తెలంగాణ

telangana

రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంపై కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ దెబ్బ

By

Published : May 7, 2021, 4:49 PM IST

Updated : May 7, 2021, 7:50 PM IST

రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతుండడంతో ఆ ప్రభావం స్థిరాస్తి రంగంపై తీవ్రంగా పడింది. నిర్మాణాలతో పాటు క్రయవిక్రయాలు దాదాపు ఆగిపోయాయి. ఇప్పటికే అధిక భాగం వలసకూలీలు సొంత రాష్ట్రాలకు వెళ్లిపోగా... ఉన్న వారితోనే కొందరు బిల్డర్లు నెట్టుకొస్తున్నారు. భారీ నిర్మాణాలు జరిగే చోట.. అధిక సంఖ్యలో కూలీలు పని చేస్తుండగా.. కొవిడ్‌ మార్గదర్శకాలు అమలయ్యేలా చర్యలు తీసుకున్నామని క్రెడాయ్‌ ప్రతినిధులు వెల్లడిస్తున్నారు. పరిస్థితి అంత ప్రమాదకరంగా లేదంటున్నారు. ఇలాగే కొనసాగితే మాత్రం కష్టమేనని చెబుతున్నారు.

realestate
realestate

రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంపై కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ దెబ్బ

రాష్ట్రంలో ఊపందుకున్న నిర్మాణ రంగంపై కొవిడ్‌ మరోసారి పంజా విసురుతోంది. ఇతర రాష్ట్రాల కంటే ఎక్కువ నిర్మాణాలు రాష్ట్రంలో మొదలైనా.. కరోనా దెబ్బతో ఎక్కడికక్కడే నిలిచిపోతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లో.. శరవేగంగా నిర్మాణాలు జరుగుతుండగానే సిమెంటు, స్టీలు, ఇసుక, కంకర, ఇతర ముడి పదార్ధాల ధరలు పెరిగాయి. ఆ ప్రభావం చిన్న బిల్డర్లపై పెద్దఎత్తున పడింది. ప్రస్తుతం కరోనా దెబ్బకు మరింత ప్రభావం పడింది. రెండు, మూడు వందల మంది కూలీలతో రద్దీగా ఉండే నిర్మాణ ప్రాంతాలు బోసిపోయి కనిపిస్తున్నాయి. గడిచిన 20 రోజులుగా రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసులు అధికంగా నమోదు అవుతున్నాయి. కొందరు బిల్డర్లు కరోనా బారినపడి హోం ఐసోలేషన్‌లో ఉంటుండగా యాభై సంవత్సరాలు దాటిన బిల్డర్లు ఇంటి గడప దాటడం లేదు. ఫలితంగా నిర్మాణాలు దాదాపుగా నిలిచిపోయాయి. తుది దశకు చేరిన భవనాల్లో చిన్నచిన్న పనులు అందుబాటులో ఉన్న కూలీలతో పూర్తి చేస్తున్నారు.

కొవిడ్‌ను ఎదుర్కొనేందుకు మాస్కులు ఇస్తున్నారు. రక్షణ కోసం శిరస్త్రాణం వంటివి ధరించి పనిచేస్తున్నాం. కంపెనీ నుంచి శానిటైజర్‌ తదితర సదుపాయాలు కల్పిస్తున్నారు. కొవిడ్‌కు సంబంధించి ఎలాంటి ఇబ్బందుల్లేవు. కొవిడ్‌ టెస్టులు కూడా చేయించుకున్నాం. ఎవరికీ పాజిటివ్‌ రాలేదు. అందరికీ నెగెటివ్‌ వచ్చింది.

పనులకు రావాలంటే భయం..

బయట రాష్ట్రాలకు చెందిన వలస కూలీలు అధిక భాగం సొంతూళ్లకు వెళ్లపోగా స్థానిక కూలీలు.. పనులకు రావడానికి భయపడుతున్నారు. లాక్‌డౌన్‌ సమయంలో వలస కూలీల బాగోగులు చూసుకున్న బిల్డర్లు ఇప్పుడు కూడా వారికి అండగా ఉండేందుకు సిద్దంగా ఉన్నారని క్రెడాయ్‌ ప్రతినిధులు తెలిపారు. నిర్మాణ కార్మికులందరికి వ్యాక్సిన్‌ వేయించడంతోపాటు లాక్‌డౌన్‌ వంటి పరిస్థితులు వస్తే.. వసతి, భోజనం ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు.

నిర్మాణ రంగంలో కార్మికులే కీలకం.. వారి యోగక్షేమాలు చూడడం ద్వారానే రియల్‌ ఎస్టేట్‌ భవితవ్యం ఆధారపడి ఉంటుందని బిల్డర్లు అభిప్రాయపడుతున్నారు. వలస కూలీలు ఇక్కడే ఉండేలా ఏర్పాట్లు చేస్తే సమస్య కొంత పరిష్కారం అవుతుందని చెబుతున్నారు.


ఇవీ చూడండి:రాష్ట్రంలో కొవిడ్‌ పాజిటివ్‌ రేటు.. తీవ్రత తగ్గే అవకాశం

Last Updated : May 7, 2021, 7:50 PM IST

ABOUT THE AUTHOR

...view details