తెలంగాణ

telangana

ETV Bharat / city

కాంగ్రెస్​ నేతల మధ్య విబేధాలను రగుల్చుతున్న పురపోరు - muncipal elections

తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీలో పురపాలక ఎన్నికలు నాయకుల మధ్య అగ్గి రాజేస్తున్నాయి. ఎన్నికల్లో అధిక స్థానాలు దక్కించుకోడానికి పీసీసీ ఏర్పాటు చేసిన కమిటీలపై సీనియర్‌ నేతలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. అధికార పార్టీ కారు వేగానికి బ్రేకులు వేసేందుకు పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్న పీసీసీలో సీనియర్‌ నేతల అసంతృప్తి పెల్లుబుకుతోంది. మాజీ పీసీసీ ఇంట్లో సమావేశమైన మరో ఇద్దరు సీనియర్లు ఇవాళ ఏఐసీసీ ఇన్​ఛార్జిని కలిసి తమ అసంతృప్తిని వెళ్లగక్కారు.

Congress Seniors_Disputes in telangana
కాంగ్రెస్​ నేతల మధ్య విబేధాలను రగుల్చుతున్న పురపోరు

By

Published : Jan 6, 2020, 7:22 AM IST

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ సీనియర్‌ నేతల మధ్య నివురు గప్పిన నిప్పులా ఉన్న విబేధాలు బట్టబయలయ్యాయి. కలిసిమెలిసి పోతున్నట్లు నటిస్తున్న కొందరు సీనియరు నేతలు అవకాశం దొరికినప్పుడల్లా పీసీసీపై కత్తులు దూస్తున్నారు. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల తరువాత అధికార పార్టీ తెరాస దెబ్బకు కుదేలైన కాంగ్రెస్‌ ఇప్పటికీ కోలుకోలేకపోతోంది. ఇప్పటికైనా కలిసిమెలిసి పని చేసి అధికార పార్టీ ఎత్తులను చిత్తు చేసే దిశలో ముందుకు వెళ్లడం లేదు. పీసీసీ నిర్ణయాలను కొందరు సీనియర్లు తప్పుబడుతున్నారు.

సీనియర్​ నేతల మధ్య విబేధాలు

ఇలాంటి పరిస్థితులే తాజాగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌లో నెలకొన్నాయి. మున్సిపల్‌ ఎన్నికలు కాంగ్రెస్‌ సీనియర్‌ నేతల మధ్య విబేధాలను రగిల్చేస్తున్నాయి. అధికార పార్టీని దీటుగా ఎదుర్కొనేందుకు వీలుగా ప్రణాళికలు సిద్ధం చేసుకున్న పీసీసీ... అభ్యర్థుల ఎంపిక వ్యవహారం అంతా కూడా స్థానిక డీసీసీలకే అప్పగించింది. ఎన్నికల నోటిఫికేషన్‌కు... నామినేషన్లు దాఖలుకు తగినంత వ్యవధి లేకపోవటం వల్ల త్వరితగతిన పూర్తి చేసేందుకు అనువుగా పీసీసీ కార్యవర్గాన్ని, సీనియర్ నేతలను అన్ని రకాలుగా ఉపయోగించుకునే దిశలో పీసీసీ ముందుకు వెళ్లుతోంది.

సీనియర్లకు పుర ఎన్నికల బాధ్యతలు

ఎన్నికలు జరిగే ప్రతి మున్సిపాలిటీకి, నగరపాలక సంస్థకు పీసీసీ ఇన్​ఛార్జిలను నియమించింది. అధికార పార్టీ వైఖరిని ఎండగట్టగలిగే సీనియర్లకు ప్రచారం నిర్వహించే బాధ్యతను అప్పగించింది. ఎన్నికలతో పెద్దగా సంబంధం లేని నేతలను ఇతర పనులు చక్కబెట్టేందుకు పురమాయించింది. సీనియార్టీతోపాటు ఆయా ప్రాంతాలపై పట్టున్న నాయకులను దృష్టిలో ఉంచుకుని నగరపాలక సంస్థల ఇన్​ఛార్జిలుగా నియమించింది. ఎంపీలైన రేవంత్‌ రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, కోమటి రెడ్డి వెంకటరెడ్డిలతో పాటు జానా రెడ్డి లాంటి సీనియరు నేతలకు వారి పరిధిలోని మున్సిపాలిటీల్లో...నగర పాలక సంస్థల్లో కాంగ్రెస్‌ అభ్యర్ధులను గెలిపించుకునే బాధ్యతలను అప్పగించారు. ఇదే సమయంలో శుక్రవారం రోజున మాజీ ఉప ముఖ్య మంత్రి దామోదర్‌ రాజనర్సింహ, మాజీ పీసీసీ అధ్యక్షుడు వి.హనుమంతురావులు మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఇంట్లో సమావేశమై సుదీర్ఘంగా చర్చించారు. ఎన్నికలపై అవగాహన లేని వారిని కమిటీల్లో వేశారని, ఇది పార్టీకి తీవ్ర నష్టం కలిగించే కార్యక్రమంగా అభిప్రాయపడినట్లు తెలుస్తోంది.

ఉత్తమ్​పై కుంతియాకు ఫిర్యాదు

ఆదివారం మధ్యాహ్నం ఈ ముగ్గురు సీనియర్లు ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్​ఛార్జి ఆర్సీ కుంతియాను కలిసి పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డిపై ఫిర్యాదు చేశారు. గోల్కొండ హోటల్‌లో కలిసి దాదాపు రెండున్నర గంటలపాటు పలు అంశాలను కుంతియా దృష్టికి తెచ్చారు. ఉత్తమ్‌ కుమార్ రెడ్డి ఏకపక్ష నిర్ణయాలతో పార్టీకి తీవ్ర నష్టం జరుగుతోందని ఫిర్యాదు చేశారు. మున్సిపల్ ఎన్నికల సమన్వయ కమిటీల నియామకంలో తమను పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ తీవ్ర అవమానానికి గురి చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు.

కార్పొరేషన్​ స్థాయికి పరిమితం చేయడం ఏంటి?

పార్టీలో సీనియర్ నాయకులుగా ఉన్న తమను కేవలం ఒక కార్పొరేషన్ స్థాయికి పరిమితం చేయడం ఏంటని నిలదీశారు. కుంతియా దృష్టికి అన్ని విషయాలు తెచ్చామని...ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూస్తామని... ఎలాంటి స్పందన రానట్లయితే అప్పటికప్పుడు ఏమి చేయాలో నిర్ణయం తీసుకుంటామని ఆ ముగ్గురిలో ఒక సీనియర్‌ నేత తెలిపారు.

ఇవీ చూడండి: "ఉత్తమ్​పై.. అధిష్ఠానానికి సీనియర్ల ఫిర్యాదు"

ABOUT THE AUTHOR

...view details