తెలంగాణ

telangana

By

Published : Jul 1, 2021, 1:10 PM IST

ETV Bharat / city

Covid Effect: నర్సరీలపై కరోనా ప్రభావం.. అమ్మకాలు లేక ఆర్థిక భారం

లాక్‌డౌన్‌ ప్రభావం నర్సరీలపైనా తీవ్రంగా పడింది. వర్షాకాలం ప్రారంభంలో నర్సరీలకు సహజంగా అధిక సంఖ్యలో జనాలు వస్తారు. సాధారణ సమయాల్లో మొక్కల కొనుగోలు చేసేందుకు వచ్చేవాళ్లతో సందడిగా ఉండేది. కరోనా ప్రభావంతో రెండేళ్లుగా అసలు జనాలే ఉండట్లేదు. దీంతో ఏపీలోని కడియం నర్సరీ యజమానులు, కూలీలు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు.

covid effect on kadium nurseries
నర్సరీలపై కరోనా ప్రభావం

నర్సరీలపై కరోనా ప్రభావం.. అమ్మకాలు లేక సంక్షోభం

ఆహ్లాదాన్ని పంచే వాతావరణం.. వేల రకాలు మొక్కలు.. సుగంధాలు వెదజల్లే పూలు. కనువిందు కలిగించే భిన్నరంగుల్లోని మొక్కలు. పర్యావరణ ప్రియులకు, మొక్కలు పెంచేవాళ్లకు కడియం నర్సరీలంటే ప్రత్యేకంగా పరిచయం చేయక్కర్లేదు. ఆంధ్రప్రదేశ్​లో తూర్పుగోదావరి జిల్లాలోని ఈ ప్రాంతం మొత్తంగా పచ్చదనంతో ఎప్పుడూ కళకళలాడుతూ ఉంటుంది. కరోనా ప్రభావంతో..గత రెండేళ్లుగా నర్సరీ పరిశ్రమ చతికిలబడింది.

'కరోనా ప్రభావంతో నర్సరీకి వినియోగదారులు లేక మొక్కల అమ్మకాలు చాలా తగ్గిపోయాయి. దీంతో కూలీలను పోషించడం యజమానులకు ఇబ్బందికరంగా మారింది. ఆర్థిక సమస్యలు ఎదురైనప్పటికీ మా యజమానులు మాకు జీతాలు ఇచ్చి ఆదుకుంటున్నారు.' -వీవీఎస్​ మూర్తి, పల్లా వెంకన్న నర్సరీలో కూలీ

'పర్యావరణపరంగా చూస్తే కడియం నర్సరీలో చాలా మంచి వాతావరణం ఉంటుంది. పుట్టినరోజు, ఇతర ఫంక్షన్లకు ఇక్కడకు వచ్చేవాళ్లం. కానీ ఇప్పుడు పరిస్థితి చాలా మారిపోయింది. పరిసరాలన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి. ప్రభుత్వం చొరవ తీసుకొని అభివృద్ధి చర్యలు తీసుకుంటే బాగుంటుంది.' -సుబ్రహ్మణ్యం, సందర్శకుడు

మొక్కలు కొనేవాళ్లు లేక, సందర్శకులు రాకపోవటంతో నర్సరీ యజమానులు ఆర్థికంగా చితికిపోతున్నారు. వేసవిలో మొక్కల సంరక్షణకు కూలీలు అందుబాటులో లేక తీవ్రంగా ఇబ్బందులు పడిన పెంపకందారులు.. అష్టకష్టాలు పడి మొక్కలను సంరక్షించినా కొనేవాళ్లు లేక మరింత సతమతమవుతున్నారు. కడియం నర్సరీలు 5 వేలకుపైగా ఎకరాల్లో విస్తరించి ఉన్నాయి. ప్రత్యక్షంగా 60 వేల మంది పరోక్షంగా మరో 50 వేల మంది ఆధారపడి జీవనం సాగిస్తున్నారు.

'కరోనా ప్రభావంతో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే మొక్కల దిగుమతులు ఆగిపోయాయి. దీంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ప్రత్యక్షంగా 50వేల మంది, పరోక్షంగా 60 వేల మంది ఉపాధి పొందుతున్న వారు దెబ్బతిన్నారు.' -రాజశేఖర్,​ సత్యదేవా నర్సరీ నిర్వాహకుడు

బ్యాంకుల నుంచి కోట్లాది రూపాయల రుణం తీసుకొచ్చి పెట్టుబడి పెట్టామని నర్సరీ నిర్వాహకులు తెలిపారు. సీజన్​ ప్రకారం అమ్మకాలు లేకపోతే చాలా నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని వాపోయారు. కరోనా మూడో దశ వస్తే పరిస్థితి ఇంకా తీవ్రంగా ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు.

కొవిడ్‌తో కనీసం నర్సరీలవైపు వచ్చేవారే కరవయ్యారు. నిత్యం పెరుగుతున్న డీజిల్ ధరలు మరింత కోలుకోలేని దెబ్బ తీశాయి. ప్రస్తుతం లాక్ డౌన్, కర్ఫ్యూ సడలింపులతో ఎగుమతులు కాస్త పెరుగుతున్నాయి. అయినా.. ప్రకృతి ప్రేమికులు, సందర్శకులు మాత్రం ఇంకా పెద్దగా నర్సరీలవైపు రావడం లేదు. డిమాండ్‌ ఎక్కువగా ఉన్నప్పుడే కరోనా తీవ్ర ప్రభావం చూపిందని.. మూడోదశ కరోనా వస్తే అసలు వ్యాపారాలు కొనసాగించలేమని నర్సరీ నిర్వాహకులు వాపోతున్నారు.

ఇదీ చదవండి:KTR: మొదలైన ఏడో విడత హరితహారం... మొక్కలు నాటిన మంత్రి కేటీఆర్

ABOUT THE AUTHOR

...view details