కూడా తీసుకుంటే ఎక్కడి వారు ఉండేవారు. అందరూ అమలాపురం వచ్చే అవకాశం అంతగా ఉండేది కాదు. అభ్యంతరాలు ఇవ్వడానికే రోజూ వందలు, వేలల్లో అమలాపురం వచ్చేవారు. ఎక్కువమంది వస్తున్నారంటూ వారిపై ఆంక్షలు విధించారు. ప్రభుత్వం తమ అభ్యంతరాల్ని అసలు పట్టించుకోవట్లేదనే ఆందోళణే ఇంత పరిస్థితికి కారణమైంది. నిరసనలు తెలిపేందుకు కూడా అవకాశం లేకపోవటం, మంగళవారం పోలీసుల నుంచి ఎదురైన చర్యలతో నిరసనకారుల్లో నివురుగప్పిన నిప్పులా ఉన్న ఆవేశం కట్టలు తెచ్చుకుని ఉద్రిక్త పరిస్థితికి దారితీసింది. ఈ పరిణామాలన్నింటినీ ముందే అంచనా వేసి వాటికి ఆస్కారం ఇవ్వకుండా చూడాల్సిన నిఘా, పోలీసు యంత్రాంగం ఆ విషయంలో ఘోరంగా విఫలమైంది.

ఎలా నియంత్రించాలనేదానిపై కొరవడిన ప్రణాళిక..అమలాపురంలో నిరసనలకు ఏయే ప్రాంతాల నుంచి, ఎంతమంది వెళ్లే అవకాశం ఉంది? జనసమీకరణ ఏమైనా చేస్తున్నారా? ఇదంతా ఎవరి ఆధ్వర్యంలో జరుగుతోంది? అంచనాకు మించి జనం వస్తే వారిని ఎలా నియంత్రించాలి? అందుకు తగిన ప్లాన్‌-బీ ఏంటి? అనే అంశాల్లో పోలీసుల్లో ప్రణాళిక కొరవడింది. ముందస్తు నిఘా సమాచారసేకరణ లేకపోయింది. ప్రతిపక్షాలు, ప్రజా, ఉపాధ్యాయ, ఉద్యోగ, కార్మిక, మహిళాసంఘాలు సహా ఎవరైనా శాంతియుత నిరసనలు చేస్తామంటే వారిని ముందే అదుపులోకి తీసేసుకుని, గృహనిర్బంధం చేసేసి, వారిని ఎక్కడికక్కడే కట్టడి చేసే పోలీసులు... అమలాపురానికి వేలమంది తరలిరాకుండా నియంత్రించలేకపోయారు.

ఎస్పీని కాపాడాల్సిన పరిస్థితి వచ్చినా..ఏపీలో 13 జిల్లాలే ఉన్నప్పుడు అమలాపురంలో డీఎస్పీ స్థాయి అధికారి మాత్రమే ఉండేవారు. ఇటీవల జిల్లా కేంద్రంగా మారిన తర్వాత ఎస్పీ, అదనపు ఎస్పీ సహా విస్తృత స్థాయిలో పోలీసు యంత్రాంగం అక్కడి నుంచే పనిచేస్తోంది. అయినా పరిస్థితి తీవ్రతను ముందుగా గుర్తించలేకపోయారు. ఎస్సైగా ఉద్యోగంలో చేరి పదోన్నతులపై ఐపీఎస్‌ స్థాయికి చేరి, అసాధారణ అనుభవం కలిగిన ఎస్పీ సుబ్బారెడ్డి కూడా నిరసనకారుల రాళ్లదాడిలో తీవ్రంగా గాయపడ్డారు. ఆయన్ను మిగతా పోలీసులు కాపాడాల్సి వచ్చింది. ఎస్పీ పైనే దాడి జరిగే పరిస్థితి వరకూ అల్లర్లు చేరినా నియంత్రించలేకపోవటం పోలీసుల వైఫల్యానికి పరాకాష్ఠగా చెప్పొచ్చు.

ఎస్పీతోపాటు 30 మందికి గాయాలు..కోనసీమ జిల్లా పేరు మార్పును వ్యతిరేకిస్తూ ఆందోళనకారులు చేసిన రాళ్లదాడిలో ఎస్పీ సుబ్బారెడ్డితోపాటు సుమారు 30 మంది పోలీసులు గాయాలపాలయ్యారు. సుబ్బారెడ్డికి ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స అందిస్తుండగా, ఆరుగురు కానిస్టేబుల్స్‌, ఓ బస్సు డ్రైవర్‌, మంత్రి విశ్వరూప్‌ వంట మనిషికి ప్రాంతీయ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు సూపరింటెండెంట్‌ కె.శంకరరావు తెలిపారు. వారి ఆరోగ్యం నిలకడగా ఉందని ఆయన పేర్కొన్నారు.

న్యూస్‌టుడే’ ఫొటో విలేకరిపై దాడి : కోనసీమ పేరు మార్చొద్దంటూ అమలాపురంలో నిర్వహించిన ఆందోళన దృశ్యాలను చిత్రీకరించడానికి వెళ్లిన ‘న్యూస్‌టుడే’ ఫొటో విలేకరి శర్మపై నిరసనకారులు దాడిచేశారు. ఈ దాడిలో శర్మ గాయపడ్డారు. ఆయన దగ్గర ఉన్న విలువైన కెమెరా, సెల్‌ఫోన్‌ లాక్కొని, పగలగొట్టారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details