తెలంగాణ

telangana

By

Published : Jun 29, 2020, 5:19 AM IST

Updated : Jun 29, 2020, 7:05 AM IST

ETV Bharat / city

ఊపిరాడ్తలేదు డాడీ.. సెల్ఫీ వీడియోలో కరోనా బాధితుడి ఆర్తనాదం

హైదరాబాద్‌ ఎర్రగడ్డ ఛాతీ ఆసుపత్రిలో ఓ వ్యక్తి మృతి కలకలం రేపింది. మరణయాతన పడుతూ ఆయన చేసిన సెల్ఫీ వీడియో ప్రతీ ఒక్కరి గుండెలను పిండేసింది. అర్ధరాత్రి వేళ శ్వాస అందక.. చివరి క్షణంలో తాను పడుతున్న బాధను తండ్రికి చెప్పాలన్న ఆరాటం.. తన బాధ అందరికీ తెలపాలన్న ఆవేదనతో యువకుడు పంపిన సెల్ఫీ వీడియో హృదయాలను కలచివేస్తోంది.

corona patient died in Hyderabad chest hospital
ఊపిరాడ్తలేదు డాడీ.. సెల్ఫీ వీడియోలో కరోనా బాధితుడి ఆర్తనాదం

ఊపిరాడ్తలేదు డాడీ.. సెల్ఫీ వీడియోలో కరోనా బాధితుడి ఆర్తనాదం

హైదరాబాద్ ఛాతీ ఆస్పత్రిలో చికిత్స కోసం వచ్చిన వ్యక్తి ఊపిరాడక మృతిచెందిన ఘటన కలచివేస్తోంది. ఊపిరాడక పడిన నరకయాతన గురించి చెబుతూ సిబ్బంది పట్టించుకోవడం లేదని సెల్ఫీ వీడియోలో వాపోయాడు. అది తండ్రికి చేరకముందే కన్నుమూశాడు. లోపం ఎక్కడున్నా...చివరకు అతడి ప్రాణం మాత్రం గాలిలో కలిసిపోయింది. కన్నవారికి గర్భశోకం మిగిల్చింది. తనను నమ్ముకున్న భార్యా, పిల్లలను దిక్కులేని వారిని చేసింది.

ఎన్ని ఆస్పత్రులు తిరిగినా..

సికింద్రాబాద్‌ జవహర్‌నగర్‌కు చెందిన రవికుమార్‌ సౌదీ నుంచి రెండేళ్ల క్రితమే నగరానికి వచ్చాడు. కొద్దికాలంగా సొంతింటి నిర్మాణ పనుల్లో ఉన్నాడు. ఈనెల 23న శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారింది. తండ్రి వెంకటేశ్వర్లును వెంటబెట్టుకుని రెండు రోజులు సికింద్రాబాద్‌, బంజారాహిల్స్‌, పంజాగుట్ట, ఈసీఐఎల్‌లోని కార్పొరేట్‌, ప్రైవేట్‌ ఆసుపత్రులు తిరిగాడు. తన కొడుకును కాపాడాలని తండ్రి వేడుకున్నా ఎవరూ చేర్చుకోలేదు. ఈనెల ఓ ప్రైవేట్‌ ల్యాబ్‌లో కరోనా పరీక్ష నమూనాలిచ్చాడు. అదే రోజు ఆరోగ్యం మరింత ఇబ్బందిగా మారడం వల్ల నిమ్స్‌కు వెళ్లాడు. అక్కడ వైద్యుల సలహాతో ఛాతీ ఆసుపత్రిలో చేరాడు.

వీడియో తండ్రి చూసేసరికే..

రవికుమార్‌ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండడంతో వైద్యులు ఆక్సిజన్‌ అమర్చారు. 26 రాత్రి తనకు వెంటిలేటర్‌ తొలగించారని, ఊపిరాడటం లేదని...బతిమలాడినా మళ్లీ పెట్టలేదంటూ తన బాధనంతా రవికుమార్‌ సెల్ఫీ వీడియో రూపంలో తీసుకుని తండ్రి ఫోన్‌కు పంపాడు. కాసేపటికి వీడియో చూసిన తండ్రి వెంకటేశ్వర్లు.. గదిలోకి వెళ్లేసరికే మృత్యువుతో పోరాడుతూ రవికుమార్‌ తుదిశ్వాస విడిచాడు. రవికుమార్‌కు కరోనా పాజిటివ్‌ వచ్చిందని ఆ మర్నాడు నివేదిక వచ్చింది.

కొడుకు ఊపిరాడక పడిన బాధను చూసి తట్టుకోలేకపోయానని తండ్రి వెంకటేశ్వర్లు కన్నీటి పర్యంతమయ్యారు. ఛాతీ వ్యాధి ఆస్పత్రిలో ఆక్సిజన్‌ అందించకపోవడం వల్లే తన కొడుకు మృతిచెందాడని ఆరోపించారు.

రవికుమార్‌కు చికిత్స సరిగానే అందించామని ఛాతీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ మహబూబ్‌ఖాన్‌ వివరించారు. అసలు అతడికి వెంటలేటరే పెట్టలేదని.. తొలగించామనడం సరికాదన్నారు.

జవహర్ నగర్‌లో రవికుమార్‌ అంత్యక్రియల్లో పాల్గొన్న సుమారు 30మంది బంధువుల సమాచారాన్ని అధికారులు సేకరిస్తున్నారు.

ఇవీచూడండి:కరోనాపై ఆందోళన అవసరం లేదు.. అన్నీ సిద్ధంగా ఉన్నాయి: కేసీఆర్

Last Updated : Jun 29, 2020, 7:05 AM IST

ABOUT THE AUTHOR

...view details