బల్దియా ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ కసరత్తు వేగవంతం చేసింది. తెలంగాణకు గుండెకాయలాంటి హైదరాబాద్ మహానగరంలో అధికార తెరాసతోపాటు భాజపా, ఎంఐఎంను ఎదుర్కోవాల్సిన పరిస్థితి కాంగ్రెస్ది. గత గ్రేటర్ ఎన్నికల్లో ఘోర వైఫల్యాలను చవిచూసిన కాంగ్రెస్ తిరిగి పునరావృతం కాకుండా చర్యలు మొదలుపెట్టింది. దీనికి తోడు... పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్కం ఠాగూర్... నేతల్లో కదలిక తెచ్చారు. పార్టీ సినియర్లను సైతం కలగలుపుకుని ముందుకెళ్లుతున్నారు. పార్టీలో అంతర్గత విబేధాలు లేవన్న భావన తీసుకొచ్చారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో పార్టీ నేతలంతా బాధ్యతగా పని చేశారు.
ఎదురుదాడి చేసే స్టార్ క్యాంపెయినర్లు
దుబ్బాక ఉప ఎన్నికలో విభేదాలను పక్కన పెట్టి ఎవరికి వారు అప్పగించిన పని చేసి... మొట్టమొదటిసారి కాంగ్రెస్లో ఐక్యత ఉందన్న భావన తీసుకొచ్చారు. పార్టీ నేతలంతా ఒకటి కావడం వల్ల బల్దియా ఎన్నికల్లో కూడా అదే మాదిరిగా పని చేసేందుకు బూతు స్థాయి వరకు ఇంఛార్జ్లను నియమించి... విస్తృత ప్రచారం నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్దం చేసుకుంటోంది. ప్రత్యర్థి పార్టీలపై విరుచుకుపడి ఎదురుదాడి సత్తా కలిగిన నాయకులను కొందరిని స్టార్ క్యాంపెయిన్లుగా నియమించాలని పీసీసీ యోచిస్తోంది. ప్రధానంగా ఎంపీ రేవంత్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి వారిని నియమించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.