తెలంగాణ

telangana

By

Published : Oct 7, 2020, 2:58 PM IST

ETV Bharat / city

కొత్త వ్యవసాయ చట్టం వల్ల రైతులకు తీవ్ర నష్టం: సీపీఎం

కేంద్రం తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టం వల్ల రైతులకు తీవ్ర నష్టం కలుగుతుందని సీపీఎం నేతలు విమర్శించారు. హైదరాబాద్​లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ.రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై మండిపడ్డారు. కేంద్రం తీసుకొచ్చిన చట్టాలకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పోరాటం చేయడం లేదని ప్రశ్నించారు.

CPM
కొత్త వ్యవసాయ చట్టం వల్ల రైతులకు తీవ్ర నష్టం కలుగుతుంది: సీపీఎం

హాథ్రస్​ అత్యాచార ఘటన దేశాన్ని కుదిపేసిందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. ఘటనకు సంబంధించిన సమాచారం తెలుసుకునేందుకు వెళ్లిన జర్నలిస్ట్​లను పోలీసులు అరెస్ట్ చేయడాన్ని ఖండించారు. ఓ జర్నలిస్ట్​పై దేశ ద్రోహం కేసు పెట్టడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ ప్రభుత్వానికి దేశ ద్రోహం కేసులు పెట్టడం అలవాటుగా మారిపోయిందని మండిపడ్డారు. ప్రజాస్వామ్యం కల్పించిన స్వేచ్ఛను భాజపా ప్రభుత్వం కాలరాస్తోందని దుయ్యబట్టారు. అరెస్ట్ చేసిన జర్నలిస్ట్​ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

సామాన్యులు వ్యవసాయం చేయడం సాధ్యం కాదు

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో క్వశ్చన్ అవర్ లేకుండా చేయడాన్ని రాఘవులు తప్పుబట్టారు. కొత్త వ్యవసాయ చట్టం వల్ల రైతులకు తీవ్ర నష్టం కలుగుతుందన్నారు. రాబోయే రోజుల్లో సామాన్యులు వ్యవసాయం చేయడం కష్టసాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వ చేసిన చట్టాన్ని తెలంగాణలో అమలు చేయమని కేసీఆర్ స్పష్టం చేయాలని డిమాండ్​ చేశారు.

ఎందుకు పోరాటం చేయడం లేదు?

కేంద్రం తీసుకువచ్చిన చట్టాలకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం.. ఎందుకు పోరాటం చేయడం లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం కోసమే ఎల్ఆర్ఎస్ చట్టాలను తీసుకొచ్చిందని ఆరోపించారు. ఎల్ఆర్ఎస్ చట్టాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. రెండు పట్టభద్రుల స్థానాలు, దుబ్బాక ఉప ఎన్నికపై వామపక్షాలు ఐక్యంగా నిర్ణయాన్ని ప్రకటిస్తాయని స్పష్టం చేశారు.

ఇవీ చూడండి:ప్రభుత్వ సంస్థలే రైతుల వద్దకు వస్తాయి: కేసీఆర్

ABOUT THE AUTHOR

...view details