'మున్సిపల్ చట్టంపై కోర్టును ఆశ్రయిస్తాం' మున్సిపాల్టీ హక్కులను కలెక్టర్లకు ఇవ్వడం కేసీఆర్ నిరంకుశత్వానికి నిదర్శనమని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. గతంలో హరితహారం విఫలమైనప్పుడు కేసీఆర్, మంత్రులు రాజీనామా చేశారా అంటూ ప్రశ్నించారు. ఆర్టీఐని నిర్వీర్యం చేసే చట్ట సవరణకు గులాబీ పార్టీ ఎంపీలు మద్దతు పలకడం భాజపా, తెరాస పార్టీల బంధానికి అద్దం పడుతోందని ధ్వజమెత్తారు.
రాష్ట్రంలో తెరాసకు కాంగ్రెస్ మాత్రమే ప్రత్యామ్నాయమని వచ్చే ఎన్నికల్లో అధికారం తమదేనని ఉత్తమ్ ధీమా వ్యక్తం చేశారు. భాజపా కేవలం అర్బన్ పార్టీ మాత్రమేనన్నారు. గాంధీభవన్లో ఉత్తమ్, శ్రీధర్బాబు ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు.
మున్సిపల్ చట్టం.. రాజ్యాంగ విరుద్ధం
మున్సిపల్ చట్టాన్ని, ఆర్డినెన్స్ రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు అన్నారు. ఆర్టికల్ 74ను కేసీఆర్ నీరుగార్చే కుట్ర చేశారని ఆరోపించారు. సరైన సవరణలు చేశాకే మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. గవర్నర్ సూచించిన అన్ని సవరణలు ప్రభుత్వ ఆర్డినెన్స్లో లేవని తెలిపారు. కేవలం ఎన్నికల నిర్వహణ అధికారానికి సంబంధించిన సవరణ మాత్రమే ఆర్డినెన్స్ చేశారని వెల్లడించారు.
కోర్టును ఆశ్రయిస్తాం
బీసీ రిజర్వేషన్ల విషయంలో స్పష్టత లేదని... బీసీ హక్కులను కేసీఆర్ హరిస్తున్నారని హస్తం నేతలు ఆరోపించారు. బీసీ రిజర్వేషన్ అంశంపై కోర్టును ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు.