తెలంగాణ

telangana

ETV Bharat / city

emerald statue : ప్రకాశం జిల్లాలో మరకత విగ్రహం మతలబేంటి..? - EMERALD STATUE in AP

EMERALD STATUE: ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో విలువైనదిగా ప్రచారమవుతున్న మరకత పచ్చ పంచముఖ గణేశుడి పురాతన విగ్రహం స్వాధీనం పోలీసు వర్గాల్లోనే కాకుండా రాజకీయంగానూ చర్చకు తావిస్తోంది. రెండున్నర అడుగుల ఎత్తు, రెండడుగుల వెడల్పుతో 90 కిలోల బరువున్న ఈ విగ్రహాన్ని కొందరు రూ.25 కోట్లకు విక్రయించేందుకు బేరసారాలు సాగిస్తున్నట్టు ఒంగోలు క్రైం బ్రాంచి పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో వారే కొంటామంటూ నమ్మబలికి అక్కడికి వెళ్లారు.

emerald statue
emerald statue

By

Published : Jun 14, 2022, 11:50 AM IST

EMERALD STATUE : ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో విలువైనదిగా ప్రచారమవుతున్న మరకత పచ్చ పంచముఖ గణేశుడి పురాతన విగ్రహం స్వాధీనం పోలీసు వర్గాల్లోనే కాకుండా రాజకీయంగానూ చర్చకు తావిస్తోంది. అది పురాతన విలువైన విగ్రహమేనా? విగ్రహానికి సంబంధించిన పత్రాలను చూపించి తమదని నిరూపించుకోవాలని నిందితులకు వారం సమయం ఇవ్వడమేంటి? వంటి ప్రశ్నలకు సమాధానాలు లభించాల్సి ఉంది. రెండున్నర అడుగుల ఎత్తు, రెండడుగుల వెడల్పుతో 90 కిలోల బరువున్న ఈ విగ్రహాన్ని కొందరు రూ.25 కోట్లకు విక్రయించేందుకు బేరసారాలు సాగిస్తున్నట్టు ఒంగోలు క్రైం బ్రాంచి పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో వారే కొంటామంటూ నమ్మబలికి అక్కడికి వెళ్లారు. యర్రగొండపాలెం-వినుకొండ రోడ్డులోని మారం వెంకటేశ్వరరెడ్డికి చెందిన షెడ్డులో విగ్రహాన్ని ఈనెల 10న స్వాధీనం చేసుకున్నారు. విగ్రహాన్ని అక్కడి పోలీసులకే అప్పగించి తిరిగి వచ్చేశారు. ఇక్కడ పోలీసుల వ్యవహార శైలి అనుమానాలకు తావిస్తోంది. ఒక రోజు ఆలస్యంగా కేసు నమోదైంది. విగ్రహం అసలు వ్యవహారం హైదరాబాద్‌లోని బాచుపల్లి పోలీసుస్టేషన్‌ పరిధిలో ఐదేళ్ల కిందట కొన్ని రోజులపాటు నడిచిందని పోలీసులు చెబుతున్నారు.

గతంలో యర్రగొండపాలెం పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్‌రెడ్డి, ఆయన అల్లుడు.. హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఇంద్రసేనారెడ్డి న్యాయస్థానం ద్వారా విగ్రహానికి సంబంధించిన హక్కులు పొందారని అంటున్నారు. కలిసి రావడం లేదనే కారణంతో విగ్రహాన్ని కొన్ని రోజులు దాచాలని యర్రగొండపాలేనికి చెందిన మారం వెంకటేశ్వరరెడ్డికి ఇంద్రసేనారెడ్డి ఇచ్చారని పోలీసులు చెబుతున్నారు. విగ్రహం రూ.కోట్ల విలువైనదని ప్రచారమవడంతో ఇద్దరు మంత్రులు రంగప్రవేశం చేశారని, దీంతో పోలీసులు కేసును నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నారనే విమర్శలున్నాయి. కోర్టు ఉత్తర్వులు ఉండటంతోపాటు విలువైనది కాదనే కారణంతో స్థానిక పోలీసులకు విగ్రహాన్ని అప్పగించి వచ్చేసినట్లు ఒంగోలు క్రైం బ్రాంచ్‌ పోలీసులు చెబుతున్నారు.

వైకాపా నేత ఇంట్లో.. రూ.25 కోట్ల మరకత విగ్రహమా?:రాష్ట్రంలో వైకాపా వాళ్లు కొల్లగొట్టిన హిందూ దేవుళ్ల విగ్రహాల్లో ఒకటి మాత్రమే.. ప్రకాశం జిల్లాలోని వైకాపా పార్టీ నేత ఇంట్లో మరకత వినాయకుడి రూపంలో బయటపడిందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఆరోపించారు. జగన్‌రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైకాపా శ్రేణులు ఆలయాలపై దాడులు చేసి, తెదేపా వారిపై ఆరోపణలు చేశారని సోమవారం ఓ ప్రకటనలో విమర్శించారు. ‘ప్రకాశం జిల్లాకు చెందిన వైకాపా నేత వెంకటేశ్వరరెడ్డి ఇంట్లో రూ.25 కోట్ల విలువచేసే మరకత విగ్రహం బయటపడిందంటే.. ఆ పార్టీకి చెందిన మిగతా నాయకుల ఇళ్లల్లో ఎన్ని పురాతన విగ్రహాలు ఉన్నాయో? అంతర్వేది రథం దగ్ధం, దుర్గమ్మ రథంలో వెండి సింహాల మాయం, రామతీర్థం క్షేత్రంలో రాముడి విగ్రహం తలభాగం నరికివేత ఘటనల్లో నేటికీ నిందితులు దొరకలేదు. వైకాపా పాలనలో ప్రజలకే కాదు, దేవాలయ ఆస్తులు, విగ్రహాలకూ రక్షణ లేకుండా పోయింది. తక్షణం రాష్ట్రంలోని ఆలయాల్లో కేంద్ర బృందం పర్యవేక్షణలో తనిఖీలు జరిపించాలి’ అని లోకేశ్‌ డిమాండ్‌ చేశారు.

ABOUT THE AUTHOR

...view details