తెలంగాణ

telangana

ETV Bharat / city

కమలం.. కరోనా కంటే ప్రమాదం.. రాష్ట్రంలో బలపడనిచ్చేది లేదు: కూనంనేని

Kunamneni Sambasivarao Interview: రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసే దిశగా ప్రయత్నాలు మరింత ముమ్మరం చేస్తామని సీపీఐ రాష్ట్ర నూతన కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు. దేశంలో వామపక్షాల ప్రభావం కాస్త తగ్గినా.. పార్టీల ఉనికి చెక్కుచెదరలేదని వ్యాఖ్యానించారు. భాజపాను ఎదుర్కొవటానికి తెరాసతో చేతులు కలిపామని.. కానీ, ప్రజా సమస్యలపై వెనక్కి తగ్గేది లేదంటున్న సాంబశివరావు ఈటీవీ భారత్​ ముఖాముఖిలో కొన్ని విషయాలు వెల్లడించారు.

By

Published : Sep 11, 2022, 11:49 AM IST

Kunamneni Sambasivarao
Kunamneni Sambasivarao

కమలం.. కరోనా కంటే ప్రమాదం..!

Kunamneni Sambasivarao Interview: రాష్ట్రంలో సీపీఐకి పూర్వవైభవం తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తామని.. మిలిటెంట్‌ తరహా పోరాటాలతో ప్రజాసమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలిపారు. మతం ముసుగులో భాజపా రాష్ట్రంలో బలపడేందుకు ప్రయత్నిస్తోందని, నయానో, భయానో గెలిచేందుకు ఈడీ, సీబీఐ వంటి సంస్థల్ని దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. ఆ పార్టీ బలపడకుండా అడ్డుకుని తీరుతామని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే మునుగోడును తెరాస కోసం వదులుకున్నామన్నారు. సీపీఐ నూతన కార్యదర్శిగా ఎన్నికైన ఆయన ఈటీవీ-భారత్​కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పార్టీ ప్రణాళికలు, వ్యూహాలను వివరించారు. కరోనా కంటే భాజపా ప్రమాదరకమైనదని, దాన్ని అడ్డుకోవడానికి ఇతర పార్టీలతో పొత్తులు అవసరమన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ బలహీనపడుతోందని.. అందుకే తమ పార్టీ.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల పొత్తుల్లో సీపీఎంకు తొలి ప్రాధాన్యం, తెరాసకు మలి ప్రాధాన్యం ఇస్తుందని చెప్పారు.

సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా మీ ప్రాధాన్యాలు, లక్ష్యాలు ఏమిటి?
అనేక కారణాల వల్ల పార్టీ బలహీనపడింది. గతంలో ప్రతి రెండు, మూడు కుటుంబాల్లో ఒకదానికి పార్టీతో అనుబంధం ఉండేది. కార్పొరేట్‌ విద్యతో విద్యార్థులు కొంత దూరమయ్యారు. ఆయా వర్గాలతో మళ్లీ అనుసంధానమై పార్టీని బలోపేతం చేస్తాం. అనుబంధ విభాగాల్లో లక్షల మంది సానుభూతిపరులున్నా ఓట్లుగా మారట్లేదు. ఆ పరిస్థితిలో మార్పు తీసుకువస్తాం.

బలమైన మునుగోడునే వదులుకున్నారు.. ఈ స్థితిలో రాష్ట్రంలో పార్టీ నిలదొక్కుకునే పరిస్థితి ఉంటుందా?
ఎన్నికల క్షేత్రంలో పడుతూ.. లేస్తున్నాం. గ్రామపంచాయతీలు, మండల పరిషత్తుల్లో పొత్తులు లేకుండా సొంతంగా బలపడేందుకు ప్రయత్నిస్తాం. గతంలో కొత్తగూడెం స్థానాన్ని ఇతర పార్టీలకు వదిలిపెట్టినా 2009లో నేను అక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచా. మునుగోడు విషయమూ తాత్కాలికమే. భాజపాను నిలువరించడం, మా ఓటుబ్యాంకు చెదిరిపోకుండా ఉండేందుకే తెరాసతో పొత్తు.. ఇది సంపూర్ణ మద్దతు కాదు. సార్వత్రిక ఎన్నికల్లో సీపీఐ మునుగోడులో పోటీ చేస్తుంది. భాజపా ప్రమాదం రోజురోజుకు పెరుగుతోంది.

అసెంబ్లీ ఎన్నికల్లోనూ తెరాసతో పొత్తంటున్నారు.. ఎన్ని స్థానాలు కోరుకుంటారు?
భాజపాను నిలువరించే దిశగానే పొత్తులుంటాయి. సాధారణ ఎన్నికల నాటికి 25-30 స్థానాల్లో పార్టీని బలోపేతం చేస్తాం. ఉమ్మడి జిల్లాలు- ఖమ్మంలోని కొత్తగూడెం, భద్రాచలం, పినపాక, వైరా, పాలేరు.. నల్గొండలోని దేవరకొండ, మునుగోడు.. కరీంనగర్‌లో హుస్నాబాద్‌, ఆదిలాబాద్‌లో బెల్లంపల్లి సహా కొన్ని స్థానాలున్నాయి. కొత్తగూడెం నుంచి నేను కచ్చితంగా పోటీ చేస్తా. ఉభయ కమ్యూనిస్టు పార్టీల మధ్య సైద్ధాంతిక భేదాభిప్రాయాలు, వైరుధ్యాలు తగ్గుతున్నాయి. రెండు పార్టీల శ్రేణులు ఏకీకరణను కోరుకుంటున్నాయి. ఈసారి ఎన్నికల పొత్తుల్లో మా తొలి ప్రాధాన్యం సీపీఎంకే. కలిసే పోటీ చేస్తాం.

ప్రజా సమస్యలపై బలమైన ఉద్యమాలు ఎందుకు చేయలేకపోతున్నారు?
మాపై ప్రభుత్వాల నిర్బంధం పెరుగుతోంది. ముందే అరెస్టు చేస్తున్నారు. దీనికి ప్రతివ్యూహాల్ని ఆలోచిస్తున్నాం. పోడు భూములు, ఇళ్ల సమస్యలపై ఉద్యమాలు ఉద్ధృతం చేస్తాం. సింగరేణి, ఆర్టీసీ వంటి సంస్థల్ని కాపాడుకోవడం, పేదలకు ఆరోగ్యం, విద్య, యువతకు ఉద్యోగాలపై పోరాటాలు మా ప్రాధాన్య అంశాలు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details