తెలంగాణ

telangana

ETV Bharat / city

ఆ నగరంలో ప్రకంపనలు సృష్టిస్తున్న దసపల్లా హిల్స్​ - ap latest news

Dasapalla Lands: ఏపీలోని విశాఖ నగర నడిబొడ్డున ఉన్న దసపల్లా భూముల క్రమబద్ధీకరణ వివాదం రాజుకుంటోంది. ఇప్పటివరకు నిషేధిత జాబితాలో ఉన్న భూములను.. దాని నుంచి తప్పించి దోచుకునేందుకు వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి పావులు కదిపారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అల్లుడు, కూతురి పేరిట బినామీ కంపెనీ ఏర్పాటు చేయించి.. వారికి ఆ భూములను దోచిపెట్టే కుట్రలు చేశారని జనసేన కొన్ని డాక్యుమెంట్లను విడుదల చేసింది. ఈ వ్యవహారం ఇప్పుడు నగరంలో ప్రకంపనలు సృష్టిస్తోంది.

Dasapalla Lands
Dasapalla Lands

By

Published : Oct 2, 2022, 1:18 PM IST

Dasapalla Lands: ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ నగరంలో అత్యంత కీలకమైన ప్రాంతం దసపల్లా హిల్స్.. గవర్నర్ బంగ్లాగా వ్యవహరించే ఏపీ ప్రభుత్వ అతిథి గృహంతో పాటు ఉన్నతాధికారుల నివాసాలు ఇక్కడే ఉన్నాయి. నగరంలో అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో ఇది ఒకటి. ఇక్కడ 60 ఎకరాలకు పైగా భూమిలో 16 ఎకరాలు న్యాయ వివాదాల్లో ఉంది. ఇది రికార్డుల్లో ప్రభుత్వ భూమిగానే ఉంది. నగరం నడిబొడ్డున ఉన్న ఈ భూమి విలువ దాదాపు 2 వేల కోట్ల రూపాయల పైమాటే. ఈ భూమి ఇప్పటి వరకు 22ఏ అంటే రిజిస్ట్రేషన్ నిషేధిత జాబితాలో ఉంది.

ఈ భూములపై కన్నేసిన వైకాపా ఎంపీ విజయ్‌సాయిరెడ్డి.. వీటిని క్రమబద్ధీకరించేందుకు చక్రం తిప్పినట్లు విపక్షాలు ఆరోపిస్తున్నాయి. తొలుత తన మనుషులైన ఉమేశ్‌, గోపీనాథ్‌రెడ్డితో ఒక బినామీ కంపెనీ, కుమార్తె, అల్లుడితో మరో బినామీ కంపెనీ ఏర్పాటు చేయించారని తెలిపారు. దసపల్లా భూములు కొనుగోలు చేసిన వారితో తన బినామీ కంపెనీలకు భూమి రిజిస్ట్రేషన్​ చేయించుకున్నారని తెలిపారు. రిజిస్ట్రేషన్ ఖర్చులు 9.75 కోట్లు సైతం కుమార్తె బినామీ కంపెనీ నుంచే చెల్లించినట్లు.. జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్‌ ఆరోపించారు. ఈ సొమ్ము అవ్యాన్ రియాల్టర్స్‌ నుంచి ఎష్యూర్ డెవలపర్స్‌కు మళ్లినట్లు తన వద్ద ఆధారాలు ఉన్నాయన్నారు.

దసపల్లా భూములపై సీబీఐ విచారణ జరపాలంటూ గతంలో మంత్రి అమర్నాథ్ డిమాండ్ చేశారని.. ఆయన కోరిక మేరకే ఇప్పుడు దర్యాప్తు జరిపించాలని విపక్ష నేతలు డిమాండ్ చేశారు. గవర్నర్ బంగ్లా నుంచి దసపల్లా భూముల వరకు ర్యాలీగా తరలివెళ్లి మంచినీటి ట్యాంకు ఎక్కి నిరసన తెలిపారు. నిషేధిత జాబితా నుంచి తమ భూములు తొలగించాలని పేదలు పెట్టుకున్న అర్జీలు పట్టించుకోని అధికారులు.. దసపల్లా భూములకు మాత్రం ఆఘమేఘాల మీద అనుమతులు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు.

ఈ వ్యవహారంపై పూర్తి స్దాయిలో నిజాలు వెల్లడి కావాలంటే ఈడీ లేదా సీబీఐతో విచారణ చేయించాలని విపక్షాలు డిమాండ్ చేశారు. భూ లావాదేవీలలో అనుమానాలు, పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నందున నిషేధిత 22ఏ జాబితా నుంచి దసపల్లా భూములు తొలగించవద్దని కోరారు.

విశాఖలో ప్రకంపనలు సృష్టిస్తున్న దసపల్లా హిల్స్​..

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details